Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్భుతమైన గళం మూగబోయింది. 'అరుణోదయ' వ్యవస్థాపకుల్లో ఒకరై, సంఘం పేరే ఇంటి పేరుగా చెలామణీ అయిన కామ్రేడ్ అరుణోదయ రామారావు అకాల మరణ వార్త విప్లవకారులనూ, విప్లవ అభిమానులనూ, ప్రగతి శీల శక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 50 ఏండ్లుగా అవిశ్రాంతంగా పీడిత ప్రజల కోసం మాత్రమే మోగిన గళం ఆగిపోయింది. జనన, మరణాలు యాదృచ్చికమనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. అయినా మార్క్సిజాన్ని నిత్యం శ్వాసిస్తూ కారల్మార్క్స్ను అమితంగా ప్రేమించే రామారావు మార్క్స్ పుట్టిన రోజైన మే ఐదో తారీఖునే మరణించటం యాదృచ్చికాలలో ఒకటి.
నక్సల్బరీ నేపథ్యంలో కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలు భారతదేశంలో ప్రభంజనంగా వీస్తున్న రోజులలో రామారావు తన విప్లవ సాంస్కతిక, రాజకీయ జీవితం ప్రారంభించారు. ఇందిరాగాంధీ తన ప్రభుత్వ రక్షణ కోసం ఎమర్జెన్సీ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే 'అరుణోదయ'ను ఏర్పాటు చేశారు. దాని ప్రధాన నాయకత్వం కానూరు వెంకటేశ్వరరావు, రామారావు, నాగన్న. ఎమర్జెన్సీ సమయంలో కూడా రహస్యంగా చాలా కార్యక్రమాలు చేపట్టారు. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ తరువాత వెల్లువలా ముందుకు వచ్చిన విద్యార్థి ఉద్యమాల్లో రామారావు పాత్ర మరువలేనిది. ఆ సమయంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటానికి ఆయన పాట ప్రధాన పాత్ర పోషించింది. 'ఉయ్యాలో జంపాలా' అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో గళమెత్తినా, ' 'జజ్జనకరి జనారే' అంటూ గుంటూరు పీడీఎస్యూ మహాసభలో గజ్జ కట్టి ఆడినా ఆయన ఆటా పాట నుండి విద్యార్థి లోకం ఉత్తేజం పొంది ప్రతీపశక్తులు, ప్రగతి నిరోధక శక్తులను ప్రతిభావంతంగా ఎదుర్కొని ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించింది. ఉస్మానియా యూనివర్సిటీ అరుణ తారలైన జార్జిరెడ్డి, జంపాల ప్రసాదులు రగిలించిన విప్లవ జ్వాలలు ఆరిపోకుండా విద్యార్థులను తన పాట ద్వారా విప్లవ పథంలో నడిపించారు రామారావు. 'తూర్పు కొండలలోని అరుణ కాంతుల జ్వాలలనూ', వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం మొదలు పంచాది నిర్మల, తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రహి లాంటి ఎందరో మరెందరో శ్రీకాకుళ పోరాట యోధుల వీర గాథలను ఆంధ్రదేశమంతా గానం చేసిన ప్రజాగళం రామారావు. శ్రీకాకుళ సాయుధ పోరాటం గోదావరిలోయ ప్రాంతాలకు విస్తరించటానికి విప్లవకారులకు రామారావు పాట ఒక ఆయుధమైంది. దక్షిణ కోస్తా జిల్లాలో దళితులపై జరిగిన ఆధిపత్య కుల దురహంకారానికి, దాష్టీకానికి, దాడులకు వ్యతిరేకంగా ఆయన గళం పోరాటమైంది. 1974 నుండి 2000 సంవత్సరం వరకు కాశీపతి మాట అరుణోదయ రామారావు పాట ఆంధ్రప్రదేశ్లో వినని ఊరు లేరంటే అతిశయోక్తి కాదు. విప్లవకారులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరచాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమంలో కామ్రేడ్ అరుణోదయ రామారావు పాత్ర చిరస్మరణీయం. కర్నూలు జిల్లాకు చెందిన వాడైనా తెలంగాణ ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా బలపరిచాడు. బలపరచడమే కాకుండా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు ప్రీతిపాత్రుడైనాడు.
ప్రగతి నిరోధక శక్తులు బలపడి సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తూ పీడిత ప్రజలకు ఉన్న కొద్దిపాటి ప్ర జాస్వామ్య హక్కులను హరిస్తూ, సమాజాన్ని మైనారి టీ, మెజారిటీగా విభజన చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పీడిత ప్రజల పక్షాన నిలబడే గొంతుక మూగబోవ డం బాధాకరం. ఎమర్జెన్సీ సమయంలో కిరాతక వెంగళరావు పోలీసుల చేతిలో బూటకపు ఎదురు కాల్పుల్లో హత్యకు గురైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్ట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య అమరత్వాన్ని కీర్తిస్తూ 'అన్న అమరుడురా' అని గళమెత్తిన అరుణోదయ రామారావు అమరుడు, అమర గాయకుడు, ధన్యజీవి.
- ప్రతాపని రామకోటేశ్వరరావు