Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భూమిలోన పుట్టు భూసారమెల్లను
తనువులోన పుట్టు తత్త్వమెల్ల
శ్రమములోన పుట్టు సర్వము తానౌను
విశ్వదాభిరామ వినురవేమ''
అని ఎప్పుడో పదిహేడవ శతాబ్దంలో చెప్పాడు వేమన. సాగు చేయగా చేయగా భూ సారంలోంచి పంటలు పండు తాయి. సంఘర్షణలో నుండి సత్యం పుడుతోంది. అలాగే శ్రమలోంచే అన్నీ పుడతాయి అని వేమన గ్రహించాడు. కానీ మార్క్స్ ఆ శ్రమని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఆ శ్రమ చేసేవారు ఏ సంపదా లేని క్షుధార్తులుగా ఎందుకు ఉన్నారో విపులంగా వివరించి చెప్పాడు. శ్రమ జీవన సౌందర్యాన్ని కురూపంగావిస్తున్న శక్తుల పొట్ట విప్పి చూపించాడు.
శ్రమ లేకుండా ఇప్పటి ఈనాటి ప్రపంచమే లేదు. ఈ నాగరిక మానవుడూ లేడు. మనం ఉపయోగించే వస్తువులు, సౌకర్యాలు, విలాసాలు, సంస్కృతి, భాషా సాహిత్యాలు, విజ్ఞానం టెక్నాలజీ, తాత్విక రాజకీయ ఆర్థిక, సామాజిక కార్యకలాపాల న్నింటికీ మూల కారణ అంశం శ్రమ. శ్రమ వినా జగు త్తు ఇంకేమున్నది. శ్రమ అనగానే శారీరకమైనదిగానే మనం భావిస్తాము. కానీ మన ఆలోచనల కారకం కూడా శ్రమనే. శ్రమ చేయి కుండా మన ఆలోచనలు వెల్లి విరిసేవి కావు. మనిషి ని మనిషిగా తీర్చిదిద్దినదీ శ్రమే. మరి ఇంత గొప్ప పాత్రను నిర్వహించిన, నిర్వ హిస్తున్న శ్రమను అతి చులకనగా, హీనంగా చూసే సమాజం ఎందుకు తయారైనదో, దాని మతల బు ఏమిటో విశదపరచి, శ్రమకు అంటే శ్రమ చేసే శ్రామి కునికి అగ్రస్థానమిచ్చి, శ్రామిక రాజ్య స్థాపన జరగాల ని శ్రమించి అందించిన సిద్ధాంతమే మార్క్సిజం.
శ్రమ అనేది మానవుడూ ప్రకృతీ పాల్గొనే ఒక ప్రక్రియ. తన సొంత కోర్కెలకు అనుగుణమైన రూపంలో ప్రకృతి నుండి ఉత్పత్తి అయ్యే వాటిని స్వాధీనం చేసుకోవడం కోసం తన సహజ శారీరక శక్తుల్నీ, కాళ్లనీ, చేతుల్నీ, తలనీ చలనంలో పెడతాడు. ఆ రకంగా అతడు బాహ్య ప్రప ంచంపై పని చేస్తూ దానిని మారుస్తూ అదే సమయలో తన స్వభావాన్ని మార్చుకుంటాడు. అందుకనే ఈ చరాచర ప్రపంచ నాగరికత సృష్టికీ, నేటి మానవ పరిణామానికీశ్రమనే మూలకారణమని చెబుతున్నాం.
శ్రమను మనం మానవ శ్రమగానే భావిస్తాం అంటాడు మార్క్స్. ఒక సాలీడు చేసే పని ఒక నేతగాడు చేసే పనిలాగానే కన్పిస్తుంది. తేనెటీగ తన తేనెతుట్టెను వాస్తు శిల్పి సైతం సిగ్గుపడేలా నిర్మించుకుంటుంది. అయితే తేనెటీగకన్నా వాస్తు శిల్పి మెరుగైనవాడని చూపే అంశం ఒకటుంది. వాస్తు శిల్పి వాస్తవంగా తన కట్టడాన్ని నిర్మించడానికి ముందే దాన్ని ఊహా రూపంలో నిర్మిస్తాడు. ప్రతి శ్రమ ప్రక్రియ చివర కలిగే ఫలితం ప్రారంభంలోనే కార్మికుని ఊహ లో ఉంటుంది. పని చేసే పదార్థాన్ని మార్చడమేకాక, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. ఇది పని చేసే వాని పని విధానాన్ని నిర్ణయిస్తుంది. శారీరక అవయవాలే కాక మొత్తం కార్యకలాపం జరుగు తున్నంత సేపూ పూర్తి కోరికతో ఉండాలి. పని స్వభా వం అతనికి నచ్చితే స్వేచ్ఛగా ఆనందంగా పని చేస్తా డు. పని స్వభావం నచ్చకపోతే అతను మరింత శ్రద్ధ తో ద్యాసతో శారీరక, మానసిక శక్తులను కూడదీసు కుని పని చేయవలసి వస్తుంది. అంటే శ్రమ చేసే శ్రామికునికి తను చేసే పని స్వభావంపై ఇచ్చలేనితన మూ, స్వేచ్ఛలేని తనమూ వల్ల ఆనందం పనిలో మృగ్య మైపోతున్నది. ఆ శ్రమ ఇచ్చే ప్రతిఫలం కూడా శ్రమికుణ్ణి ఆనందపర్చడం అలా ఉంచి కనీసం సంతృప్తి పరచ డమూలేదు. అది పెట్టుబడీదారి విధానపు లక్షణం.
అదేవిధంగా మన నేటి విద్యా వ్యవస్థనూ పరిశీ లించవచ్చు. విద్యార్థికి తను చేస్తున్న పనిపై (చదువు పై) ఇచ్చలేదు. స్వేచ్ఛలేదు. అందువలన చదవటం ఆనందంగానూలేదు. అంతేకాదు దాని ఫలితాలూ ఆనందపరిచేవిగా ఉండటం లేదు. అందుకనే అవి మనుషుల్ని అంతమొందించేవిగా తయారయ్యాయి.
ఇప్పుడు అసలు చర్చకొస్తే, శ్రమ అనేది ఎక్కడ ఉంటుంది?. ఎలా కనపడుతుంది. దానికి రూపం లేదు. కానీ శ్రమ కారణంగా ఏర్పడిన పదార్థ రూపంలోనే అంతస్సారంగా అది ఉంటుంది. ప్రకృతి పదార్థాలకు శ్రమను జోడిస్తేనే మనకు ఉపయోగపడే వస్తువులు, సరుకు లుగా మారతాయి. అంటే ఆర్థిక అంశం లో కీలకమైన మారకపు విలువను ఏర్పరచేది శ్రమనే. మారకం విలువ అనేది మానవ శ్రమదే. సహజ భూమి మీదనే మానవ శ్రమ మొదలైంది. అంటే భూమిని చదును చేయడం, దున్నడం వల్లనే దానికి విలువ వస్తుంది. ఆ విలువ దున్నిన శ్రమది. భూమిది కాదు. అసలు భూమి సహజమైనది. ఏ విలువా ఉండదు. భూమిలో బొగ్గు లోహాలు, ఖనిజాలు ఎన్నో సహజ వనరులు ఉంటాయి. ఇవన్నీ ఏ విలువా లేనివే. కానీ వాటిని భూమి పైకి తెచ్చుకుంటేనే విలువ ఏర్పడుతుంది. అంటే విలువ అనేది మానవ శ్రమదే. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న వస్తువుల్ని చూడండి. దానికున్న విలువ అంతా దానిని చేసిన శ్రమ విలువనే. విషాదమేమిటంటే ప్రతి వస్తువుకూ విలువను అందించిన శ్రామికుడు అసలు విలువలేని వాడిగా మారటం. తన శ్రమ ద్వారా అనేక సరుకులను ఉత్పత్తి చేసిన కార్మికుని శ్రమశక్తి కూడా సరుకు రూపం ధరిస్తుంది. అంటే శ్రామికునికి ఉన్న ఏకైక ఆస్తి శ్రమ శక్తి. అది సరుకుగా మారుతుంది. దాని ఫలితంగా అతని శ్రమ వేతన శ్రమ అవుతుంది. ఈ సరుకు కొనుగోలు చేసేది పెట్టుబడిదారుడు. కార్మి కుడు ఉత్పత్తి చేసే ప్రతి ఉత్పాదాతం సార్వత్రిక సరు కు అవుతుంది.ఇది పెట్టుబడీదారి యుగపు స్వభావం.
మిగిలిన వస్తువులన్నింటిలాగానే ఒక మనిషి విలువ లేదా అర్హత అతని ధరకే. అంటే అతని శక్తిని ఉపయోగించుకున్నందుకు చెల్లించే మొత్తం. అయితే కార్మికుడు తన శ్రమను ఒక సరుకుగా అమ్మకానికి ఎందుకు పెడతాడు. కార్మికుడు సరుకుగా మార్కెట్కు ఎందుకు తరలించబడ్డాడు? ఇవేమీ మనం చదువుకునే అర్ధశాస్త్రం వివరించదు (విద్యాలయాల్లో). ఒకవైపున డబ్బు లేదా సరుకుల యజమానుల్నీ, మరోవైపున తమ సొంత శ్రమశక్తి తప్ప మరేమీలేని మనుషుల్నీ ప్రకృతి సృష్టించదు. ఈ సంబంధానికి ప్రాకృతిక పునాదిలేదు. అనేక సామాజిక పరిణామాలలో సామాజిక ఉత్పత్తి యొక్క రూపాల పరంపర రూపుమాసిపోగా ఏర్పడిన ఫలితం ఇది.
శ్రమతోనే ప్రతిదాన్నీ కొంటాము. శ్రమతో సం చితమైన పెట్టుబడితో ప్రతిదీ కొంటాం. కానీ కొనలేని స్థితిలో ఉన్న కార్మికుడు తనని తాను అమ్ముకుంటాడు. తన మానవీయతను కూడా అమ్ముకుంటాడు. శ్రమను గూర్చి మాట్లాడుకోవడమంటే శ్రామికుని గురించి మాట్లాడుకోవడమే.
అనేక అసమానతలకు, దోపిడీ వేగానికీ ఉపయ ుక్తమైన శ్రమ విభజన నాగరికతా పరిణామంలో వివి ధ రకాలుగా ఆరంభమైంది. సమాజంలో మొట్టమొ దటి శ్రమ విభజన స్త్రీ, పురుషుల మధ్య జరిగిందని ఏంగెల్స్ అంటాడు. మొదటి సార్వత్రిక శ్రమ విభజన వ్యవసాయదారులు, పారిశ్రామికదారులు, దుకాణాదా రులుగా, రెండవది పై మూడింటిలోనూ పనిచేసే శ్రామికుల విభజన. మూడవది విడివిడి చేతివృత్తుల్లో పని చేయడం. ఇది సమాజంలోని అంతర్గత శ్రమ విభజన. అదే విధంగా పరిశ్రమలోనూ అంతర్గత శ్రమ విభజన ఉంటుంది. అయితే సమాజ శ్రమ విభజనలో వారు తయారు చేసే సరుకుల ఉత్పత్తి సాధనాలు వేరువేరు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. కానీ ఒక పరిశ్రమలోని ఉత్పత్తి సాధనాలన్నీ పెట్టుబడిదారుని చేతుల్లో కేంద్రీకృతమై ఉంటాయి.
భూమిపై ఉమ్మడి స్వామ్యం, వ్యవసాయంతో సమ్మిళితమైన చేతివృత్తులూ, మార్చరాని శ్రమ విభజనా అనేవి ప్రాచీన గ్రామ సమాజాల ప్రాతిపది కన జరిగేవి. ఈ సమాజంలో ఉత్పత్తి చేసేవి ఈ సమాజమే అనుభవిస్తుం ది. కానీ సరుకుల త యారీలో ఉత్పన్నమైన శ్రమ విభజనతో ఈ ఉత్పత్తికి సంబంధమే లేదు. అంటే పరిశ్రమ లలో ఉత్పత్తి అయిన స రుకు లకు, శ్రామి కుని కి సంబంధం ఉండదు.
ఇక సమాజం అంతకంతకూ మరింత సుసంపన్నమయ్యే కొద్దీ శారీరక శ్రమ మే ధోశ్రమల మధ్య విభజ న ఇతర శ్రమ విభజన ల లాగానే మరింత ప్ర స్ఫుటమూ నిశ్చితమూ అవుతుంది. ఈ వేర్పా టుల యు గంలో ఆలోచించడమే ఒక విశిష్టమైన వృత్తిగా రూపొందవచ్చు. ''ఒక మనిషిని ఉప విభజన చేయడమంటే, అతడు మరణ శిక్షా పాత్రుడైతే అతన్ని ఉరితీయడమే, దానికి పాత్రుడు కాకుంటే, అతన్ని హత్య చేయడమే. శ్రమ విభజన ఒక జాతిని హత్య చేయడమే'' అంటారు ఆర్థిక వేత్తలు.
పరిశ్రమలలో శ్రమ విభజన అనేది పెట్టుబడి దారుని ప్రత్యేక సృష్టి. ఇందులో స్పెషలైజ్డ్ పనిని వేరువేరు వ్యక్తులకు పంపిణీ చేస్తారు. అంటే ఒకే పనిని పదేపదే చేయడం ద్వారా పని కాలంలో వేగమూ, నైపుణ్యమూ పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది. ఇదే యజమానికి కావలసింది. అతని ప్రత్యేకీకృత పని చాతుర్యాన్ని బలవంతాన పెంచడం ద్వారా కార్మికుణ్ణి అంగవికలుడైన శత వికారిగా మార్చివేస్తుంది.
అన్ని పనులనూ చేయగల మనిషి సామర్థ్యాన్ని కొన్ని సరళమైన పనులను నిర్వహించడంలో యావజ్జీ వితం గడిపే వ్యక్తికి తన గ్రహణ శక్తిని ఉపయోగించే అవకాశం ఉండదు. అతడు ఎంత మూడుడూ అజ్ఞాని కావటానికి అవకాశముందో అంత మూడుడూ అజ్ఞాని అవుతాడు. అతని చలనం లేని జీవితం ఒకే విధంగా సాగడం వలన సహజంగానే అతని మనోధైర్యం దెబ్బతింటుంది. శారీరక చురుకుదనం పాడుతుంది. తాను ప నిచేసే ఉద్యోగంలో తప్ప మరే వృ త్తిలో పని చేయలేడు. యాంత్రికమ వుతాడు. బౌద్ధిక, సామాజిక, సమర శీల సుగుణాలనన్నింటినీ ఫణంగా పెట్టి ఈ ప్రత్యేకీకృత పని చేయ డంలో నిష్ణాతుడు కనపడతాడు.
సామాజిక ఉత్పత్తిదారుడైన వ్యవసాయదారుడు, వృత్తిదారుడు అనేక పనులను చేయగలుగుతాడు. తన శ్రమ ద్వారా జరిగిన ఉత్పత్తిని తన చేతుల్లో చూసుకుంటాడు. ఈ రెండింటికీ పారిశ్రామిక కార్మికుడు దూరమవుతాడు. సామాజిక అసమానత లకు శ్రమ విభజనే మూల కారణంగా నిలుస్తుంది. శ్రమ విభజనను తనకు అనుగుణంగా, లాభాకరంగా పెట్టుబడిదారుడు మలచుకోవడం వల్ల సమాజంలో ని అశేష ప్రజానీకానికి కష్టాలు, దు:ఖాలు.
ఇప్పుడు సమాజంలో అన్ని స్పెషలైజ్డ్ కోర్సుల్నే చూస్తాము. ముక్కు డాక్టరు, కంటి డాక్టరు, గుండె డాక్టరు, పొట్ట డాక్టరు నరాల డాక్టరు అని మన శరీరంలో ఎన్ని భాగాలుంటే అన్ని రకాల వైద్యులను మనం చూస్తున్నాం. అట్లాగే చదువుకునే కోర్సులూ ప్రత్యేకమైనవే. దీనివల్ల మనిషి సమగ్రతను కోల్పోతు న్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎన్నికలలో ఏం చేస్తే గెలవ చ్చో ప్లానింగ్ చేసే స్పెషలిస్టులొ చ్చారు. ఇవన్నీ పెట్టుబడీదారీ వ్యవస్థ పర్యావసానాలు.
శ్రమను దోచుకోవడంలో అత్యంత అమాన వీయంగా తన విస్తృతినీ, సామాజిక విశృం ఖలత్వా న్ని పెంచుతున్న పెట్టుబడీదారీ వ్యవస్థలోని ఉత్పత్తి విధానాన్ని సంబం ధాలను మార్చడం, శ్రమకు అత్యున్నత గౌరవాన్ని శ్రామికులకు విలువైన జీవి తాన్ని అందించడమే మార్క్సిజం లక్ష్యం.
- ఆనందాచారి
సెల్ : 9948787660