Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం నేర్పింది
పోరు లేనిదే బువ్వలేదని
పోరు నేర్పింది
త్యాగం లేనిదే బతుకు లేదని
అందుకే త్యాగాలకు వెనుదీయని పోరాట చరిత్రగా నిలిచాడు పండుగ సాయన్న. ఆయన గొప్ప మానవతావాది, వీరుడు, పేదల ఆకలి తీర్చిన ఆప్తుడు. చరిత్ర విస్మరించిన యోధుడు. వీళ్ల నిజమైన చరిత్ర వాళ్ల బిడ్డలుగా మనం తప్ప మరెవరూ రాయగలరు. వెతికి మనమే రాయాలి. చదువు, జ్ఞానం, ఆస్తి, అధికారం కేవలం పిడికెడు మంది గుత్త సొత్తు అయినది. చరిత్ర కూడా వీరిదే అయింది. సింహాలు తమ చరిత్రను రాసుకోకపోతే వేటకుక్కలు రాసిందే చరిత్ర అవుతుంది. అందుకే చరిత్రను వక్రీకరించి ఆయనను గజదొంగగా చిత్రీకరించారు. కానీ ప్రజలు మాత్రం వీరుడుగా వారి పాటల్లో, ఆటల్లో యాదిలో మ నాదిలో, హృదయాల్లో పదిలంగా దాచుకున్నారు. నూట యాబై ఏండ్లయినా ఆ వీరుడు మరణించిన రోజును యాది మరవకుండా పాలమూరు ప్రజలు వేలాదిగా తరలొచ్చి సమాధి దగ్గర నివాళులర్పిస్తున్నారంటే ప్రజల వీరుడు పండుగ సాయన్న. శత్రువుల పాలిట గండర గండడు- పండుగ సాయన్న.
సాయన్న 1860 సంవత్సరంలో ముదిరాజు కుటుంబంలో మొహర్రం అంటే పీర్ల పండుగ రోజు తల్లి సాయమ్మ తండ్రి అనంతయ్యకు జన్మించాడు. పాలమూరు దగ్గర నవాబ్పేట మండలం రామాపురం గ్రామానికి చెందినవాడు. చిన్ననాటి నుండి బాల భీముడుగా పేరు పొందాడు. బలంగా ఉండేవాడు. ఆటలందు, పాటలందు మేటికాడు. పదేండ్లోడు 15 ఏండ్ల పిల్లలతో పోటి పడేవాడు. 20 కేజీల గుండును అవలీలగా లేపేవాడు. ధైర్యవంతుడు. సహాయం చేయడం చిన్ననాటి నుండే అబ్బింది. నిరుపేద కుటుంబం, తండ్రి అంతయ్య చేపలు పడుతూ దొరల భూమి కౌలుకు తీసుకున్నాడు. ఆ కౌలు భూమిలో ఒక బావి తీస్తే నీళ్లు పడి పంట చేతికొచ్చింది. కానీ అది నిజాం రాజ్యం. కరుణం, పటేలు, నాగిరెడ్డి దొర ఖాన్సాబ్లు, వారి ఇనుప బూట్ల కింద ప్రజల్ని తొక్కి పెట్టారు. కనపడ్డ కోడి, యాటపోతులు, మంచి పంట, పొట్రగిత్త, ఆడి మనిషి ఏదైనా కంటికి నచ్చితే చాలు కాసేపట్లో గడీల ఉండాల్సిందే. సాయన్న పంట మీద నాగిరెడ్డి దొర కన్ను పడ్డది. అంతే సాయన్న తండ్రి అంతయ్య మీద నేరం మోపి ''నా అనుమతి లేకుండా నా భూమి దున్నినందుకు'' అని జరిమానా వేస్తారు. ఆ సంవత్సరం పండిన పంటంతా దొరకే. పైగా అనుమతి లేకుండా బావి తవ్వినందుకు వెయ్యి రూపాయలు జరి మానా విధంచి సాయమ్మ, అంతయ్యను కచ్చేరిలో కట్టేసి చింత బరిగెలు వొడిసేదాకా చితక బాదుతారు. దొర గింత అన్యాయం చేస్తుంటే మాట్లాడేవారే లేరు. ఏం చేయాలో పాలుపోక మహబూబ్నగర్ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కరుణం, దొర ''మాపైనే ఫిర్యాదిస్తారా?'' అని సాయన్న చిన్నమ్మపై అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. ఆ చెర నుంచి ఆమెను విడిపించడానికి సాయన్న వెళ్తే సాయన్నపై దొర గుండాలు దాడికి దిగారు. సాయన్న ప్రతిఘటించడంతో ఆ ఘర్షణలో పోలీస్ పటేల్ ఖాన్సాబ్, మరొకరు చనిపోయారు. దాంతో రెచ్చిపోయిన దొరలు సాయన్న ఇల్లు, బంధువులు, అనుచరుల ఇండ్లన్నీ తగులబెడితే భయంతో అక్కడ్నుంచి ఆ కుటుంబాలు ఊరు వదిలిపోయాయి. ఆ తర్వాత మెరుగోని పల్లె దగ్గర కొంతభూమిని సాగు చేసుకుంటూ సాయన్న కుటుంబం జీవించింది. ఇదే సమయంలో సాయన్న ఒక దళాన్ని తయారు చేసుకొని కర్రసాము, కత్తి సాము, గుర్రం స్వారీ, విలువిద్యలలో ఆరితేలేలా తీర్చిదిద్దాడు. దొరల ఇండ్లు, పెత్తం దారుల కోటలు, ధనవంతుల ఇండ్లపై దాడులు చేయడం, అక్కడ దొరికిన సొత్తును పేదలకు పంచిపెట్టడం మొదలుపెట్టాడు. మహబూబ్నగర్ దగ్గర ఫత్తేపూర్ మశమ్మ గుడి దగ్గర ప్రతి ఆదివారం, మంగళవారం ఎంతమంది జనం వస్తే అంత మందికి అన్నదానాలు, సహపంక్తి భోజనాలు పెట్టేవారు. ఇక్కడ అన్ని కులస్తులు వచ్చి కలగలసి కూర్చొని సహ పంక్తి భోజనాలు చేసేవారు. ఇలా ఆనాడే కుల నిర్మూలన పోరాటానికి బీజాలు వేశాడు. ఆ రోజుల్లో పాలమూరు వరుస కరువుతో అల్లాడిపోతున్నది. పంటల్లేవు. నీళ్లు లేవు. సరిగ్గా తిండి కూడా లేదు. అప్పులు చేస్తేనే పెండ్లిలు జరిగేవి. సాయన్న వధూవరులకు పుస్తె, మెట్టెలు, చెవుల కమ్మలు, నూతన వస్త్రాలు వివాహ విందు భోజనాలు పెట్టి ఘనంగా పెండ్లి జరిపించేవాడు. ఏ కష్ట మొచ్చినా జనం సాయన్న సాయం కోసం వచ్చేవారు. అడిగిన వారికి అందినంత సహాయం చేసేవాడు. మరో వైపు మంచినీటి బావులు, చెర్వులు, కుంటలు తవ్వించాడు. ఎల్లమ్మ, మైసమ్మ గుడులు కట్టించాడు. ఆధిపత్య శక్తులపై యుద్ధానికి ప్రజలను నిరంతరం చైతన్యపరిచా డు. ఇలా వందల సంఖ్యలో సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ధన్వాడ గుట్టల్లో ఫతేపూర్ మైసమ్మ గుడి అడవిలో సాయన్న కోటలు నిర్మించాడు. తుపాకులతో కాల్చడంలో శిక్షణ ఇప్పించాడు. ఆనాటి స్థానిక పోలీసులను బందించాడు. రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భూస్వామ్య పక్షాలు తట్టుకోలేకపోయాయి. నాగిరెడ్డి, రాంరెడ్డి దొరలు వెంగళరావులతోపాటు భూస్వాములు నిజాంపై ఒత్తిడి తెచ్చి సాయన్నను అరెస్టు చేయించారు. ఆ తర్వాత సాయన్నను చంపే పథకం వేశారు. జంగ్ జలాల్ఖాన్ మోహితిమిన్ సాబ్ ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్టు చేసి హతమార్చే కుట్రను ప్రజలు నిరసించారు.
సత్తూరి రాములు గౌడ్ పరహతుల్లా బేగ్సాబ్, రుక్మారెడ్డి రామారావులు పెద్ద మనుషులుగా నిలబడి సా యన్నను విడుదల చేయించాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెచ్చారు. సాయన్నను జైలు నుంచి విడుదల చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరిగాయి. ఆగ్రహించిన జనం జిల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలు కొట్టారు. కానీ సాయన్న అక్కడ లేడు. దీంతో కనపడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడ్డారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ పరిస్థితుల్లో వనపర్తి రాణి శంకరమ్మ ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ప్రజల పక్షాన నిలబడింది. నిజాం రాజు మీర్ మహమూద్ ఆలీని కలిసింది. ప్రజల కోరిక మేరకు సాయన్నను విడుదల చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. వెంటనే విడుదల చేయాలని వేడుకుంది. నిజాం రాజు వెంటనే సాయన్నను విడుదల చేయాలంటే పదివేల రూపాయలు జమానత్గా కట్టాలని రాణి శంకరమ్మకు షరతు పెట్టాడు. శంకరమ్మ అంగీకరించి రూ.పది వేలకు ష్యూరిటీ రాసిచ్చింది. నిజాంసర్కార్ ''మార్ మత్ చోడో'' అని హుకుం జారీ చేసింది. ఐతే భూస్వాములు మాత్రం ఎలాగైనా సాయన్నను ఖతం చేయకుంటే మనం ఖతం కావడం ఖాయం. సాయన్న చావో మన చావో తేల్చుకోవాలని కుట్రపన్నారు. ''మార్ మత్ చోడో'' అని ఉన్న స్టే ఆర్డర్ను ఎస్పీ మోహితి మిన్ సాబ్, జంగన్ లాల్ పట్వారీ వెంకట్రావు నక్క జిత్తుల సలహాతో ''మార్'' వద్ద పుల్ స్టాప్ పెట్టి (మార్. మత్ చోడో) '' చంపండి, వదలకండి'' అనే అర్థం వచ్చేలా మార్చి పండుగ సాయన్నకు మరణ శిక్ష విధించారు. పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర తల ఒక దగ్గర విసిరేసారు. ఇది తెలిసి ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండెపోటుతో చనిపోయాడు. నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి రాంరెడ్డి తదితర భూ స్వాములు దావత్ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాదిమంది ప్రజలు చుట్టుముట్టి తగులబెట్టారు. అందులోనే దొరలు కాలి బూడిదైపోయారు. తల్లి సాయమ్మ కొడుకు సాయన్న శవం కోసం అడివంతా వెతక గా మొండం పాలమూరు వీరన్నపేటలో తల తిరుమల దేవుని గుట్టలో దొరికాయి. తల తీసుకొని సాయమ్మ తన తల్లిగారింటికి చేరింది. దాస్కేపల్లిలో సాయన్నను సమాధి చేశారు. ఉబికి వస్తున్న దు:ఖాన్నంతా వడిసి పట్టుకుని ఆ వీరుని సమాధిని నేటికి కొలుస్తారు. ఆ యోధుడు చనిపోయింది 1890 అని చెబుతారు. అందుకు సరైన రికార్డులు లేవు. కానీ ఇది పాలమూరులో జరిగిన వాస్తవ చరిత్ర. సాయన్న చరిత్రను ఏ చరిత్రకారుడు రాయలేదు. కానీ జానపదులు సాయన్న చరిత్రను భద్రపరుస్తూ గానం చేస్తూనే ఉన్నారు. చీకటికోణంలో దాచేసిన మన వీరుల కథలన్నీ కావాలిప్పుడు. నీళ్లు పోసి వారి త్యాగాలను మొలవనిద్దాం. సూర్యునిలో పొడవనిద్దాం.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343