Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల వేడి రాజుకుంటున్నది. రాజకీయ పార్టీలు తమ ఆయుధాలను పరస్పరం సంధిస్తున్నాయి. కేంద్రంలో అధికార పీఠం నిలబెట్టుకోడానికి బీజేపీ పావులు కదుపుతున్నది. రాష్ట్రంలో స్వతంత్రంగా ఎక్కడా గెలవగల స్థితిలో బీజేపీ లేదు. కానీ కాంగ్రెసు, టీఆర్ఎస్లలో టికెట్లు రాని కోటీశ్వరులకు కమలం అందించి పోటీలోకి దింపడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. మరోవైపు 16 స్థానాలు తాను గెలవాలనీ, ఒకటి ఎంఐఎం గెలవాలనీ టీఆర్ఎస్ పట్టుదలగా ఉన్నది. రాష్ట్రంలో బీజేపీకి సందివ్వకుండానే కేంద్రంలో మాత్రం మోడీ ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ కొనసాగిస్తున్నది. ఫెడరల్ ఫ్రంటు నినాదాన్ని అవసరార్థం, అప్పుడప్పుడు వాడటమే తప్ప... అందుకోసం నిజాయితీతో కృషి చేసిందే లేదు. కాంగ్రెసు, బీజేపీ ముక్తభారత్ నినాదం కూడా అంతే. కేంద్రంలో ఎవరొచ్చినా లాలూచీ కుస్తీ కొనసాగించటమే అసలు మంత్రం. ఇందుకోసం రాష్ట్రంలో మరొకపార్టీకి సందివ్వకుండా తామే సర్వంగా వ్యవహరించే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉన్నది.
విధానాలతో విభేదాలు లేవు
మోడీ పాలనలో అనుసరించిన తప్పుడు విధానాలతో టీఆర్ఎస్ నాయకత్వం ఏనాడూ విభేదించలేదు. పైగా కీలకమైన ప్రజావ్యతిరేక విధానాలన్నీ తమ భుజానికెత్తుకున్నది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, 2013 భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయటం, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కారుచౌకగా పడిపోయినప్పటికీ, ఇక్కడ అత్యధిక స్థాయికి ధరలు పెంచటం వంటి అనేక విషయాలలో ఈ ధోరణి చూసాం. దేశంలో నిరుద్యోగం గత 45ఏండ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి పెరిగినా టీఆర్ఎస్ మాట్లాడలేదు. రాఫెల్ కుంభకోణం మీద కూడా స్పందించలేదు. రామాలయం, అయ్యప్ప దర్శనం, ఉగ్రవాదం పేరుతో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పటికీ, మతంపేరుతో ప్రజలను విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సంఘపరివారం ప్రయత్నించినప్పటికీ టీఆర్ఎస్ నోరు మెదపలేదు. రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికుల కనీసవేతనాలు పెంచడానికి నిరాకరిస్తున్నారు. కౌలురైతులను గుర్తించేది లేదని శాసనసభా ముఖంగానే ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధర ఊసెత్తటం లేదు. దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావనే లేదు. అడవుల సంరక్షణ పేరుతో అటవీహక్కులు హరిస్తున్నారు. వృత్తిదారుల కుటుంబాలలో చదువుకున్న యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపే ప్రయత్నమే లేదు. ఈ ఐదేండ్లలో రాష్ట్ర పాలకుల నోట వ్యవసాయ కూలీల మాట రాలేదు. షీ టీములు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. మహిళల మీద దాడులు ఆగిపోయాయని చెప్పుకుంటున్నారు. కులదురహంకార దాడులు, కులవివక్షలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా సిద్ధంగాలేరు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ఖాళీ చేసేందుకు పార్లమెంటరీ విలువలన్నింటికీ తిలోదకాలిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిహసిస్తూ నిరంకుశ పోకడలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెసు గురించి తెల్సిందే. కాంగ్రెసు విధానాలే టీఆర్ఎస్ అమలు చేస్తున్నది. కాంగ్రెసు విధానాలతో జనం విసుగెత్తిన పరిస్థితినే టీఆర్ఎస్ అవకాశంగా తీసుకున్నది. అందువల్ల కాంగ్రెసు వచ్చి తిరిగి కొత్తగా ఏదో ఒరగబెడుతుందన్న విశ్వాసం రాష్ట్ర ప్రజలకు లేదు. కాంగ్రెసుకు అధికార యావే తప్ప ప్రజలసమస్యలు పట్టవు. టీఆర్ఎస్ అనైతిక విధానాల మీద రౌండ్టేబుల్ నిర్వహించింది కాంగ్రెసు. మంచిదే. కానీ బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాల మీద ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకపోవటం గమనార్హం.
మోడీ మళ్ళీ వస్తే...
ప్రస్తుతం దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉన్నది. 'పండ్లు రాలగొట్టుకోవడానికి ఏరాయి అయితేనేమి?' అన్నట్టున్నది సాధారణ ప్రజల పరిస్థితి. వామపక్షాలు బలహీనపడిన ఫలితమిది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతపరమైనవిభజనతో శ్రామికుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. జాతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతున్నది. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నది. చరిత్రను మసిబూసి మారేడుకాయ చేస్తున్నది. అసలైన సమస్యల నుంచి ప్రజలదృష్టి మరలిస్తున్నది. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు దాపురిస్తాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటం ద్వారా ఊపిరి పీల్చుకునే సదుపాయమైనా పొందటం ప్రజల అవసరం. అందుకనుగుణంగానే రాజకీయ పక్షాలు పావులు కదపటం ఎంతైనా అవసరం.
పరిమిత స్థానాలే...
రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలిపి ప్రజోపయోగ రాజకీయ కర్తవ్యం నెరవేర్చగల ఒక ఫ్రంటు ఏర్పడే పరిస్థితి లేదు. సీపీఐ, సీపీఐ(ం)ల బంధమే కీలకం. ఈ రెండు పార్టీలమధ్య బంధం బలోపేతం కావటం ద్వారానే వామపక్ష ఉద్యమం బలపడటం గానీ, ఇతర వామపక్షాలతో ఐక్యత పెరగటం గానీ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు వామపక్ష ఉద్యమ చరిత్ర గల్గిన స్థానాలను మాత్రమే ఎంపిక చేసుకుని పరిమితంగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. జనసేన, బీఎస్పీ లాంటి పార్టీలు కూడా వామపక్షాలతో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసాయి. ఏపీలో గత కొంతకాలంగా జనసేన చురుకుగా పనిచేస్తూ తన ప్రజాబలాన్ని ప్రదర్శించగల్గింది. ప్రజాసమస్యలపై వామపక్షాలతో కలసి పనిచేసింది. అలాంటి ప్రయత్నం తెలంగాణలో జరగలేదు. అందువల్ల జనసేనగానీ, బీఎస్పీగానీ పరిమిత స్థానాలను ఎంపిక చేసుకుని బలమైన అభ్యర్థులను రంగంలోకి దించటం మీద దృష్టిసారించటం మంచిది. వామపక్షంతో పోటీ నివారించుకునేందుకు ప్రయత్నించాలి. ఏ మేరకు పరస్పరం పోటీలు నివారించుకో గలిగితే ఆమేరకు మంచిది. ఎంసీపీఐ కూడా ఈ దృక్పథంతో స్పందించగల్గితే ఉపయోగకరం. మిగిలిన స్థానాలలో కూడా ఈ దిశలో బలమైన అభ్యర్థులను గుర్తించి తగు నిర్ణయం తీసుకునే పట్టువిడుపులు ప్రదర్శించాలి.
వామపక్షం ముద్ర
వామపక్షాలు బలపడకుండా దేశానికి గానీ, రాష్ట్రానికి గానీ భవిష్యత్తు అంధకారమే. ప్రజాజీవితం మరింత దుర్భరమవుతుంది. ప్రజాస్వామ్య, లౌకిక విలువలకూ ప్రమాదమే. మూడు రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఎదిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాలలో తగు బలం ప్రదర్శించగల్గిన నాడు దేశంలో తనకంటూ ఒక ముద్ర వామపక్షం వేయగల్గింది. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పాలనకు వ్యతిరేకంగా విశాల ఐక్య పోరాటంలో సీపీఐ(ఎం) కూడా తగిన పాత్ర పోషించగల్గింది. ఫెడరల్ రాజ్యాంగ విలువలను కాపాడటంలో, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటంలో, ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణ కృషిలో వామపక్షం చొరవ ప్రదర్శించగల్గింది. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. కౌలుదార్లకు కనీసమాత్రమైనా హక్కులు లభించినా, కార్మికచట్టాలు పరిమితంగానైనా అమలు జరిగినా.. అది వామపక్షం ప్రభావమేనన్నది ఎవరూ కాదనలేరు. ప్రభుత్వరంగం, సహకార రంగం సుదీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థలో బలమైన పాత్ర పోషించడానికి వామపక్ష ఉద్యమ ప్రభావమే కారణం. కష్టజీవుల ఐక్య పోరాటాలలో కూడా దండలో దారంగా నిలిచింది వామపక్షమే కదా! ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం. 80వ దశకం ఆరంభంలో గిట్టుబాటు ధరకోసం సాగిన రైతాంగ ఉద్యమంలో వామపక్షం కీలకపాత్ర వహించింది. ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని కేంద్రం కూలదోసిన సమయంలో జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమంలోనూ వామపక్షం చురుకైన పాత్ర పోషించగల్గింది. తెలుగుదేశం పాలనలో ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేసి ఉద్యమించటంలో సీపీఐ(ఎం) ప్రతిష్టాత్మకమైన పాత్ర తెల్సిందే. విద్యుత్తు ఉద్యమంలో గానీ, వైఎస్ఆర్ పాలన కాలంలో జరిగిన భూపోరాటంలోగానీ, కులవివక్ష వ్యతిరేక పోరాటంగానీ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కోసం జరిగిన పోరాటంగానీ వామపక్షం నాయకత్వంలో జరిగిన చారిత్రాత్మక ఘట్టాలే కదా! ఆ వారసత్వంలో భాగంగానే నేటికీ ఆర్థిక, సామాజిక రంగాలలో కృషీ, చొరవా కొనసాగుతున్నాయి.
వామపక్ష ఐక్యత పునాదిగా
దేశంలోగానీ, తెలుగు రాష్ట్రాలలో గానీ వామపక్షం బలహీన పడినందువల్ల అనేక దుష్ఫలితాలు చూస్తున్నాం. దేశంలో ఎప్పుడూ లేనంతగా మతోన్మాం బలపడ్డది. కాంగ్రెసులో అవకాశవాదం మరింతగా పెరిగింది. కార్మికచట్టాలు, కౌలు చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఉన్న హక్కులు కాపాడుకోడానికే పోరాడవల్సిన పరిస్థితి. రైతుల హక్కులనూ హరిస్తున్నారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా వచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని కూడా నీరుగార్చారు. వృత్తులు విచ్ఛిన్నమై, వృత్తిదారుల జీవితాలు దుర్భరమవుతున్నా ఉద్యమానికి పరిమితులేర్పడ్డాయి. టీఆర్ఎస్ పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు ఏకపక్షంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికుల పోరాటాలను ఖాతరు చేయటం లేదు. మల్లన్నసాగర్ రైతుల ఉద్యమాన్ని కూడా లెక్కచేయలేదు. పాలకుల విధానాల పట్ల భ్రమలు తొలగించగల శక్తి వామపక్ష భావజాలం మాత్రమే. ఆ వామపక్ష ఉద్యమం బలహీనపడటమే ప్రస్తుతం తెలంగాణ సమాజం కూడా ఎదుర్కొంటున్న సవాలు. వామపక్షం బలం పుంజుకుని, ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయ మార్గం చూపటమే దానికి పరిష్కారం. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ, వామపక్షం బలహీనపడటం వల్ల సంతోషిస్తున్నది బడా పారిశ్రామిక వేత్తలూ, గ్రామీణ పెత్తందారులు మాత్రమే. వామపక్షం బలంగా ఉన్నప్పుడే కనీస మాత్రంగానైనా ప్రజాస్వామ్యం మనగల్గుతుందని నమ్మేవారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వామపక్షం బలహీనపడితే కష్టజీవుల, బడుగు బలహీన వర్గాల సమస్యలపై మాట్లాడే వారుండరని ఆందోళన చెందుతున్నారు. అందువల్ల వామపక్షం శక్తి పెరుగుదల లేదా తరుగుదల కేవలం వామపక్ష పార్టీలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వామపక్ష శ్రేణుల వెలుపల గణనీయమైన స్థాయిలో ఈ భావన ఉన్నది. రానున్న కాలంలో వామపక్ష పార్టీలు ఏమి చేయనున్నాయనే విషయంలో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. కార్మికరంగంలో గానీ, వ్యవసాయరంగంలో గానీ, సామాజికరంగంలో గానీ వర్గపోరాటం పదును పెంచాలని కోరుకుంటున్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతూనే కులవ్యవస్థ మీద యుద్ధం ప్రకటించవల్సిన సమయమిది. ఈ పోరాటక్రమానికి సీపీఐ, సీపీఐ(ఎం) ఐక్యత వెన్నెముక లాంటిది. ఈ సయోధ్య కేంద్ర బిందువుగానే వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తుల ఐక్యపోరాటం మరింత బలోపేతం చేయాలి.
కలిసి నడిచే వైపు...
ఈ ఎన్నికలలో సీపీఐ, సీపీఐ(ఎం)లు దగ్గర కావటం, కలసి నడవటం ఇందుకు బాటలు వేస్తుంది. ఇందుకనుగుణంగానే ఇరుపక్షాలనుంచీ జరుగుతున్న ప్రయత్నం హర్షించదగింది. ఈ ఉభయ పార్టీలు పోటీ చేసే స్థానాలు మినహా మిగతా స్థానాల విషయంలో భిన్నాభిప్రాయాలేమైనా ఉంటే.. అవి వామపక్ష ఐక్యతకేమీ ఆటంకం కాబోవు. ఆ మేరకు ఇరుపక్షాలూ పట్టువిడుపులు ప్రదర్శించటం సంతోషదాయకం.
- ఎస్. వీరయ్య