Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినీతిని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖను రద్దు చేస్తాననడం తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. ఈ రెవెన్యూ ప్రక్షాళన వెనుక రహస్య ఎజెండానే ఉందని తెలుస్తోంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలనుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వేస్తున్న కొత్త ఎత్తు. సమస్యలను పక్కదోవ పట్టించి రెవెన్యూ యంత్రాంగాన్ని చెప్పుచేతుల్లో ఉంచుకోవాలన్నది కేసీఆర్ ఎత్తుగడ. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలొచ్చాయి. దీని మూలంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవు తాయేమోనని ఈ నాటకానికి తెరలేపారు. ప్రభుత్వ శాఖలలో అవినీతి జరిగిపోతుంది, ఇది రెవెన్యూ శాఖలో మరీ ఎక్కువ. అంత మాత్రాన పూర్తిగా రెవెన్యూ శాఖనే రద్దు చేస్తామనడం అనాగరికమైన చర్య. రెవెన్యూ శాఖకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాగీరుదారు వ్యవస్థను రద్దు చేశారు. కౌలుదారు రక్షణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. వ్యవసాయ భూ సంస్కరణ చట్టాన్ని కోర్టు కేసుల్ని ఎదుర్కొంటూ సమర్థవంతంగా పని చేయగలిగారు. ప్రపంచంలో ఎక్కడా, ఎవరు చేయని విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసి రెవెన్యూ ఉద్యోగులు ప్రశంసలు పొందారు. వంద రోజుల్లో రెవెన్యూ ఉద్యోగులు పగలనకా, రాత్రనకా పని చేసి భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు. అంకితభావంతో పని చేసే ఉద్యోగులుండటం రైతుల అదృష్టమని అప్పుడు కేసీఆరే అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రెవెన్యూ శాఖలో నూతన సంస్కరణలు తీసుకొస్తే అందుకు సహకరిస్తామని బహాటంగానే చెప్పారు. ''లంచాలు ఇవ్వొదు, అవినీతి రూపుమాపుదాం'' అనే ముఖ్యమంత్రి ప్రకటనల పట్ల ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద స్పష్టత కొరవడింది. అవినీతి ఒక్క రెవెన్యూ శాఖలోనే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలలో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎందెందు వెతికి చూసినా అందందు గలదు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దీనిని తలదన్నుతున్న రాజకీయ అవినీతి మాటేమిటి? లక్షలాది, కోట్ల రూపాయలతో చేపడుతున్న సంక్షేమ పథకాలలో అవినీతి వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ నీటి పారుదల శాఖలో అవినీతికి మారుపేరుగా మారింది. ప్రజా సేవ ముసుగులో చెలామణి అవుతున్న రాజకీయ నాయకులు, దళారులు అవినీతి అక్రమాల ముందు రెవెన్యూ శాఖ అవినీతి ఏపాటిది..!? పాలకులు ప్రపంచ బ్యాంకు వద్ద నుంచి లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, ప్రజల నుంచి పన్నుల రూపంలో దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఖర్చవుతున్న కొటానుకోట్ల ప్రజాధనంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కమీషన్ల ముందు కాంట్రాక్టర్ల లాభాల ముందు రెవెన్యూ అవినీతి ఏపాటిది? పురపాలక సంఘాలలో నిర్వహించే అభివృద్ధి పనులలో 30శాతం కమీషన్లు వాటాల రూపంలో స్థానిక చైర్మన్లు, కౌల్సిలర్లు జేబుల్లోకి చేరుతున్నాయి. అందులో స్థానిక ఎమ్మెల్యేలకు పదిశాతం పోవాల్సిందే. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలలో కాంట్రాక్టర్లు బిల్లులు మంజూరు కావాలంటే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు అకౌంటెంట్లకు మొత్తం కలిపి 30శాతం కమిషన్లు ఇవ్వాల్సిందే. గృహ నిర్మాణ అనుమతుల జారీ నుంచి మొదలుకుంటే ప్రతి పనికి లంచాలు ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వందల కోట్లకు అధిపతులవుతున్నారు. ఎన్నికల అఫిడవిట్లో వారు ప్రకటించే ఆస్తుల వివరాలకే దిమ్మదిరిగిపోతుంది. ఇక అప్రకటిత ఆస్తుల గురించి ఊహించగలమా? టూజీ స్ట్రెక్టం కుంభకోణం, రాఫెల్ కుంభకోణం, తెలంగాణలోనూ ఎన్నో కుంభకోణాలు వెలుగు చూశాయి. అయినా ఒక్క నాయకుడు కానీ, ప్రజాప్రతినిధి కానీ జైలుకు పోయిన దాఖలాలు లేవు. రెవెన్యూ శాఖలోనూ అవినీతిని అరికట్టాల్సిందే. దానికి మార్గం ఆ శాఖనే ఎత్తేయడం కాదు కదా!? దానికంటే ముందు రాజకీయ అవినీతి మాటేమిటి? ప్రక్షాళనంటూ జరిగితే అది రాజకీయ అవినీతి నుండే జరగాలని ముఖ్యమంత్రికి తెలియదా? నిజం చెప్పాలంటే ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం వల్లనే అధికారులు లంచాలకు అలవాటుపడ్డారు. ఏ అధికారైతే అవినీతికి పాల్పడుతారో ఆ అధికారి భరతం పట్టండి చాలు. రెవెన్యూలోనే 34 చట్టాలున్నాయి. వీటినే ఖచ్చితంగా అమలు చేసినట్టయితే అవినీతిని అరికట్టవచ్చు. ఇప్పటికీ 30వేల మంది రెవెన్యూ సిబ్బంది ఆందోళనకు దిగుతామని చెబుతున్నారు. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయకుండా కాపాడాలంటూ చిన్నజీయర్ స్వామిని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవరు. చినజీయర్ స్వామికే తమ బాధలు చెప్పుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు చెప్పుకున్నట్టేనని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు భావించినట్టున్నారు. ఓట్ల కోసం రాజకీయ కుట్రలో రెవెన్యూ ఉద్యోగులను బలి పశువులు చేయొద్దు.
- దామరపల్లి నర్సింహ్మారెడ్డి
సెల్ : 9581358696