Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంద్రబాబునాయుడు రాజకీయాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తను శాసనసభలో అడుగుపెట్టి 2019 మార్చి 15వ తేదీకి 41 ఏండ్లు పూర్తి అయ్యాయి. చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. రాజకీయాలు నడపడంతో దిట్ట అయిన చంద్రబాబు రాజకీయంగా ఎదుగుతూ సందర్భానుసారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తన మామగారైన ఎన్టీ రామారావుకు మద్దతు ఇచ్చారు. తాను అధికారం చేపట్టడం కోసం ఆయనను అవమానాలు పాలు చేసి, పక్కన పెట్టారు. ఆ తరువాత ఆయన మరణానంతరం ఆయన దేవుడని, రాజకీయ మనుగడ కోసం, అధికారం కోసం ఆయన పేరుని ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏండ్లు, నవ్యాంధ్రలో 5 ఏండ్ల నుంచి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రెండెకరాలతో మొదలైన ఆయన ఆర్థిక ప్రస్తానం వందల కోట్లకు చేరుకుంది. 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబుకు 69 ఏండ్లు నిండాయి. ఇక తన కుమారుని విషయంలో రాజకీయంగా జాగ్రత్తపడాలన్న ఆలోచన మొదలైంది. మన దేశంలో జాతీయ స్థాయిలో, రాష్ట్రాలలో వంశపారంపర్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. అదొక ఆనవాయితీగా, ఓ హక్కుగా తయారైంది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారు. ఆ తరువాత ఆయన కూతురు ఇందిరాగాంధీ, మనవడు రాజీవ్ గాంధీ ప్రధాని పదవిని అలంకరించారు. ఇప్పుడు ఆ వరసలో ఆయన ముది మనవడు రాహుల్ గాంధీ నిలబడ్డారు. చాలా రాష్ట్రాలలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. వారి తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా వారసులుగా రాజకీయ గద్దెనెక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆత్రంతో ఉన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని తన కుమారుడు లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే కొంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి, మధ్యలో కుమారుని ఆ స్థానంలో నిలిపి చూసుకోవాలన్న ఆశ, ఆలోచనతో ఆయన ఉన్నట్టున్నారు. ఈ రకమైన ఆలోచనలు మన దేశ రాజకీయాలలో కొత్తేమీ కాదు. ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా రాజు కొడుకు యువరాజు అన్న రీతిలో మానసికంగా సిద్ధమైపోతున్నారు. కొందరు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా తమ కుమారులను, కుమార్తెలను తమ వారసులుగా ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా తన కుమారుని సీఎంగా చూసుకోవాలన్న బలమైన కోరికతో ఉన్నారని తెలుస్తోంది. లోకేష్కు కూడా అటువంటి కోరిక బలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలవవలసి ఉంది. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతోపాటు, లోకేష్ ఎమ్మెల్యేగా గెలిస్తేనే వ్యూహం అమలు పరచడానికి అవకాశం ఉంటుంది. లోకేష్తోపాటు ఏపీ ప్రజల అదష్టం ఎలా ఉందో ఫలితాల వరకు వేచి చూడవలసిందే.
ఇక మరోపక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వరుసలోనే నిలబడ్డారు. అయితే ఆయన వారసునిగా వచ్చారేగానీ, సీఎంని చేయడానికి తండ్రి లేరు. ఆయన అర్ధాంతరంగా మరణించడంతో ముఖ్యమంత్రి కావడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. అప్పట్లో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత కొత్త పార్టీని పెట్టి అధికారం చేజిక్కించుకోవడానికి పట్టుదలతో కష్టపడుతున్నారు. గత ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఎలాగైనా గెలవాలని రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి కావాలన్న ప్రగాఢ వాంఛతో మొండి పట్టుదలతో ముందుకు పోతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు ఎవరిని గద్దెనెక్కిస్తాయో చెప్పడం కష్టం. చంద్రబాబు ఆశ ఫలిస్తుందో, జగన్ వాంఛ నెరవేరుతుందో మే 23 వరకు వేచి చూడవలసిందే.
- ఎస్.భరత్
సెల్ : 9493995880