Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలల బిడ్డను ఒడిలో పెట్టుకుని భర్త శవం ముందు రోదిస్తూ కూర్చున్న ఓ మహిళ... తన భర్త, ముగ్గురు కొడుకులు కోడళ్ల చావుకు మౌన సాక్షిగా నిలిచి, అనాథలుగా మారిన మనవళ్ల భవిష్యత్తు పట్ల అయోమయంలో కొట్టుమిట్టాడుతూ మూర్తీభవించిన విషాదమై శూన్యంలోకి బేల చూపులు చూస్తున్న ఓ నాయనమ్మ.... దిక్కు తోచని స్థితిలో భర్త శవం ముందు వెక్కి వెక్కి ఏడుస్తున్న కొత్తగా పెండ్లైన కడుపుతో ఉన్న ఓ యువతి... తండ్రి శవం ముందు అమాయకంగా నిల్చున్న నిస్సహాయులైన బడి ఈడు చిన్నారులు... ఇంటికి ఆధారమైనవాడు పంట చేతికి రాక ఉరేసుకుని చనిపోతే.. ఆ కొడుకు శవం మీద పడి హృదయవిదారకంగా విలపిస్తున్న తల్లిదండ్రులు... ఇప్పుడివి ఈ దేశంలో సర్వసాధారణమైన దృశ్యాలు... ముగింపులేని విషాదాలు....
మన పత్రికలు, ప్రసారమాధ్యమాలు ఈ రైతుల చావులను తమ తమ కోణాలలో నివేదిస్తున్నాయే తప్ప.. సమస్య మూలాలను, వాటి పరిష్కారాలను చర్చించడంలేదు. ఒకనాడు దేశానికే వెన్నెముకయిన తన పరిస్థితి ఎందుకిలా తలకిందులైందో తెలియక రైతు నేడు నిశ్చేష్టుడై నిల్చున్నాడు. వాతావరణం ఎప్పుడు ప్రతికూలంగా మారుతుందో తెలియదు. మార్కెట్లో ధరల ఎగుడు దిగుడులు ఎప్పుడెలా ముంచుతాయో తెలియదు. సరైన నీటి వసతి లేక, సకాలంలో వర్షాలు రాక కండ్లముందే కన్నబిడ్డలాంటి చేను ఎండిపోతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చివరికి బలవంతపు చావులకు బలైపోతున్నాడు. ఇందుకు ఎవరిది బాధ్యత? మన ప్రభుత్వానిది కాదా?
పంటకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? పంట నష్టానికి బీమా సదుపాయమైనా కల్పిస్తుందా? భూపరీక్షలు జరిపి ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పంటకు ఏ మోతాదులో పురుగు మందులు వాడాలి, భూగర్భజలాల పరిస్థితి ఏమిటి? అన్న విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు వివరించి, తగు సూచనలిచ్చేందుకు ఈ ప్రభుత్వం తన అధికారులను వ్యవసాయ క్షేత్రాలకు పంపిస్తున్నదా? సేద్యానికి కావాల్సిన చేయూత, నాణ్యమైన విద్యుత్తు, సాగునీటి వసతి అందిస్తున్నదా? విద్యా, ఉపాధి రంగాలలో రైతుల పిల్లలకు అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నదా..? ఇదంతా ప్రభుత్వ బాధ్యత కదా..! మరి ఇవేవీ చేయనప్పుడు రైతుల చావులకు ఎవరిది బాధ్యత?
మన ప్రభుత్వం క్రికెట్ స్టార్లకు, షటిల్ ప్లేయర్లకు అవసరానికి మించిన వసతులు కల్పిస్తోంది. అతి ఖరీదైన నజరానాలందిస్తోంది. హజ్ యాత్రలకు, దేవాలయాల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేస్తోంది. హైవేలు, స్కైవేల నిర్మాణానికి, తన ఆశ్రితులను ఆదుకోవడానికి మన ప్రభుత్వం వద్ద సమృద్ధిగా నిధులుంటాయి. కానీ రైతుకు సహాయం చేయడానికి, వ్యవసాయాన్ని ఆదుకోవడానికి మాత్రం నిధుల కొరత అడ్డుపడుతోంది. పైగా మన అధికార, ప్రతిపక్షా లన్నిటికీ రైతులంటే మహా ప్రేమ! అందుకే ''మీ హయాంలోనే రైతు అత్మహత్యలెక్కువంటే కాదు మీ హయాంలోనే ఎక్కువంటూ'' ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలతో అసెంబ్లీలో, పార్లమెంటులో తీరికలేనంత బిజీగా ఉంటారెప్పుడూ..!! ఇక రైతుల గోడు పట్టించుకునేదెవ్వరు?
మన ప్రజాప్రతినిధులు తమ వేతనాలను పెంచుకునేటప్పుడు, తమ రోజువారి భత్యాలు, కారు, డ్రైవర్ల అలవెన్సులు, ఉచిత ఫోను మరియు రవాణా అలవెన్సులు, వ్యక్తిగత రక్షణ సిబ్బంది అలవెన్సుల గురించి చర్చించుకునేటపుడు వాద ప్రతివాదనల సమస్యే ఉండదు! అది అసెంబ్లీ అయినా పార్లమెంటైనా సభ సజావుగా జరిగిపోతుంది!! కాని ప్రజలు, రైతుల సమస్యలు చర్చకొచ్చేటప్పటికి వారిలో ఆవేశకావేశాలు అమాంతం పెరిగిపోతాయి. కుర్చీలు, మైకులు విరిగిపోతాయి. ఎందుకంటే వారందరూ రైతు బాంధవులే మరి! అది నిరూపించుకోవడానికి ఇరుపక్షాలు ఎంతకైనా తెగిస్తాయి. ఇక వారిని శాంతింపచేయడంలో, వారు అలసిపోయినపుడు తేనేటి విరామాలు ప్రకటించడంలో, తిరిగి గొడవ పడటానికి షెడ్యూలు నిర్ణయించడంలో స్పీకర్ గారు తలమునకలై ఉంటారు. ఈ కమనీయ దృశ్యాలను కవర్ చేయడంలో పాత్రికేయ మిత్రులు అంతకంటే బిజీగా ఉంటారు. ఇలా ఎవరి పాత్రలు వారు సమర్ధవంతంగా నిర్వహించి చివరికి సంతృప్తిగా సభను ముగిస్తారు. ఈ మొత్తం ప్రహసనంలో ప్రజలకుగానీ రైతులకుగానీ ఒరిగేది శూన్యం!
మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కలగినా సహించరు. పే కమిషన్ సిఫారసులు అమలు జరుపకపోయినా, ఫిట్మెంట్ అలవెన్స్లు, ఫిక్సేషన్ ఆఫ్ పే అండ్ అలవెన్సుల్లో ఏ లోపాలు జరిగినా ప్రభుత్వంపై పోరాడి సాధించుకుంటారు. పాపం రైతులకివేవీ తెలియదు. వారికి తెలిసిందల్లా నేలకు నెత్తురు ధారపోయటమే.. రైతు కోసం వ్యవసాయశాఖ, దానిపైన రెవెన్యూశాఖ, అందులో రకరకాల విభాగాలు, వాటిలో అనేక శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు, వీటన్నిటి కోసం కోట్లాదిరూపాయల ప్రజాధనం మంచినీళ్లప్రాయంగా ఖర్చయిపోతూనే ఉంటాయి. కానీ రైతుకు ఎప్పుడు దున్నాలో, ఏం విత్తాలో, దానికి సరైన వాతావరణం ఉందోలేదో చెప్పే నాథుడే ఉండడు. కనీసం నీటికోసం బోర్ల మీద బోర్లు వేయించి అప్పుల పాలవుతున్నా చోద్యం చూస్తారే తప్ప.. ఎక్కడ నీరుందో, ఎక్కడ ఎంత లోతుకు బోరు వేయాలో చెప్పడానికి కూడా ఎవరూ అందుబాటులోకి రారు. పైగా రైతు ప్రభుత్వం నుండి ఏ సహాయం పొందాలన్నా తన సేద్యం ప్రతి దశలోనూ అధికారుల చేతులు తడపాల్సిందే..! అయినా సరే.. రైతుకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభిస్తాయన్న నమ్మకం లేదు. అయినా వాటికోసం ఇంటిల్లిపాదీ ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులుగాయక తప్పదు వారికి !
రైతుల పంటకు ధర పెరగకపొయినా వారి చావులకు మాత్రం ధర పెరుగుతోందీమధ్య. శవానికి రూ.5లక్షల నుంచి 6లక్షలదాకా చెల్లిస్తామని ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు...! మరి వారికి ఓట్లు కావాలి కదా..! ఈ పరిస్థితుల్లో తన కుటుంబానికి తను బతికితే ఉపయోగమా లేక చస్తే ఉపయోగమా అని ఆలోచిస్తున్నాడు రైతు. చివరికి తన కుటుంబాన్ని అప్పుల బారినుండి కాపాడుకోవడానికి తన మరణానికి లభించే పరిహారమే పరిష్కారమని భావించి చావుకు సిధ్ధపడుతున్నాడు. ఇప్పుడివి బలవంతపు చావులా? లేక స్వచ్ఛంద మరణాలా? వీటికి ఎవరిది బాధ్యత? మన ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు, న్యాయమూర్తులు ఎంతసేపటికీ వారివారి స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి అత్యంత యుక్తితో వ్యవహరిస్తారు తప్ప.. రైతుల పట్ల భక్తితోనూ, కనీస బాధ్యతతోనూ వ్యవహరించడంలేదు.
మరిప్పుడు రైతుకు చేయందించడానికీ, చేయూతని వ్వడానికీ ఎవరున్నారు. ఎవరి సమస్యలు వారే పరిష్కరించు కోవాలి. కాని వారు ఇప్పుడాస్థితిలో లేరు. కనుక రైతులంతా సమిష్టిగానే పరిష్కారమాలోచించుకోవాలి. సంఘటితంగానే దానిని సాధించుకోవాలి. కానీ వారికి ఆ చైతన్యాన్ని ఎవరివ్వాలి? ఆ బాధ్యత పౌరసమాజానికి లేదా? ఈ సమస్య కేవలం రైతులది మాత్రమేనా? లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కార్మికులు, విద్యార్థి, యువజన మేధావులైన ప్రజలందరమూ కలిసి సమస్యకు పరిష్కారం ఎందుకు వెతుకలేకపోతున్నాం...? కనీసం మనం ఓటును కూడా న్యాయంగా ఎందుకు వేయలేకపోతున్నాం? ఈ బూర్జువా రాజకీయపార్టీలు, వాటి నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలిసీ తిరిగి వారినే ఎందుకు ఎన్నుకుంటున్నాం? వాళ్లు మన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండరనీ, అసలు సమస్యలకు కారణమే వాళ్ళని ఎరుకలో ఉండి కూడా పదే పదే వారికే పాలనాధికారాన్ని ఎందుకు కట్టబెడుతున్నాం? పాపం రైతులు... మనకు అన్నదాతలు.... తమ సేద్యం ఈ సమాజ మనుగడకు కీలకమనీ, తప్పనిసరి అవసరమనీ మనల్ని ఒప్పించగలిగే స్థితిలో కూడా లేరు... కానీ మనం ఆలోచిద్దాం.. అసలు ఆహారమనేదే ఉత్పత్తి కాకపోతే ఈ సమాజం ఏమయిపోతుంది...?
- మండవ వెంకటేశ్వర్లు
సెల్ : 9849692330