Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవుడు సంఘజీవి, చుట్టూ వివిధ కుటుంబాలకు చెందిన మానవ సముదాయాల మధ్య నేడు మానవుడు తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ మానవ కుటుంబాలు కలిగి ఉన్న వ్యవస్థనే మనం సమాజం అంటున్నాం. సమాజంలో కేవలం మానవ సమూహాలే కాకుండా, చుట్టూ ఉండే పర్యావరణం కూడా భాగమని గుర్తించాలి. అప్పుడే మానవుడు ఆరోగ్యకర మైన, ఆహ్లాదరకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. మానవుడు తనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఎంత అందంగా కాపాడుకుంటాడో అంత అందమైన జీవితాన్ని సాధించుకోగలుగుతాడు. పర్యావరణాన్ని ధ్వంసం చేయడం ప్రారంభిస్తే వ్యవస్థలో అనర్థాలు ప్రారంభమవుతాయి. దురదృష్టవశాత్తు నేడు పర్యావరణ వ్యవస్థ రోజురోజుకూ ధ్వంసమవుతోంది. మనచుట్టూ వుండే చెట్లను మనమే నరికివేస్తున్నాం. మనకు కావాల్సిన ప్రాణవాయువును ఆ చెట్లే విడుదల చేస్తున్నాయన్న విషయాన్ని మరిచిపోతున్నాం.
పెద్ద పెద్ద కర్మాగారాలు స్థాపించి అందులో నుంచి బయటకు వచ్చే వ్యర్థ పదార్థాలను సరైన అవగాహన లేకుండా నీటిలోకి, పారే నదుల్లోకి, చెరువుల్లోకి వదిలేస్తున్నాం. దీనివల్ల చెరువులు, నదులు, ఇలా ఎక్కడ వదిలితే అక్కడ ఆ నీరంతా కలుషితమైపోతుంది. ఆ వాస్తవాన్ని గ్రహించని ప్రజలు ఆ నీటిని వాడినప్పుడు రోగ గ్రస్థులవుతున్నారు. వింత వింత వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ వ్యర్థ పదార్థాలు అవి పారుతున్న ప్రాంతంలోనూ, నిలువవున్న ప్రాంతాలలోను నీటితోపాటు భూమిని కూడా కలుషితం చేస్తున్నాయి. భూమి పొరలలో ఉండే నీటి నిల్వలు, పంటలకు ఉపయోగపడే ఖనిజాలు, లవణాలు వీటివల్ల కలుషితమవుతున్నాయి. దానివల్ల సరైన పంటలు పండే అవకాశంలేదు. దిగుబడి తగ్గుతుంది, నేలలో సారం తగ్గితే దాని ప్రభావం పంటల దిగుబడి మీద ఉంటుంది.
ఇక ఆధునిక మానవుడు ఉపయోగించే వాహనాలవల్ల, రసాయన కర్మాగారాల వల్ల రోజురోజుకు అడ్డూ అదుపు లేకుండా పెనుకాలుష్యం గాలిలోకి వదలబడుతూ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ కలిగిన ఈ వ్యర్థ వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతోంది. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. మానవ నివాస ప్రాంతాల మీద ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టకపోతే రాబోయే తరాలకు మనం సరైన వ్యవస్థను అందించలేకపోతాం. మన సుఖజీవనం కోసం ఉపయోగించే ఏసీ లు, రిఫ్రిజిరేటర్ల వల్ల అందులోనుండి క్లోరోఫోరోకార్బన్లు బయటకు వచ్చి వాతావరణంలోని అయనోస్పియర్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కాలుష్య కారకాల వల్ల వాతావరణ పొరలకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల సూర్యకిరణాలలోని విషపూ రిత కిరణాలు భూమిని తాకుతున్నాయి. తత్కారణంగా భూమి వేడె క్కుతుంది. రేడియేషన్ ప్రభావం వల్ల మానవుని భౌతిక శరీరంమీద ఆ కిరణాలు సోకి అనేక చర్మ సంబంధ వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఒకదానితో మరొకటి పెనవేసుకొని మానవ వినాశనానికి కారణాలవుతున్నాయి. వీటిని మనం చూస్తూ వదిలివేస్తున్నాం. కాని, ఈ ముప్పు రాబోయే రోజుల్లో మరింత పెద్దదిగా మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తుంది. చివరికి భూమి మీద మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇలా మానవుడే జల, వాయు, భూమి కాలుష్యానికి కారణభూ తుడవుతున్నాడు. సముద్రాలు, చెరువులనుండి ఇంకిపోయిన నీటి భాష్పం మేఘాలను ఏర్పరుస్తుంది. ఈ మేఘాలలో కూడా విషపూరిత క్లోరోఫ్లోరో కార్బన్లు చేరి అక్కడ విషపూరిత మేఘాలు ఏర్పడి ఆమ్లవర్షాలు కురుస్తున్నాయంటే, మనిషి తన చుట్టూ వుండే పర్యావరణాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నాడో, కలుషితం చేస్తు న్నాడో, అర్థం చేసుకోవచ్చు. అడవులను స్వార్థ ప్రయోజనాల కోసం నరికి వేస్తున్నాడు. దానివల్ల వర్షపాతం తగ్గిపోతోంది. బయటకు విసర్జితమయ్యే కార్బన్డైఆక్సైడ్ వంటి విషయవావులను చెట్లు గ్రహించడానికి మొక్కలు లేని పరిస్థితిని మానవుడే కల్పిస్తున్నాడు. ఈ జీవావరణ వ్యవస్థలో మనిషి తన చుట్టూ వుండే ఆవరణాన్ని ఎలా దెబ్బతీస్తున్నాడో తెలుసుకోవడానికి ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. శబ్దకాలుష్యం కూడా ఇవాళ మనిషిని పట్టి పీడుస్తోంది. మన చెవులు వినడానికి వీలులేని డెసిబుల్స్ను నిర్లక్ష్యంగా సృష్టిస్తూ శబ్దకాలుష్యానికి కారణమవుతున్నాం. ఇది సమాజం మీద రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంమీద మనిషి తన చుట్టూ ఉండే ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడన్నది వాస్తవం. అది తన మనుగడకే ప్రమాదమని తెలిసికూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది రాబోయే తరాలమీద తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ప్రకృతిలోని ఈ శక్తులను కాపాడుకోవాల్సిన అవసరముంది. పర్యావరణాన్ని రక్షించుకోవాలి. మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. ఇది మామూలుగా చెపితే సరిపోదు. పర్యావరణ సమతుల్యం కోసం దీనిని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలి. పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే చెట్లూ నాటాలి. కాబట్టి, ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.
( మార్చి 23 పర్యావరణ దినోత్సవం)
- తోట నాగేష్
సెల్ : 9912764580