Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేశ రక్షణ కోసం నా ఓటు వేయబడింది' ఇది ఏప్రిల్ 11న నాకు బాగా నవ్వు తెప్పించిన సంక్షిప్త సందేశం.. ఆ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటు ఎవరికి వేశారో చెప్తే అది చెల్లదు.. ఈ లెక్కన బీజేపీ, టీఆర్ఎస్లకు పడిన చాలా ఓట్లు చిత్తు ఓట్లుగా ప్రకటించవచ్చు. కానీ ఎన్నికల సంఘం అలాంటి చర్యలు తీసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. కానీ హిందుమతానికి, భారతదేశానికి బీజేపీ, మోడీ లేకపోతే విపరీతమైన నష్టం వాటిల్లుతున్నట్టు ప్రచారం సాగుతోంది. 'ఈ దేశంలో హిందువులు మాత్రమే జీవించడం కోసం ఉద్ధేశించి స్థాపించబడిందే బీజేపీ (స్వయంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ రాజకీయ రూపమే ప్రస్తుత బీజేపీ).. ఈ దేశంలో మెజారిటీ హిందూ జనాభాతోపాటు ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు.. ఉన్నారు. భారత రాజ్యాంగం.. మన దేశంలో మతంతో సంబంధం లేకుండా అందరికీ జీవించే హక్కు కల్పిస్తోంది. బీజేపీని రాజకీయ పార్టీగా సమర్థించేవారు కాకుండా మతం ప్రాతిపదికన బీజేపీని సమర్థించే వారు, గుడ్డిగా అనుసరించేవారు ఆలోచించాలి. హిందువులు మాత్రమే జీవించాలని చెప్పే రాజకీయ పార్టీ మిగిలిన వారిని నిర్మూలించాలని కోరుకుంటుందా? ఇది ఏ రకమైన సౌభ్రాతృత్వాన్ని బోధిస్తోంది. హిందువులందరికీ ఏ బీజేపీ నాయకుడు వచ్చి అన్నప్రాసన చేస్తున్నారు. శ్రాద్ధ కర్మలను పాటించడంలో, కుటుంబ సమస్యల్లో ఏ మోడీ పాలు పంచుకుంటున్నాడు. ఏ మతస్తుడైనా తన సాంప్రదాయాలను స్వేచ్ఛగా పాటించవచ్చు.. బీజేపీలో ఉన్నవారే హిందువులైతే మిగతా రాజకీయ పార్టీల్లో వారంతా కానట్టేనా? ఇలాంటి మానసిక వైరుధ్యాలను సృష్టించి బీజేపీ మెజారిటీ జనాభా గల హిందు ఓట్లను ఆకర్షిస్తోంది. బీజేపీ అసలు దేశ సమగ్రత, సమైక్యతలకు ఏనాడూ కృషి చేయలేదు. చేయబోదు కూడా.. ఎవరైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను, నిర్ణయలోపాలను ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ప్రకటించడం ఓ సరదాగా మారిపోయింది. నల్లధనం తేవడానికి నోట్ల రద్దు చేశామన్న మోడీ.. ఎంత నల్లధనాన్ని మన దేశానికి తెచ్చారో ఇప్పటికీ చెప్పలేదు. దీనిని ప్రశ్నిస్తే ఎన్నికలప్పుడు అలాగే చెప్తాం.. గెలవడమే కదా ముఖ్యం అని అమిత్ షా అంటారు. వారి మాటల ప్రకారమే ఇప్పుడు దేశాన్ని మేం మాత్రమే రక్షిస్తాం అంటే ఎలా నమ్మాలి. ఎందుకంటే దేశభక్తి పేరుతో కాశ్మీర్ గురించి గొంతు చించుకునే వారే కదా కాశ్మీర్ను పాకిస్థాన్లో కలపడమే లక్ష్యంగా ఏర్పడిన పీడీపీతో పొత్తు పెట్టుకుంది. వీటిపై ఆ పార్టీ సమర్థకులు ఒక్కరూ మాట్లాడరు. కనీసం ప్రశ్నించే సాహసం చేయరు. ఎందుకంటే వారికి దేశద్రోహి అని పిలిపించుకుంటే ఏం జరుగుతుందో బాగా తెలుసు. హిందువుగా, గొప్ప దేశభక్తుడిగా గుర్తించబడాలంటే గుడ్డిగా సమర్థించాలి. ఇది ఒక మానసిక రోగంగా తయారైంది. పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఆర్ ఎస్ఎస్ సత్తా చూపిస్తామని చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. పుల్వామా దాడి సమయంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త యుద్ధంలో పాల్గొనలేదు. మన సైన్యంలో పనిచేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ విధానం అని ఒకటుంది. రెగ్యులర్ విధానంలో కాకుండా దేశం మీద ప్రేమ ఉన్న వారు, ఆర్మీలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారు ఇందులో తమకు ఇష్టమైనంత కాలం పనిచేయవచ్చు.. మోహన్ భగవత్ ఎందుకు చేరలేదో.. దేశభక్తులమని గొంతులు చించుకునే వారికి ఆర్ఎస్ఎస్ పాఠాల్లో ఇది ఎందుకు చెప్పలేదో తెలుసుకోవాలి మరి.. పార్టీని సమర్థించకపోయినా నీ మతం, కులం ముందుగానే నిర్ణయించబడ్డాయి. అంతరాలతో ప్రారంభమైన భారతీయుడి జన్మను అత్యున్నత విద్వేష స్థాయికి తీసుకెళ్లే ఒకే ఒక రాజకీయ పార్టీ బీజేపీ. గుడ్డిగా మత ప్రాతిపదికన రాజకీయ పార్టీలను సమర్థించి అనుసరించేవారికి ఒక ప్రశ్న.. మీరు ఈ దేశంలో హిందూ మతంలో కాకుండా ఇతర మతంలో పుట్టి ఉంటే ఎలా ఉండేదో ఒక సారి వాస్తవికంగా ఆలోచించగలరు.. మీరు వ్యక్తం చేస్తున్న ద్వేషం, పగ ఎదుర్కొనేవారు కాదా.. ప్రశ్నించిన ప్రతీసారి మీరు దేశద్రోహులుగా.. తీవ్రవాదులుగా గుర్తించబడేవారే కదా?
- వంగాల రమేష్
సెల్ : 9490099115