Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యం.. సత్యం.. సత్యం.. అంటూ అనునిత్యం జపం చేసిన హరిశ్చంద్రుడు... చివరకు ఆ సత్యం కోసం రాజ్యాన్ని, పెళ్లాం బిడ్డలను కూడా పోగొట్టుకుని కాటికాపరిగా మారాడు. చరిత్ర పుటల్లో సత్య హరిశ్చంద్రుడుగా మిగిలిపోయాడు. ఇదే కోవలో అవినీతి రహిత పాలన, పారదర్శకతతో కూడిన ప్రభుత్వం... అంటూ రోజూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి... ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సత్యాలను మరుగుపరిచి, చెవుల్లో గులాబీలే కాదు.. కాలీఫ్లవర్లే పెట్టేస్తున్నారు. ఇంటర్ బోర్డులో అవకతవకలు, గ్లోబరీనా సంస్థకు సంబంధించిన మతలబులన్నీ బయటకొచ్చాయి. మీడియాలో వీటిపై పుంఖానుపుంఖాలుగా కథనాలూ వార్తలూ వెలువడ్డాయి. చివరికి యువరాజు అండతోనే గ్లోబరీనా సంస్థ టెండర్లు దక్కించుకుందనే చేదు నిజం బయటకిపొక్కింది. దీంతో నిరసనలు, ఆందోళనలు ఉధృతమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డును ముట్టడించారు. వారిని రోడ్లపై బరబరా ఈడ్చుకుంటూ అరెస్టు చేసిన పోలీసులు.. నిరసన తెలిపిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్స్టేషన్లలో కుక్కారు. రాష్ట్రం మొత్తం ఈ విధంగా అల్లకల్లోలమవుతుంటే సీఎం నింపాదిగా వారంరోజుల తర్వాత సమీక్షించారు. ఆ సందర్భంగా గ్లోబరీనా సంస్థను పల్లెత్తుమాట కూడా అనలేదు. ఆ మరుసటి రోజు ఓ సమావేశంలో మాట్లాడిన యువరాజా కేటీఆర్ వారు... 'గ్లోబరీనా సంస్థనా...? అదెక్కడుందీ...? అసలు నేను ఆ పేరే వినలేదే..?' అని నొక్కి వక్కాణించారు. దీంతో అసలే ఎండదెబ్బకు కుదేలవుతున్న తెలంగాణ ప్రజలు... ఆయనగారి మాటలతో సొమ్మసిల్లి పడిపోయారు. -బి.వి.యన్.పద్మరాజు