Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ఆయన సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించి విమర్శకుల మన్ననలూ పొందారు. సొంత పార్టీ నేతలు మాత్రం ఆయనను జోకర్లా చిత్రీకరించి అవమానపరించారు. ఎట్టకేలకు అధ్యక్ష పదవి నుంచి దించేశారు. ముందస్తు ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ రాకుండా కొంతమంది పెద్దలు అడ్డుపడ్డారు. అయినప్పటికీ అధిష్టానాన్ని ఒప్పించి ఆయన టికెట్ సాధించారు. ఇవన్నీ ఒకవైపు. తాజాగా ఆయన పీసీసీ అధ్యక్షపదవి కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆయన రచయిత అవతారమెత్తినట్టు ఓ చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేసీఆర్ పాలన తీరుపై అప్పుడప్పుడు వివిధ పత్రికలలో తన అభిప్రాయాలు రాస్తుంటారు. పార్లమెంటు ఎన్నికలను పురస్కరించు కుని కాంగ్రెస్ మ్యానిఫెస్టో, రాహుల్ రాజకీయ చతురతపై కండ్లకు కట్టినట్టు కరపత్రాలు ముద్రించారు. అవి తెలుగుబాషలోనే కాకుండా అన్ని భాషాల్లోను ముద్రించి దేశ వ్యాప్తంగా పంచుతున్నారు. మళయాళం, తమిళం, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, ఒడిస్సా, కన్నడం, బెంగాలీ ఇలా అనేక భాషల్లో ముద్రించి పంచుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో పొన్నాల కరపత్రం ప్రత్యక్షమవు తున్నదని గాంధీభవన్లో ఒక నాయకుడు చెప్పారు. ఈ కరపత్రాలను ఆ రాష్ట్ర నాయకులే ఓటర్లకు విసృత్తంగా పంచుతున్నారని, బాగా రెస్పాన్స్ ఉందని పొన్నాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలు... కాదు కాదు... పదవి కోసం కోటి కరపత్రాలు పంచు తున్నారని ఒక నేత చమత్కరించారు.
- గుడిగ రఘు