Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఇంటర్ బోర్డు తీరు పలు వివాదాలకు దారితీస్తోంది. మార్కుల మెమోల్లో తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో మార్కులు తారుమారయ్యాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు, వచ్చిన మార్కులకు పొంతన ఉండటం లేదు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ 100లో 2 నుంచి 3 తప్పులున్నాయని మాట్లాడిన తీరుతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతున్నది. అవకతవకలపై విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారుల తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ మెమోలో మార్కులు తారు మారయ్యాయని, పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ ఆరోపిస్తూన్నారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు దిద్దించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షల ఫలితాలు వచ్చాయంటే చాలు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారింది. టార్గెట్లు, ర్యాంకులు సాధించలేదని పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తిడతారేమోననే భయంతో, పరీక్షల్లో ఫెయిల్ అయితే బంధువులు, చుట్టుపక్కలవారి ముందు చులనక అయిపోతామేమోననే భావనతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజా ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాలలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానసిక ఆందోళనే ఆత్మహత్యకు కారణమని నిపుణులు చెబుతున్నారు. తల్లితండ్రులు కూడా పిల్లలు మంచి మార్కులు, ర్యాంకులు సంపాదించాలని తపన పడుతున్నారే తప్ప వారిలో ఒత్తిడిని పట్టించుకోవడంలేదు. దీంతో విద్యార్థుల జీవితాలు మొగ్గలోనే రాలిపోతున్నాయి.
పదో తరగతి పాస్ అయిన తర్వాత కాలేజీ బాట పట్టిన విద్యార్థులు కొత్త ఆశలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అప్పటి వరకు పాఠశాల జీవితానికి అలవాటుపడ్డ వారికి కాలేజీ వాతావరణం ఓ కొత్త అనుభూతిని తెచ్చిపెడుతుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మారిన సమాజంలో కార్పొరేట్ విద్యకు అలవాటుపడ్డ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ కళాశాలలో చేర్పించాలి, ఎక్కడ ర్యాంకులు ఎక్కువగా వస్తున్నాయి వంటి ఆలోచనల్లోనే మునిగిపోతున్నారు. పిల్లలకు మంచి విద్య అందించాలన్న తపనలో పడి పేరున్న పెద్ద కాలేజీల ముందు క్యూ కడుతున్నారు. అయితే ఆయా కళాశాలల్లో బోధనా పద్ధతులు, అక్కడి వాతావరణం గురించి చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. కాలేజీలో చదువు ఒత్తిడి, తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ర్యాంకులు తెచ్చుకుంటామో లేదో అన్న ఆలోచనలతో నలిగిపోతున్నారు. పదోతరగతి వరకు లేలేత మనసులపై లేని మానసిక ఒత్తిడి కాలేజీకి రాగానే ఒక్కసారిగా చుట్టుముడుతుండటం వల్ల తెలియని ఆందోళన, భయం నిత్యం వారిని వెంటాడుతోంది. ర్యాంకులు సాధించాలనే తపనో లేక నిర్భంద విద్యనో తెలియదు కానీ, పరిస్థితులు వారిని ఆత్మహత్యలకు ఉసి గొల్పుతున్నాయి. ఇటీవల కాలంలో కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే ఎంతోమంది విద్యార్థినీ, విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో తల్లితండ్రులకు కడపుకోత మిగులుతోంది. విద్యార్థులంతా తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలకు పూనుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది.
తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యల్లో ఇంటర్ మీడియట్ కార్పొరేట్ కళాశాలలున్నాయి. వాటిలో 80 శాతం కళాశాలలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులవే కావడం గమనార్హం. ఓ కళాశాల ఏర్పాటు చేయాలంటే విశాలమైన భవనం, క్లాసు గదులు, క్రీడా మైదానం, లైబ్రరీ తదితర వసతులతో కూడిన సౌకర్యాలు ఉండాలి. అందుకు భిన్నంగా అపార్ట్మెంట్లు ఇరుకైన భవనాల్లో ఇంటర్ కళాశాలలు వెలుస్తున్నాయి. డబ్బుపై వ్యామోహం తప్ప విద్యార్థుల గురించి కళాశాల యాజమాన్యాలు ఆలోచించడం లేదు.
మన తెలుగు రాష్ట్రాలలో విద్య ఓ వ్యాపారంగా మారిపోయింది. సంపాదనే ధ్యేయంగా సాగుతోంది. కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయే తప్ప విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఇక విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడే అని వైద్యులు చెబుతున్నారు. ఇరుకైన భవనాలు ర్యాంకుల ఒత్తిడే వారిని ఆత్మహత్యల వైపు ఉసిగొల్పుతున్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పుస్తకం తప్ప మరో ధ్యాస లేకపోవడం కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలను అలవాటు చేస్తే చాలావరకు విద్యార్థుల ఆలోచనలు మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. క్రీడా స్థలాలే లేనప్పుడు ఇక క్రీడలకు చోటెక్కడీ ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవటం లేదు. ఆత్మహత్య చేసుకొనే వారిలో అధిక శాతం ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలే. ఎక్కువ భాగం ప్రయివేటు లేదా కార్పొరేటు బడుల విద్యార్థులే ఐఐటీ లేదా నీట్ కోసం చదివే వారే కావడం గమనార్హం. ఆర్ట్స్ గ్రూపు చదివే పిల్లలు దాదాపు ఆత్మహత్యలకు పాల్పడటం లేదు. ఆత్మహత్య చేసుకొనే పిల్లల్లో, ఏ గ్రూపులో చేరాలి, ఎక్కడ చదవాలి, చదివి ఏమి (ఐఐటీ లేదా మెడికల్) సాధించాలి అనేది నిర్ణయించడంలో తల్లిదండ్రులే కీలకంగా వ్యవరిస్తూ విద్యార్థుల ఆసక్తులకు, వారి సామర్ధ్యాలకు, ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఐఐటీ లేదా మెడికల్ తప్ప మిగతావి ఏవీ చదువులు కావనేలా పిల్లల బ్రెయిన్ వాష్ చేస్తున్నదీ వ్యవస్థ. నేరుగా చెప్పకపోయినా చదువే జీవితం, సీటు పొందటమే ధ్యేయం అనే విధంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటున్నది. ఫెయిల్యుర్ సాధారణ అంశం అనే సంగతే మరిచిపోయారంతా! విద్యా వ్యాపారుల ఆలోచనలే మొత్తం సమాజపు ఆలోచనలుగా చెలామణిలో ఉండి, అదే సామాజిక అనుసరణగా నేడు నడుస్తున్నది. పరోక్షంగా ఈ పరిస్థితే విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇవి ఆత్మహత్యలా? లేక హత్యలా?
- వాసిలి సురేష్
సెల్ : 9494615360