Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కలిగిన మనుజుండు కాముండు సోముండు
మిగుల తేజమునకు మెరయుచుండు
విత్తహీనుడెంత రిత్తయైపోవును'' అని వేమన ఏనాడో చెప్పాడు. అంటే ఆస్తిపాస్తులు, ధనం ఉన్నవాడే కీర్తిం చబడతాడని అది లేని వాడిని హీనంగా చూస్తారని భావం. ఇది నేడు మనందరికీ తెలుసు. '' అతడు మన ఊళ్లో వారందరికంటే గొప్ప ఆస్తిపరుడు'' అని నా చిన్నప్పు డు అతన్ని చూపించి చెబుతుంటే, ఆయన పట్ల అత్యంత గౌరవంతో కూడిన భయం వేసేది. కానీ మార్క్స్ నిరూపించిన దాని ప్రకారం ఆస్తులు ఎంత ఎక్కువ కలిగి ఉన్నాడంటే అంత దోపిడీదారు అని అర్థం. అయితే ఆస్తులు ఎలా సమకూరుతాయి? సొంత ఆస్తి అనేది ఎలా మొదలైంది? పరాయీకృతమైన శ్రమనే సొంత ఆస్తి అంటాడు మార్క్స్. అనేక మంది శ్రామికులు పని చేసి సృష్టించిన సంపదను ఒకరో ఇద్దరో సొంతం చేసుకోవడం ద్వారా ఏర్పడినదే సొంత ఆస్తి. అయితే ఆదిమంలో సొంత ఆస్తి ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం.
అనాగరిక యుగపు దిగువ దశవరకూ ప్రజలకున్న ఆస్తి అంతా ఇల్లు, బట్ట, మొరటు రకం ఆభరణాలు, వండుకునేందుకు, తిండి సంపాదనకు పనికి వచ్చే పరికరాలు, నాటు పడవలు, ఆయుధాలు. ఆ తర్వాత ర్వాత గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పందులు మొదలైనవి. ఈ పశువులు మందలు మందలుగా పెరిగి సంపదగా మారాయి. మరి ఈ పశు సంపదంతా అప్పటికున్న గణ సమాజంలోని గణాలకే చెందేది. కానీ చాలా ప్రాచీన కాలంలోనే ఈ మందలు సొంత ఆస్తిగా మారిపోయాయి. పెరిగిన ఈ పశు సంపదతో పాటు కుటుంబ వ్యవస్థకు పునాది పడింది. మంద కుటుంబ ఆస్తిగా మారింది. గణాల మధ్య యుద్ధాలు, ఓడిన వారిని బానిసలుగా చేసుకున్న పిదప ఈ పశుపోషణకు వారిని ఉపయోగించడం వల్ల సంపద వృద్ధి పొందింది. మాతృ స్వామిక సమాజం పితృస్వా మిక సమాజంగా మారి, తండ్రి కుటుంబ యజమాని అయ్యాడు. శ్రమ విభజన జరిగి కుటుంబ యజమాని ఉత్పత్తి సాధనాల సొంతదారుడయ్యాడు. ఆ తర్వాత వ్యవసాయం మొదలుపెట్టి భూమిని సొంతం చేసుకున్నాడు. సొంత ఆస్తి అనేది మొదటగా భూమియే. భూమి ఆరంభంలో ఉత్పత్తి శక్తిగానే ఉంది కానీ పెట్టు బడిగా మారలేదు. పరిశ్రమలు వచ్చాక భూమి, వ్యవసాయం కూడా పరిశ్రమగా ఆవిర్భవించింది. అదనపు ఉత్పత్తి మొదలై, వర్గాలు ఏర్పడిన తర్వాత ఉత్పత్తి సాధనాలు, ప్రకృతి వనరులపై కొందరు యజమానులుగా అశేష జనం శ్రామికులుగా ఆస్తి లేని వారుగా తయారయ్యారు. ప్రైవేటు ఆస్తి అనేక శతాబ్దాలుగా వివిధ రూపాల్లో అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాని అభివృద్ధి ఇంకా పూర్తి కాలేదు. ఇది ఇప్పుడు పారిశ్రామిక పెట్టుబడి రూపం సంతరించుకుంది. అలాగే ద్రవ్య పెట్టుబడిగా చలామణీ అవుతోంది. సమాజంలోని అన్నింటిలోకి చొచ్చుకుని పోయి, ఆధిపత్యం చెలాయిస్తూ అత్యంత సార్వత్రిక రూపంలో ఒక ప్రపంచ శక్తిగా మారేంత వరకూ ఇది పెరుగుతూ పోతుంది. కేవలం మోహపూరిత ఇంద్రియానుభూతుల వాస్తవ అభివ్యక్తతే వ్యక్తిగత ఆస్తి. అలాగే మానవుడు తనకు తానే వస్తువుగా ఉంటాడు. అదే సమయంలో తనకు తానే అన్యధీకరణమై అమానవీయమైన వాడిగానూ ఉంటాడు. ఆస్తి యొక్క వ్యక్తీకరణనే మనిషి జీవితంగా అభివ్యక్తి మొదలైనప్పుడు వాస్తవమైన మనిషిగా అతడు కనపడడు. అతనొక పరాయీకరణ జీవి. కనుక స్వానుమతితో కూడిన వ్యక్తిగత ఆస్తి రద్దు అంటే మానవ సారం యొక్క ఇంద్రియాను భూతుల వినియోగం. ఇది యదార్థమైన మానవ జీవితం. వ్యక్తిగత ఆస్తి రద్దు చేయబడితే మానవ జ్ఞానేంద్రియాలకు, లక్షణాలకు విముక్తి లభిస్తుంది. విముక్తి ఎందుకంటే ఆత్మగతంగానూ వస్తుగతంగానూ మానవ జ్ఞానేంద్రియాలు వాటి లక్షణాలు మానవీయమవుతాయి. మనిషి చూపు మానవీయమవుతుంది. మనిషి పరాయీకరణను రద్దు చేయడమంటే ప్రాథమికంగా ప్రైవేటు ఆస్తి రద్దు చేయడంపైనే ఆధారపడి ఉంటుందనీ ప్రైవేటే ఆస్తి అనేది పరాయీకృత శ్రమ, ఆర్థిక పరాయీకరణల ఉత్పాదితం, ఫలితం, ఆవశ్యమైన పర్యవసానం అనీ మార్క్స్ స్పష్టంగా చెబుతాడు.
పరాయీకరణ ప్రపంచం అనేది ఆస్తికి మాత్రమే కుదించిన మొరటు ఆదిమ అవసరాల ప్రపంచం. ప్రైవేటు ఆస్తి మనల్ని ఎంత బుద్ధిహీనులుగా, ఏకపక్షంగా మార్చిందంటే, ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అది మనది. లేదా మనం నేరుగా అనుభవించినప్పుడు, తిని, తాగి, పొంది, ధరించి, నివసిస్తేనే మనదవుతుంది. పెట్టుబడిగా మన దగ్గరుంటేనే మనదవుతుంది. అంటే వస్తువును మనం ఉపయోగిస్తేనే మనది. కేవలం ఆస్తి రూపంలోనే మనిషి జీవితం వ్యక్తమవుతుంది. మనిషికి వెలుపల ఆస్తి ఉంటుంది. అలాగే తనకు తానే వెలుపల ఉంటాడు. మనిషి మనిషికి చెందకుండా ఆస్తికి చెందుతాడు. ఇక్కడ మనదేశపు అత్యంత ఆస్తిపరులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ వీళ్లను వారి ఘనమైన ఆస్తులుగానే చూస్తాము. వారి శిరస్సుపైన నృత్యం చేస్తున్న విలువల్లా వారి ఆస్తులు కనపడతాయి. వారిపట్ల వినయమైనా, విధేయతైనా, గౌరవమైనా, మర్యాదైనా, ప్రేమైనా, స్నేహమైనా అన్నీ ముసుగేసుకున్న ఆనాత్మికచర్యలే. అన్యధీకరించిన వ్యక్తీకరణలే అవుతాయి. ఆస్తికీ, ఆస్తి లేని తనానికీ మధ్య ప్రతివాదం ఇంకా ఉపేక్షింపబడిన ప్రతి వాదంగానే ఉంది. వాటి మధ్య ఉన్న అంతర్గత క్రియాశీల సంబంధాలు, వైరుధ్యా లు పూర్తిగా అవగాహనలోకి రావాలి. శ్రమ, పెట్టుబడు లకు మధ్యనున్న ప్రతివాదం అర్థం కానంత వరకు ఆస్తికి, ఆస్తి లేనితనానికి మధ్య ఉన్న ప్రతివాదం అర్థం కాదు. వ్యక్తిగత ఆస్తి సారమైన శ్రమ పెట్టుబడుల మధ్య నున్న వైరుధ్యం పరిష్కారం వైపు నెట్టబడుతుంది. అది అనివార్యం. అభివృద్ధి చెందిన రూపంలో, సంపూర్ణ జీవంతో ప్రైవేటు ఆస్తి తన మృత్యువును తన వ్యతిరేక శక్తిని, పీడిత పరాయీకృత పారిశ్రామిక కార్మికుల శ్రమను సృష్టిస్తుంది. ఆ క్షణం నుండి అది తన నిర్మూలనవైపు పురోగమిస్తుంది. కానీ దీని పరిపక్వతకు దారి తీసిన మార్గమే దీని మృత్యుమార్గం. కమ్యూనిజం స్థాపనకు వివిధ రూపాల్లో, దశల్లో ఇది కనిపిస్తుంది.
కమ్యూనిజం యొక్క ప్రత్యేక లక్షణం యే ఆస్తినైనా రద్దుచేయడం కాదు. బూర్జువా ఆస్తిని రద్దు చేయడం. సొంత ఆస్తిని రద్దు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు అమల్లో ఉన్న ఆస్తి సంబంధాలను రద్దుచేయడమనేది కమ్యూనిజం యొక్క ప్రత్యేక లక్షణ మేమీ కాదు. చారిత్రక పరిస్థితులలో వచ్చిన మార్పుల ఫలితంగా గతంలో కూడా ఆస్తి సంబంధాలన్నీ నిరంతరం మారుతూనే ఉన్నాయి. ఉదా|| ఫ్రెంచి విప్లవం ఫ్యూడల్ ఆస్తిని రద్దు చేసి బూర్జువా ఆస్తిని నిలబెట్టింది. వ్యక్తిగత ఆస్తి రద్దయితే పనులు చేయడం అనేదే ఆగిపోతుందనీ, సోమరితనం అలుముకుంటుందనీ కొందరంటారు. ఈ వాదమే నిజమైతే బూర్జువా వర్గపు సోమరితనంతో ఈ సమాజం ఎప్పుడో భ్రష్టు పట్టిపోయి ఉండేది. సమాజంలో నూటికి తొంబై శాతంగా ఉన్న శ్రామికులకు సొంత ఆస్తి ఇప్పటికే రద్దయిపోయింది. ఈ సమాజంలో నిత్యం పని చేసే వాళ్లు ఏమీ సంపాదిం చుకోలేకపోవటమూ పని చేయని వాళ్ల సంపాదన పెరగటమూ మనం చూస్తున్నాం. కమ్యూనిజం యే వ్యక్తికీ సమాజ ఉత్పాదితాలను సొంతపర్చుకునే హక్కు లేకుండా చేయదు. అలా సొంత పరచుకోవడం ద్వారా ఇతరులను కూలివాళ్లుగా మార్చే హక్కును మాత్రమే అది తొలగిస్తుంది. ఆస్తిని రద్దు చేయడమంటే మన సొంత ఇల్లు, బతకటానికి అవసరమైన చేను, చెలక, సౌకర్యాలు రద్దుచేయడం కాదు. ఆస్తులను పెట్టుబడులుగా పెట్టి మరింత ఆస్తిని పోగు చేసుకోవడాన్ని రద్దు చేయడం. నాగరికతారంభం నుండీ ఆస్తి ఎంత విశేషంగా, ఎలాంటి భిన్న రూపాలలో పెరిగిపోయిందంటే, దాని ఉపయోగాలు ఎంతగా విస్తరించాయంటే, ప్రజలకు సంబంధించినంతవరకు లొంగదీయలేని మహాశక్తిగా అది తయారైంది. తాను సృష్టించిన మహాశక్తి ఎదుటనే మానవ మేధస్సు నిర్వణ్ణమైపోయింది. అయినా మానవుని బుద్ధి ఆస్తి మీద ఆధిపత్యం సంపాదించగల రోజు వస్తుంది. వ్యక్తి ప్రయోజనాలకన్నా సమాజ ప్రయోజనాలు ముఖ్యం. ఆస్తిని సంపాదించటమే మానవజాతి ధ్యేయం కాదు. సంపూర్ణమానవ కార్యకలాపం కొనసాగించడానికి సాధనంగా మాత్రమే తయారవుతుంది. సంపద పేదరికాల స్థానంలో సుసంపన్న మానవుడు, సుసంపన్న మానవతా మానవావసరం చోటుచేసుకుటాయి. మానవుడే సమాజానికి నిజమైన ఆస్తిగా పరిగణించే రోజు తప్పక వస్తుంది.
- ఆనందా చారి
సెల్ : 9948787660