Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గతి లేని సంసారం చేయొచ్చుగానీ.. శృతి గలవని సంసారం చేయలేం' అనే సామెతను పల్లెల్లో ఎక్కువగా వాడుతారు. ఈ సామెత రాష్ట్ర వ్యవసాయ శాఖ పనితీరుకు అద్దం పట్టినట్టుంది. ఇటీవల వ్యవసాయశాఖ కమిషనర్ కొంతమంది అధికారులతో కలిసి అకస్మాత్తుగా బయోఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపులను సీజ్ చేశారు. వరుసగా మూడు రోజులు పర్యటించి, కల్తీ వ్యాపారులను కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేసారు. వెంటనే వ్యాపారులందరూ ఏకమయ్యారు. చలో సెక్రటేరియట్గా బయలుదేరి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిని కలిశారు. చర్చలు జరిపారు. చర్చల్లో ఏం జరిగిందో తెలియదుగానీ వెంటనే కమిషనర్ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. చూసీ చూడనట్టుండాలి. ఎందుకిదంతా చేయడం, ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది. ఇక నుంచి ఆపేరు..! అని ఆ అధికారి హుకుం జారీ చేసి ఫోన్లో సెలవు తీసుకున్నారు. మూడు రోజులు విస్తృతంగా పర్యటించి, అక్రమ వ్యాపారం చేసే వాళ్ల ఆటకట్టించాలనుకున్న కమిషనర్ ఈ ఒక్క రోజుతోనే ముగింపు పలకాల్సి వచ్చింది.
- మోత్కూరు యాదయ్య