Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏం సార్? బీజేపీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద తలకాయలు చేరబోతున్నాయంట నిజమేనా? డీకే అరుణ తర్వాత ఎవరు రాబోతున్నరు? అని సమాచారం కోసం బీజేపీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతను సీనియర్ జర్నలిస్టు అడిగారు. 'ఏమో తెల్వదయ్య' అంటూ ఆ నేత దాటవేశారు. మళ్లీమళ్లీ అడిగితే అంతా పైకెల్లి నడుస్తుందయ్యా? మా చేతులల్లో ఏముందయ్యా? ఇగో గీ ఆఫీసుమీద రాడార్లు తిరుగుతున్నయి. చర్చలు జరుగుతున్నయి. ఫలప్రదమైతే దిగుతయి. లేకుంటే గీ ఆఫీసుపైనే చక్కర్లు గొడుతున్నయి' అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల చర్చల గురించి చమత్కరించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు. వెంటనే మరో జర్నలిస్ట్ అందుకుని 'ఢిల్లీ స్థాయి నేతల ద్వారా చర్చలు జరుగుతున్నయి రాష్ట్రస్థాయి నేతలదేం లేదంటవ్? ఇక్కడున్నోళ్లకు చేతకాక అధిష్టానం రంగంలోకి దిగిందా? అయినా, వేరే పార్టీల నుంచి వచ్చే నేతలంతా డమ్మీలై పార్టీ వీడుతున్నరు. వాస్తుదోషం పట్టినట్టున్నది. ముందు బిల్డింగ్ను చక్కదిద్దండి' అంటూ అందుకున్నరు. మీ ఇష్టమయ్యా.. మీరేమన్నా అనుకోండి..! అంటూ ఆ నేత అక్కడ నుంచి జారుకున్నారు.
- ఎ.ప్రశాంత్