Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృత్తినే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న ఆరెకటిక వృత్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. దీంతో ఆరెకటికల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. రెక్కాడితేనేగాని డొక్క నిండని పరిస్థితి. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ఆరెకటికలున్నారు. వీరు నిత్యం అనేక సమస్యలతో సతమతమౌతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారానికి రాకముందు అనేక హామీలు ఇచ్చింది. గడిచిన ఐదేండ్లలో ఆరెకటికలను ఆదుకున్న పాపాన పోలేదు. దీంతో ఆరెకటికలు దినదినగండంగా బతుకుతున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత అప్పటి పాలకులు తగిన ప్రాధాన్యత ఇవ్వలేక పోయారు. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. ఆరెకటిక కులస్తుల్లో ప్రజాప్రతినిధులు లేరు. వార్డుమెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకసంఖ్యలో ఉన్న ఎంపీపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీలుగా అసలే లేరు. రాజకీయ అవకాశాల్లో నేటికి న్యాయం జరగటం లేదు.
1970లో అనంతరామన్ కమిషన్ రిపోర్టు ప్రకారం తెలంగాణలో 1,41,856, ఆంధ్రలో 440 జనాభా మాత్రమే ఉన్నారని నమోదైంది. కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్వారు ప్రచురించిన రిపోర్టులో తెలంగాణ ఉమ్మడి 5 జిల్లాల్లో 24,964 ఓటర్లు ఉన్నట్టు వెలువడినది. మిగతా 5 జిల్లాల్లో ఆరెకటిక ఓటర్లు ఉన్నట్టు వెలువడలేదు. ప్రస్తుతం 31 జిల్లాల్లో ఆరెకటికలు సకల జనుల కుటుంబ సర్వే ప్రకారం లెక్కలను బహిర్గతం చేసి ఆరెకటికల జనాభాను తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఆరెకటిక వృత్తికి సంబంధం వున్న గొర్రెల సంఖ్య 2.24 కోట్లకు చేరింది. ఈ విషయంలో రాజస్థాన్ను వెనక్కి నెట్టిన ఘనత తెలంగాణకుంది. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2017 జూన్ నాటికి కోటి గొర్రెలు మాత్రమే ఉండగా గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య 74 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. వాటికి 55 లక్షల పిల్లలు పుట్టాయనీ, వివిధ కారణాలతో మరణించినవని, లబ్ధిదారులు అమ్మేసుకున్నవి పోగా రెండేండ్లలో గొర్రెల సంఖ్య 124 శాతం పెరిగిందని ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. మాంసం ఉత్పత్తిలోను 15 శాతం వృద్ధి సాధించామని అధికారులు అంటున్నారు.
ఇంటిముందుకే మాంసం కూర వచ్చే విధంగా వినియోగదారులకు పరిశుభ్రమైన మాంసం విక్రయించేలా మటన్ అన్వీల్స్ను రూపొందించే పనిలో ప్రభుత్వ అధికారులు ముమ్మరంగా కసరత్తులో నిమగమయ్యారు. మాంసం నిల్వ చేసేందుకు ఏసీతో కూడిన వాహనాన్ని (యూనిట్)కు రూపకల్పన చేస్తున్నారు. అన్ని వసతులతో ఒక్క యూనిట్ తయారీకి రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. ఆసక్తి ఉన్న వారికి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య తరువున యూనిట్లు సరఫరా చేసి నెల నెలా అద్దెరూపంలో వసూలు చేస్తామని సమాఖ్య ఎం.డి లక్ష్మారెడ్డి వెల్లడించారు.
ఆరెకటికలలో మటన్ వృత్తి చేసే ప్రతి ఒక్కరికి రూ.5 లక్షలు రుణం ఇవ్వాలి. 500 కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు చెయ్యాలి. ఆరెకటికలను ఎంబీసీ జాబితాలో చేర్చాలి. 50 సం||లు పైబడిన వారికి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలి. ప్రతి మేకల మండిలో దావాఖానా ఏర్పాటు చెయ్యాలి. ప్రతి మహిళా బాయిలకు జీవనోపాధికోసం రూ.2 లక్షలు రుణం ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి 10 లక్షల వరకు వ్యక్తిగత రుణంగా ఇవ్వాలి. ప్రతి మండీలో సీసీ కెమెరాలు, వీధిలైట్లు మహిళా మరుగుదొడ్లు వంటి సమస్యలు ఉన్నాయి. జియాగూడ స్లాటర్ హౌస్ను ప్రభుత్వ నిధులతో కట్టించాలి. మోడ్రన్ మటన్ షాపులకు మటన్ మార్కెట్లకు పూర్తి ఆర్థిక సహకారం ప్రభుత్వమే అందివ్వాలి. యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ రూ.25 లక్షలు ఇవ్వాలి. కల్లు కాంపౌండు, వైన్స్, బార్లలో తైబజార్ విధానాన్ని ఎత్తి వెయ్యాలి.
ప్రభుత్వ హాస్టల్స్, క్యాంటీన్లు, జైళ్లు, దవాఖానాలు మొదలైన వాటిలో మటన్ సప్లయ్ చేసే విధానం ఆరెకటికలకే ఇవ్వాలి. ప్రతి జిల్లాలో మేకల మండీలను ఏర్పాటు చేసి ఆరెకటికల సంఘాలకు అప్పజెప్పాలి. మధ్యతరగతి ఆరెకటికలకు రూ.5 లక్షల రుణం ఇవ్వాలి. రైతు బీమా పథకాన్ని ఆరెకటికలకు వర్తింపచేయాలి. జియాగూడ స్లాటర్ హౌస్ పక్కన ఉన్న డంపింగ్ యార్డును ఎత్తివేయాలి. ఆ స్థలాన్ని స్లాటర్ హౌస్కు అప్పగించాలి. మాన్యువల్ పద్ధతిగా జియాగూడ స్లాటర్ హౌస్ నిర్మించాలి. మోడ్రన్ ఎక్స్పోర్ట్ విధానం రద్దు చెయ్యాలి. ప్రతి సంవత్సరం టెంటర్లను ఆరెకటిక ఫెడరేషన్కు అప్పగించాలి. నాలుగు విడుతలుగా ఉమ్మడి సంఘం చెల్లిస్తుంది. జీహెచ్ఎంసీ టెండర్ను మండీలోని ముండే దారులందరికీ అప్పగించాలి. బయటివారికి ఇవ్వరాదు. అదేవిధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఆరెకటిక (మటన్) వృత్తిని ప్రైవేటు పరం చెయ్యడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కావున ఇలాంటి సమస్యలపైన ఆరెకటికలంతా ఐక్యతతో తమ హక్కుల సాధనకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- గుమ్మడిరాజు నరేష్
సెల్ : 9491039520