Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగాం మాగాణంలో...ఎక్కడ తవ్వినా యుద్ధ జ్ఞాపకాలే...
పాతిపెట్టిన ప్రతియోధుని చేతిలో పోరాట ఆయుధాలే...
''తెలంగాణ వీరులం, తెగువ కలిగిన బిడ్డలం, మాతృదేశ ముక్తి కోసం పోరు సలుప కదిలినాం. తరతరాల నుండి మేము సాగు చేసే భూమినంత లాగుకున్న దేశ్ముఖుల సాగనంప దలచినాం. వెట్టి పనులు కట్టిపెట్టి జబర్దస్తీ నెగురగొట్టి, స్వేచ్ఛగాను బతుకు కొరకు ఐక్యమై నిలిచినాం. మిలిటరనగ ఎంతరా! వాని బిశాదెంతరా? దౌడు తీయ వెంట తగిలి తరిమి తరిమి కొట్టుదాం. తెలంగాణ వీరులం తెగువ కలిగిన బిడ్డలం.''
అంటూ అనునిత్యం మనుషుల గురించి ధ్యానమే గానీ, అతనికి మరణం గురించి ద్యాసే లేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భగ్గుమని లేచిన ఒకానొక అగ్నిశిఖ నల్లా సరహింహులు. ప్రాణాన్ని పోరాటంలో ఫణంగా పెట్టి ఉరిశిక్షను సైతం లెక్క చేయని యోధుడతడు.
ఆయన పుట్టినది, పెరిగినది కడవెండి. దొడ్డి కొమురయ్య ఊరది. 1926 అక్టోబర్ 2న లచ్చమ్మ, లచ్చయ్య తల్లిదండ్రులకు జన్మించాడు. నిరుపేద చేనేత కార్మిక కుటుంబం. ఏడో తరగతి. ఉర్దూ చదువు. హైదరాబాద్ సంస్థానం. ముస్లిం మతతత్వంతో కూడుకున్న ఫ్యూడల్ నియంతృత్వ వ్యవస్థ. ఈ వ్యవస్థకు భూస్వాములు, జాగీర్దార్లు, దేశ్ముఖులు, ముఖ్తేదార్లు మూల స్థంభాలు. ఆ దోపిడీ వర్గంలో విసునూరు దేశ్ముఖ్ (రాపాక రాంచంద్రారెడ్డి) ఒకడు. కడవెండి అతని ఏలుబడికి కేంద్రం. ఆ గ్రామంలో అతని తల్లి జానకమ్మ దొరసాని కిరాతకత్వం వెయ్యిన్నొక్క రూపాలు ధరించిన రోజులవి. అనేక లూటీలు, దౌర్జన్యాలు. రైతుల దగ్గర మంచి భూమి కనబడితే ఆ భూమి ఆమె పరం చేయాల్సిందే. అలా నరసింహులు కుటుంబం కూడా బలైంది. దొరసాని బాధలకు తట్టుకోలేక తండ్రి తన పదవ ఏటనే చనిపోయాడు. సచ్చినా చేసిన అప్పులు ఉంటే నగానట్రా అమ్మగా బాకీ పూడ్చుకున్నది దొరసానమ్మ. పక్క గ్రామం మడిపడిగెలో సంఘం పెట్టి, వెట్టి గొట్టాలు ఎగరగొట్టిన సంగతి తెల్సుకుని నరసింహులు పది మందిని కూడగట్టుకొని భోనగిరి ఆంధ్ర మహాసభకు పోయిండు. అంతే అక్కడ నుంచి సంఘం, పోరాటం, దళాలు, శిక్షణ, గడీలపై దాడులు, రజాకార్ల దాడులను ఎదుర్కొంటూనే రహస్య జీవితం గుడుపుతున్న రోజులవి. ''ప్రజారాజ్యం స్థాపిస్తాం'' అంటూ కమ్యూనిస్టు దళాలు ఊర్లో ప్రవేశించేవి. గ్రామ చావడి వద్దకు దళ సభ్యులు వచ్చే సరికి సంఘం వాళ్లు వచ్చారని ఊరు ఊరంతా కదిలేది ఉపన్యాసాలు, పాటలు ఉత్తేజితుల్ని చేసేవి. తెలంగాణ హౌమగుండం వలే మండుతుంది. యువకులకు పని లేదు. పిల్లలకు చదువు లేదు. పెద్దలకు బతుకుల మీద ఆశలు లేవు. రజాకార్ల భయానికి సంపన్నులు ఆస్తిపాస్తులు వదిలేసి నగానట్రా అమ్ముకొని ఊర్లు విడిచి వలసెళ్లారు. ఊర్లన్నీ పాడుబడిన పాటి దిబ్బల వలె కన్పించేవి. ఉరుము ఉరిమినా మెరుపు మెరిసినా రజాకార్ల లారీలు గ్రామానికి వస్తు న్నాయంటే ఊరంతా బెగ్గంపాడు అయ్యేది. జనగామా ప్రాంత దళ నాయకుడిగా ప్రతిఘటనా రంగంలోకి దిగాడు నర్సింహులు.. మూడో తరగతి చదువుకున్న తన భార్య వజ్రమ్మతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఉద్యమ వ్యాప్తి, గెరిల్లా శిక్షణ, దొరల గడీలపై గుండాలపై ప్రతిఘటన, వ్యూహరచన, గ్రామ రక్షక దళాల ఏర్పాటు, ఉద్యమ నిర్మాణమే అతని లోకమైంది.
మొట్టమొదటి తిరుగుబాటు తన స్వంత ఊరు కడవెండి నుండి మొదలుపెట్టి అనూహ్యంగా తన సహచరుడు, వీరుడు దొడ్డి కొమురయ్యను కోల్పోయాడు. అదే రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ అయ్యింది. ఆయుధాలు సమకూర్చుకున్నారు. సాయుధులుగా శిక్షణ తీసుకున్నారు. క్రమశిక్షణ కమ్యూనిస్టుల ఆయుధం. అదెప్పుడూ మరిచిపోలేదు. దొరలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నర్సింహలు దళాన్ని చంపాలని ఉదయం 7 గంటలకల్లా కడవెండికి 200 మంది పోలీసులు చేరి ఇల్లు ఇల్లు గాలించి ''నల్లా నరసింహను పట్టించి ఇవ్వండి, ఆచూకీ తెలపండి'' అంటూ అప్పుడే కోసి తెప్పించిన పచ్చి ఈత బరిగెలతో వందలాది జనాలను చిత్ర హింసలు పెట్టినా, స్టేషన్ల పెట్టినా ఆపై నల్లగొండ జైలుకు పంపినా దళం గురించి గానీ, నర్సింహులు గురించి గానీ నోరు విప్పలేదు. అదీ కడవెండి ప్రజల నిబద్ధత.
''రాజకీయంగా శత్రువుల స్త్రీలపై దౌర్జన్యం చేశామన్న అపవాదుకు ఆస్కారమివ్వకూడదన్న గెరిల్లా క్రమశిక్షణ మాది'' అంటాడు నర్సింహులు. దొడ్డి కొమురయ్యను చంపడంలో ముఖ్య పాత్ర వహించిన భూస్వామి గడ్డం నరసింహారెడ్డి ఇంట్లోకి వెళ్లిన దళాన్ని దొరసాని పతి బిక్ష పెట్టమని వేడుకుంటే వదిలేసి వచ్చారు.
బందగీ వీరోచిత ప్రతిఘటన ఆపై హత్య, చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం, ఆకునూరు, మాచిరెడ్డి పల్లి తిరుగుబాట్లు, తిమ్మాపురం, అల్లీపురం ఒక్కవంతులగూడెం, మేళ్ల చెరువు ఊచకోతలు, మరోవైపు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి మా భూమి నాటకాన్ని 128దళాలు 980ప్రదర్శనలివ్వగా 18లక్షలమంది తిలకించి ఉత్తేజితులవ్వడం, జెండా పండుగ నాడే పర్కాలలో భయంకర సామూహిక హత్య, బైరాన్పల్లి మూకుమ్మడి కాల్చివేత, స్త్రీలను బారిబాతల బతుకమ్మలాడించడం, 118మంది స్త్రీలను చెరిచి కాల్చడం మొదలైన ఘటనలతో తెలంగాణ నిప్పుల కొలిమై నాలుగు చెరుగులా ఉద్యమం వ్యాపించింది. లక్షలాది మంది నిరక్షరాస్యుల సుశిక్షిత సైన్యం దొరలగడీలపై, నిజాం పోలీసు క్యాంపులపై మెరుపుదాడులు చేస్తూ అప్పు పత్రాలను కాలబెడ్తూ, ప్రజా కోర్టులో దొరలను నిలబెట్టి శిక్షిస్తూ వేలకొలది ఎకరాలను విముక్తి చేస్తూ హైదరాబాద్ నగరానికి కూడా వ్యాపించి అనేక డెన్లు, కమ్యూనిస్టుల కమ్యూన్ల ఏర్పాట్లు, అజ్ఞాత దళాల రహస్య కదలికలతో నిజాం సేనలు గజగజలాడాయి. మూడు సార్లు ఉరి శిక్షలు విధించి నల్ల నరసింహులుకు టైగర్ ఆఫ్ తెలంగాణ టైటిల్ ఇచ్చారు సైనిక గవర్నర్ జె.ఎస్.చౌదరి. జిల్లా ఎస్పీ ధన్రాజ్ నాయుడు, డాక్టర్ జయసూర్య జనగామా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు నరసింహులు గురించి ప్రజలు చెప్పినప్పుడు ''జనగాం సింహం'' అని బిరుదును ప్రకటించి పత్రికలకిచ్చారు.
నరసింహులు భార్య వజ్రమ్మ సాయుధ పోరాట యోధురాలు. అడవిలో సకాలంలో తిండి లేక బలహీనంగా ఉండటం వల్ల అనేక సార్లు గర్భస్రావం జరిగింది. చివరకు జైలులోనే ఆడ పిల్లకు జన్మనిచ్చింది. జీవితంలోనే కాదు పోరాటంలోను ఆయనకు సహచరిణిగా నిలిచింది. ఆయనను పెట్టని జైళ్లు లేవు. ప్రతి జైళ్లో ఏదోరకంగా తప్పించుకునే ప్రయత్నాలు చేయడం, పోలీసులకు పట్టుబడటం ఆపై కఠోర శిక్షలనుభవించడం అలవాటుగా మారింది. ఇంకో 12 గంటల్లోనే ఉరి శిక్ష వేయబోతున్నారని తెలిసినా గుండె చెదరక నిర్భయంగా నిలిచిన యోధుడతడు. చివరి దశలో అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల ఆందోళన ఫలితంగా ఉరి శిక్ష నిలిపివేయబడింది. చిరునవ్వుతోనే చావును సైతం ఎదురొడ్డిన చైతన్యకేతనం ఆయన. ప్రజలను ఉత్తేజపరిచిన ఉత్తుంగ తరంగం. 1993నవంబర్ 5న తుదిశ్వాస విడిచాడు. నిన్నటి తరం నిబద్ధసేనాని, నేటి తరానికి నిలువెత్తు చుక్కాని- నల్లా నర్సింహులు. ఆయనకు అర్పిద్దాం అరుణాంజలి.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్: 9490098343