Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రామిక జనుల చేతుల్లోంచే పాట పుట్టింది. కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడంటారు. అది మనకు తెలియదు గానీ తెలంగాణ మాత్రం పాట అనే కవచకుండలాలతో పుట్టిం ది. ఇక్కడ పంట కాలువలు పారకపోవచ్చు కానీ పాట కాలువలు మాత్రం పారుతూనే ఉన్నాయి. ఆ ప్రవాహంలో నుంచి పుట్టిందే ఒగ్గుకథ. వెయ్యేళ్ల ఈ శూద్ర కళా రూపాన్ని ప్రపంచ పటం మీద వెలిగించిన ఒగ్గు కథ దిగ్గజం మిద్దె రాములు. డోలు, డమరుకం మోగుతుంటే ఆరు అడుగుల మనిషి బోనమెత్తుకుని, నేలపై పొర్లాడుతూ బోనం కింద పడకుండా, నవరసాలు ఒకే స్వరంలో పలికిస్తూ చేసే హావభావ నృత్య కళా విన్యాసాలు చూసేవారం దరికీ కన్నుల పండుగే.
ఆయన గజ్జెకట్టి ఆడితే యావత్ తెలంగాణ ఉర్రూతలూ గింది. అందుకే ఒగ్గు కథ అంటే మిద్దె రాములు, మిద్దె రాములు అంటే ఒగ్గు కథ. ఆయన పాడిన పాటలు గట్ల మీదుగా సాగి పంట పొలాలను స్పృషించేవి. తంగెడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే పల్లెలన్నీ పరవశించేవి. అక్షర జ్ఞానం లేని ఆశుకవి తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయాడు. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయ కీర్తిని అర్జించి పెట్టిన జానపద వైతాళికుడు ఆయన.
1941లో కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేట గ్రామంలో సామాన్య కల్లు గీత కార్మిక కుటుంబంలో జన్మించారు. పేదరికం వెంటాడటం వల్ల చదువుకు దూరమయ్యాడు. ఐదు గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. కథ విన్నా, పాట విన్నా వెంటనే పట్టుకునే ఒడుపు ఉంది. ఇటువంటి వారిని ఏక సంతాగ్రహి అంటారు. చిన్నప్పటి నుంచి ఒగ్గు కథ మీద పెంచుకున్న ప్రేమాభిమానంతో ఒగ్గు వాళ్లు చెప్పే ఎల్లమ్మ కథ, మల్లన్న కథలు తరచూ వినేవాడు. ఆ కళను అభ్యసించాలనే తాపత్రయంతో ఒగ్గు కథకుల చుట్టూ తిరిగేవాడు. ఎండు తుమ్మకాయలు గుజికుచ్చుకొని గజ్జెల్లా కాళ్లకు కట్టుకొని ఒగ్గు నాట్యం ఆడేవాడు. అసంఖ్యాకమైన కథలు మౌఖికంగా నేర్చుకుని, జానపద రాగాలను అవపోసన పట్టేవాడు. లయాత్మకంగా అడుగులు వేయడం అబ్బింది. ఎండకాలం గొర్రెలు కాసేవాళ్లు, పశువులు కాసేవాళ్లను మర్రిచెట్టు నీడన కూర్చుండబెట్టి ఆ చిన్న రాములు కథ చెబుతుంటే అందరి చప్పట్లు ఆనందాల మధ్య ఆ అడవి పులకించేదట.
ఒగ్గు కథ రెండు కులాలకే పరిమితం. కురుమలు, యాదవులు మాత్రమే చెప్పాలి. ఒగ్గు కథ చెప్పాలంటే ఒగ్గు దీక్ష ఉండాలి. ఇవి ఏవి లేని గౌడ కులస్తుడు ఒగ్గు కథ చెబుతాడా? అన్న ఒగ్గు కులస్థులను సైతం తన ప్రతిభా పాటవాలకు తలలు వంచి నమస్కరించేలా చేసిన సంస్కారం మిద్దె రాములుది. వెయ్యేళ్ల కిందటి పాటలను వొడిసి పట్టుకున్నాడు. భాషంతా తెలంగాణ యాసే. తన కథా గాన పటిమతో పురాణ పాత్రలను ప్రేక్షకుల ముందు నిలిపేవాడు. ఒగ్గు కథలో అనేక ప్రయోగాలు చేశాడు. ఆ ప్రాచీన జానపద కళకు ఆధునిక విషయాలను జోడించి తన హావ, భావ విన్యాసాలతో ఒగ్గు కళకు జీవం పోశాడు. ప్రాచీన సంప్రదాయానికి చెందిన ఒగ్గుకథాగానానికి పూర్వ వైభవం తెచ్చి పెట్టాడు. మొదట తెలంగాణ వ్యాప్తంగా , ఆపైన పక్క రాష్ట్రాల ఆహ్వానం మేరకు దేశవ్యాప్తంగా నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఒగ్గు కథా ప్రయాణం సాగింది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం గ్రామ దేవతలకు సమర్పించే బోనం. నెత్తిన బోనమెత్తుకొని వడివడిగా నడవగలగడం నిజంగా నేర్పుతో కూడిన ఘట్టం. ఈ ప్రక్రియను తన జానపద కళారూపంగా మలచుకున్నాడు మిద్దె రాములు. ఆశువుగా పలికే ఆయన ఒగ్గు కథ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తే అలవోకగా ప్రదర్శించే బోనం ప్రక్రియ అందరినీ తన్మయత్వానికి లోను చేసేది. నెత్తిన ఎత్తిన బోనంపై నిలిపిన జ్యోతి ఆరకుండా ఎత్తిన బోనం సహా నేలపై పడుకొని రూపాయి నాణాన్ని నోటితో తీసే ఆ ప్రదర్శన అపురూపం. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపాలు భాగమయ్యాయి. అందులో మిద్దె రాములు బోనం ప్రదర్శనకు పబ్బతి పట్టిందీనేల. ఆయన ఎత్తిన ఉద్యమ బోనం అనేక వేదికలపై శివాలెత్తింది. ఉర్రూతలూగించి ఉద్యమ కెరటమై నిలిచింది.
చుక్క సత్తయ్యతోపాటు ఈ తెలంగాణ జానపద కళారూపానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు మిద్దె రాములు. దేశం నలుమూలలా ఒగ్గు కథ ప్రదర్శనలిచ్చి పరభాషీయుల చేతా మన్ననలు పొందారు. మారిషస్ ప్రభుత్వం మూడవ మారిషస్ తెలుగు మహాసభలు జరిపినప్పుడు మిద్దె రాములు ప్రత్యేక జానపథ కళాకారుడిగా వెళ్లారు. ఆ దేశ ప్రధాని జగన్నాథ్ గవర్నర్ రంగస్వామి ఎదుట రాములు బోనం నృత్య ప్రదర్శన పెట్టడంతో సభ ఆశ్చర్యానికి గురైంది. నెత్తిమీద బోనం ఎత్తుకొని నేల మీద పాము పాకినట్టు, మెలికలు తిరుగుతూ ఉంటే నెత్తిమీద బోనం ఆపైన దీపం ఎక్కడ పడిపోతుందోనన్న ఉత్కంఠకు తోడు నోటితో పైసలు అందుకుంటూ చేసిన ప్రదర్శన విదేశీయులు కన్నులార్పకుండా చేసింది. ప్రదర్శన ఆయిన వెంటనే అందరూ లేచి జేజేలు పలికారు. ఇలా అనేక అంతర్జాతీయ వేదికలపైనా తెలంగాణా జానపథాన్ని కదం తొక్కించాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. జానపద కళా బ్రహ్మ, ఒగ్గు కథ చక్రవర్తి బిరుదాంకితుడయ్యాడు.
''నా అల్లిక కథలు ఎవరూ అంటిముట్టుకోలేదు. నా కథలను గ్రంథస్థం చేయడం నాకు రాదు. ఎవరైనా పూనుకుంటే మంచిది. కళాకారులకు వేదిక మీద ఉన్నప్పుడే చప్పట్లు, ఆనందం. వేదిక బయట ఆకలి, అవమానాన్ని దిగమింగి ఎవరికీ చెప్పుకోలేని నిరుపేద స్థితి. శాలువాలు, సన్మానాలే కాదు, కుటుంబాన్ని పోషించుకునే ఆత్మగౌరవం కూడా లభించినప్పుడే కళాకారులకు నిజమైన గౌరవం'' అని చెప్పేవాడు. ఒగ్గు కథ పాఠాలు నేర్పే బడి తెరవాలన్న ఆయన కల నెరవేరకుండానే అనారోగ్యం ఆయన్ను బలిగొంది. 25 నవంబర్ 2010న ఆయన నిష్క్రమించాడు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343