Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్థితి. ఐఎంఎఫ్ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్థం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. మనకు ఆమోదం ఉన్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్థితీ ఉంటుంది. రాబోయే రోజుల్లో పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదంటే మూడేండ్లలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.
ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అందుకే ఆశల పల్లకిలో ఉన్నవారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు ఉద్యోగాలు ఊడతాయో తెలియదు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయన్నది వాస్తవం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోస్యాన్ని 7.3శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5 శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడీబీ 7.2 అని, ఫిచ్ అనే రేటింగ్ సంస్థ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. నరేంద్రమోడీ సర్కార్ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి ఉన్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినప్పుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉన్నట్టు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్థాయిలో 7.2శాతానికి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది. దీనితోపాటే వేగంగా పెరుగుతున్న సంపద, అంతరాలు, ఉద్యమాలు విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఈ నేపథ్యం నుండి కార్మికవర్గం తన కర్తవ్యాలను రూపొందించుకోవాలన్నదే ఈ మేడే సందేశం.
మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం సమ్మెను అణిచేందుకు పూనుకుంది. దానిపై చికాగో నగరంలో మే 3వ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే 4న హే మార్కెట్ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజెంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికనేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు 10న ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని ఉరితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్ గవర్నర్ క్షమాభిక్షతో ఉరిశిక్షను రద్దు చేశారు.
1889 జూలైలో పారిస్లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టు పార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ ఉద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
అయితే నేడు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఐటీ, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్థాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా ఉత్పాదన, సేవలలో నిమగం కాని సీఈఓ, డైరెక్టర్ వంటి ఉన్నత పదవులలో ఉన్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక ఉత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటీ నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంతమంది ఉత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో ఉంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. కానీ ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావ జాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితోపాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారం. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్ చరిత్ర. అందుకే దోపిడీ దారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా, సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్ సంఘ్ పేరుతో ఆర్ఎస్ఎస్ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం చెప్పుకోవచ్చు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్ధతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పథంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను ఉత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.
- ఎం కోటేశ్వరరావు
సెల్ : 8331013288