Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓటు కలిగి ఉండటం ప్రతీ పౌరుడి అస్తిత్వానికి ప్రతీక లాంటింది. ఈ ఓటు ద్వారా ప్రస్తుత సమాజ స్థితిగతులను మార్చేందుకు వీలవుతుంది. ఒక సమాజం అభివద్ధి కావాలంటే ఆ సామాజిక వ్యవస్థకు మంచి ప్రజాప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజాప్రతినిధిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ సమాజంలో చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, ఓ రాజకీయ తంతుగా, అమ్ముకునే వస్తువుగానే భా విస్తున్నారా అనే సందేహం నేడు ఉత్పన్నమవుతున్నది. ఎందుకంటే నేడు కొందరు ఓటర్లు తమ ఓటును నోటుకు, మందుకు, తాత్కాలిక తాయిలాలకు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారే తప్ప దేశం, రాష్ట్రం, గ్రామం అభివద్ధి చెందాలనీ, సమాజం పురోగతి సాధించాలనీ, మనం బాగుపడాలనే తాపత్రయం ఏ ఒక్కరిలో కనిపించటంలేదు. కానీ అభివద్ధి కావాలన్నా, సరైన మార్గంలో పురోగతి సాధించాలన్నా ఓటు సక్రమ వినియోగం, సరైన నాయకుడిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అతి ముఖ్యమైనది. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి.
సమాజం గురించి అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపటం లేదు. అధిక శాతం ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం కాకుండా కేవలం సంపాదన, స్వార్థ ప్రయోజనాల కోసం కోసం రాజకీయాలను ఆశ్రయించడం వల్ల ప్రజాస్వామ్యం పట్ల గౌరవం తగ్గిపోతున్నదా అన్న సందేహం కలుగుతోంది. కానీ ఓటు హక్కును విధిగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రతి పౌరుడు తను స్వతహాగా ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవర్చుకోవలసి ఉంటుంది. డబ్బు, హోదా, వర్గం, వర్ణం, కులం, మతం, రంగు, లింగ, జాతీయతతో సంబంధం లేకుండా 18ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా కల్పించారు. ఈ విధంగా ఓటు హక్కు లభించడం అనేదే ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విజయం.మొట్టమొదటిసారి రాజ్యాంగ నియమాల ప్రకారం 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశంలో ప్రతిచోటా పండుగలా జరుపుకున్నారు. అయితే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. కానీ ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తి కాదు. అందరికీ ఓటు హక్కు కల్పించడం, వారు సక్రమంగా, ప్రశాంతంగా ఓటు వేయడానికి అనుకూల పరిస్థితులు అందుబాటులోకి తేవడం కీలకమైనది. ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలు సక్రమంగా జరగడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడటం, అప్పుడప్పుడూ అల్లర్లు జరిగినా ప్రశాంతంగా అభివద్ధి సాగడం ప్రజస్వామ్యం సాధించిన గెలుపుగానే చెప్పాలి. ఈ ప్రజాస్వామ్య గెలుపులో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. కాబట్టి మనకు ఏ ప్రభుత్వం ఉండాలో నిర్ణయించే అవకాశం ఓటింగ్ కల్పించింది. ఓటింగు ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తం చేయగలం. మనం మన చేతిలోని ఓటు అనే ఆయుధం ద్వారా మన దేశం భవిష్యత్తును నిర్ణయించగలం. ఈ వాస్తవాన్ని అందరూ తెలుసుకోవాలి. ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోవాలి.
- వాసిలి సురేష్
సెల్ : 9494615360