Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షేక్ బందగీ అనే పేరు విన్నా, చూసి నా దొరలకు బందూకును చూసినట్టే, ఎక్కడ భూమి గుంజుకుందామన్నా వారికి బందగీ యాదికొస్తడు. తెలంగాణ విప్లవ జ్యోతికి బందగీ ప్రాణ వాయువులూదాడు. బందగీ వేసిన దారి వేలాది ఎకరాల భూ పంపకానికి రహదారి అయ్యింది. చిందిన బందగీ రక్తం జ్వాలై లేచి జాగీరుదారులను ఊగించివేసింది. ఒక సామాన్య ముస్లిం యువకుడు బందగీ. అది జనగామా తాలుకా విసునూరు దొర ఇలాకా గ్రామం కామారెడ్డిగూడెం. గ్రామం ఇప్పుడు దేవరుప్పుల మండలం. తండ్రి మహ్మద్ ఖాసీమ్, తల్లి అమీర్ బీ. వాళ్లు ఐదుగురు అన్నదమ్ములు. పెద్దన్న అబ్బాసలీకి అప్పుడు 25 ఏండ్ల వయసు. బందగీకి తన సొంత గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉండేది. తన పాలివారు అయిన ఫకీర్ అహ్మద్ విస్నూర్ దేశ్ముఖ్ అనుచరుడూ కుట్రదారుడు. ఏ ఊర్లో పేదోళ్ల దగ్గర కండగల్ల భూమి ఉన్నా ఖతం చేయాలనేవాడు. దొరల కిరాతకత్వం వెయ్యిన్నొక్క రూపాలు ధరించిన రోజులవి. రాజరికాలను సజీవ స్తంభాలుగా నిలిపి పెట్టిన రోత రోజులు. అమలు జరిగేదంతా అక్రమమే, అధర్మమే, కసాయి స్వార్థమే. దారుణమైన వెట్టి చాకిరి, అంతకన్నా దారుణమైన అధికార్ల జులూం, నిత్యం తన్నులు, తిట్లు.. కచ్చేరి చావిళ్ల వద్ద వంగ బెట్టి వీపున బండలు పెట్టేవారు. పండిన పంటంతా లెవీలనీ తావానులనీ నాగూలనీ దోచు కునేవారు. బూడిద పట్టి, పెండ్లిపట్టి, సమర్త పట్టీల పేరుతో అడుగడుగునా దోపిడీ నిత్యకృత్యాలు ఇక్కడ.
1920 నుంచి 1941 వరకు బందగీ ఆకాలపు తెలంగాణ గ్రామ జీవితపు విషపు నీడలు చూసాడు. దొరల ఇండ్లలో పెండ్లి అయితే ఊరంతటికీ పెండ్లి పనే. బందగీ పాలోడు అబ్బాసు అలీకి దొర షాదీ పట్టి వసూలుకు అనుమతిచ్చాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అబ్బాసు.. బందగీ దగ్గర డబ్బుల్లేవంటే వాలింట్ల ఉన్న బర్రెలు, గొర్రెలు, జప్తు చేసి షాదీ పట్టి పూర్తి చేశాడు. ఈ అన్యాయానికి బందగీ ఎదురు తిరిగాడు. దొర ఇంట్లో పెండ్లి అయితే మా కొంప కూల్చడం దేనికని నిలదీశాడు. ప్రాణాలు పోయినా తన పశువుల్ని తోలుకపోనివ్వనని అడ్డుపడ్డాడు. ఇది బందగీ తొలి తిరుగుబాటు. దీనిని భరించలేని అబ్బాసు అలీ, ఆయన కుమారుడు ఫకీర్ అహమ్మద్ విసునూరు దేశ్ముఖ్కు బందగీ గురించి చాడీలు చెప్పిండ్రు. బందగీ జీవనాధారంగా వారసత్వంగా వచ్చిన 8 ఎకరాల వ్యవసాయ భూమిపై వారి దృష్టి పడింది. బందగీకి ఉన్న బలం, భూమి. ఈ భూమి కాజేయాలని పాలోళ్లు కుట్ర పన్నారు. దొర బీరువాలో ఉన్న తక్తా దస్తావేజులలో పేరు మార్చే సిండ్రు. బందగీకి భూమి లేదు. ఈ భూమి అబ్బాసు అలీదని చాటింపు చేసిండ్రు. ఖానూల్కు మా దగ్గర కాగితాలున్నాయి అన్నారు. తన భూమి తనకు రావాలని లేదంటే ఊరుకునేది లేదని బందగీ ఎదురు తిరిగాడు. గ్రామంలో పలుమార్లు పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. అబ్బాస్ అలీ, ఫకీర్ అమ్మద్లు సమస్యను మరింత జఠిలం చేశారు. తమ పంతం నెగ్గాలనీ బందగీ భూమి వ్యవహారం మీరే చూడాలని దేశ్ముఖ్కు మొరపెట్టుకున్నారు. తన అనుచరులు, తన చీకటి వ్యాపారం కావలికాళ్లు కావడంతో దేశ్ముఖ్ అండగా నిలిచాడు. భూమి ఎట్టి పరిస్థితుల్లో బందగీకి కాకుండా చూస్తానని భరోసా ఇచ్చాడు. దేశ్ముఖ్ నుండి బందగీకి బెదిరిపులు వచ్చాయి. భూమిని వదులుకోవాలని ఒత్తిడి పెంచారు. తనకు రావాల్సిన వాటా కోసం బందగీకి దేశ్ముఖ్ను ఎదిరించక తప్పలేదు. బెదిరింపుల నేపథ్యంలో బందగీ జనగామా కోర్టు లో సివిల్ దావా వేశాడు. దేశ్ముఖ్ మాటల్ని తిప్పి కొట్టాడు. భూమి కేసు తీర్పు త్వరలో వస్తుదని తెలియడంతో దేశ్ముఖ్ రాంచంద్రారెడ్డి తన గడీకి బందగీని పిలిపించి కేసును ఉపసంహరించు కోవాలని, లేకుంటే నీ గతి ఏమౌతుందో తేల్చుకోమ్మని హెచ్చరించాడు. ''ఈ కేసులో నీవు గెలిచినట్టయితే నేను చిప్ప పట్టుకొని ఫకీర్గా బిక్షం ఎత్తుకొని బతుకుతా. నాకొచ్చే అప్రతిష్ట ఏమీ లేదు. కానీ ఒకవేళ నేను గెలిస్తే అరవై గ్రామాలకు దొరవైన నీవు అప్రతిష్ట మూట గట్టుకుంటావు'' అని సూటిగా దేశ్ముఖ్ మొహం మీద గుద్దినట్టు చెప్పాడు బందగీ. దీంతో ఆందోళన చెందిన దేశ్ముఖ్ నా ప్రతిష్టకు సంబంధించిన సమస్య. తురుకోడు తురుంఖాన్ అవుతాడా? నేనే గెలువాలి అనుకున్నాడు దొర. దొంగ కాగితాలు సృష్టించి, దొంగ సాక్ష్యాలు తయారు చేసినా నిజం ముందు అబద్దం అపజయం పాలైంది. ఈ ఓటమిని ముందే గ్రహించిన దేశ్ముఖ్ రౌడీలు, గూండాలను పోగేసి చంపడానికి ప్రణాళిక తయారు చేశారు. అది 17 జులై 1941. దేశ్ముఖ్ న్యాయవాది సుల్తాన్ ఉద్దీన్ విసునూరు దొరకు కోర్టు తీర్పు గురించి ముందే చెప్పాడు. ఆ తీర్పు వెలువకడ ముందే బందగీని హతమార్చాలని కుట్ర పన్నారు. గూండాలు ఫకీర్ అమ్మద్తోపాటు మరో నలుగురు రౌడీలు కత్తులు, బాకులతో సిద్ధంగా ఉన్నారు. జులై 17న తీర్పు కోసం కోర్టుకు బయలుదేరాడు బందగీ. ఉదయం పూట కామారెడ్డిగూడెం స్టేజీ వద్దకు కాలినడకన వచ్చాడు. జనగామా- సూర్యాపేట ప్ర ధాన రహదారికి రెండు మైళ్ల దూరంలో కామారెడ్డి గూడెం ఉంది. పక్కనే జొన్న చేనులో దేశ్ముఖ్ గూండాలు కాపు కాసి ఉన్నారు. బందగీ నడుచుకుటూ స్టేజీ దగ్గరకు చేరుకోగానే మూకుమ్మడిగా కత్తులూ, గొడ్డండ్లతో ఒంటరిగా ఉన్న బందగీపై దాడి చేశారు. చెయ్యి విరిగినా, కాళ్లు విరిగినా చివరి క్షణం వరకు పెనుగులాడుతుండగా గొడ్డలితో తల పై వేటు వేయగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. జీవనాధారమైన భూమి కోసం, న్యాయం కోసం ఏ అండలేకుండా ప్రాణాలకు తెగించి రజాకార్ నాయకుడైన విసునూరు దేశ్ముఖ్పై కోర్టులో విజయం సాధించి వీరమరణం పొందాడు బందగీ. ప్రజల కండ్లెదుటే హంతకులు పారిపోయారు. బందగీ హత్యలో దేశ్ముఖ్ సూత్రదారి కాగా పాలివాడైన ఫకీర్ అమ్మద్ ప్రత్యేక్ష నిందితుడు. బందగీ హత్యను చూసిన వారు దేశ్ముఖ్కు బయపడి కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాలేదు. చుట్టుముట్టు గ్రామాలు దేవరుప్పుల, కడవెండి, పాలకుర్తి, ధర్మాపురం తండా తదితర గ్రామాల్లో నివురుగప్పిన నిప్పులా అగ్గి రాజుకుంది. భువనగిరి ఆంధ్ర మహాసభ పిలుపునందుకొని సంఘం పుట్టింది. బందగీ హత్యకు సాక్ష్యం లేనందున కేసు కొట్టివేయబడింది. భూ పంచాయితీలో బందగీ కోర్టులో గెలిచాడు. బందగీ అంటే భూమి.. భూమి అంటే బువ్వ. దున్నే వాడికి భూమి అనేది ఆంధ్ర మహాసభ నినాదమైంది. గ్రామ రక్షణ దళాలు, ఆత్మరక్షణ దశల నుండి ప్రతిఘటన స్థాయికి చేరి భూస్వాములకూ రైతాంగానికి మధ్యగల వైరుధ్యం తీవ్రతరమై సాయుధ సంఘర్షణ వరకు ఎదిగింది. ఆ పోరులో బందగీ స్ఫూర్తితో కామారెడ్డిగూడెంలోనే దొరలకు వ్య తిరేకంగా పోరాడి మరాటి మల్లయ్య, దుదిపాల పుల్లారెడ్డి అమరత్వం పొందారు. చివరికి ఎర్రజెండాల రెపరెపలతో నిజాం సంస్థానం కుప్పకూలింది. బందగీ మరణాన్ని ఆనాటి ప్రజా కవులు సుంకర వాసిరెడ్డి వంటి వారు అక్షరబద్దం చేశారు. వారి చారిత్రాత్మక నాటకం ''మా భూమి'' బందగీని స్మరిస్తూనే ప్రారం భమవుతుంది. అక్కడి ప్రజల్లో బందగీ ఒక వీరుడు, ఆ వీరుడికి సూర్యాపేట, జనగామా రహదారిపై నిర్మించిన సమాధి వద్ద ప్రతి జులై 17న ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ పోరాటాలకు ప్రాణ వాయువును అందించినవాడు బందగీ. అందుకే ఆయన అమరత్వం అరుణపతాకమై ఎగురుతోంది.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343