Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన నూతన పంచాయతీరాజ్ చట్టం- 2018 గ్రామాల రూపురేఖలను సమూలంగా మార్చే అవకాశముంది. తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీ అనే పదం 'పంచ', 'అయత్' అనే రెండు పదాల నుంచి ఉత్పన్నమైంది. పంచ అంటే ఐదు అని అయత్ అంటే అసెంబ్లీ అని పంచాయత్ అనే మాటకు ఐదుగురు వ్యక్తులతో కూడిన సమావేశం అని అర్థం. పూర్వ కాలంలో ఈ పంచాయతీలు అందరి మనోభావాలను ప్రతిబింబించక, తిరుగులేని అధికారాలు చెలాయిస్తూ నిరంకుశ పాలన సాగించేవి. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కో రకమైన కట్టుబాట్లు ఉండేవి. కానీ ఆధునిక కాలంలో పాలన వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైంది. రేపు భూగోళం బద్ధలవుతుందని తెలిసినా ఈ రోజు నేనొక మొక్క నాటుతాను అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులలో చెట్ల పెంపకానికి మించిన మంచి కార్యం మరొకటి లేదని తెలంగాణ ప్రభుత్వం గ్రహించి చెట్ల పెంపకాన్ని నిర్బంధ అంశంగా పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించింది. దీని ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా ఒక నర్సరీని ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు సంరక్షించాలి.
14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనుసరించి గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధులు గణనీయంగా పెరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.823 ఇవ్వాలి. దీనికి సమాన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ నిధులను ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయించాలి. ఇది ఏ మేరకు ఆచరణలో కనిపిస్తుందన్న దానిని బట్టి గ్రామాల అభివృద్ధి పట్ల మన ప్రభుత్వ చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు. ఇక నుండి వేయి జనాభాగల గ్రామానికి ఏడాదికి రూ.16 లక్షలు, ఐదు వేల జనాభా గల గ్రామానికి రూ.80 లక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల నుండి కలిపి అందించాలి. వీటితో గ్రామ పంచాయతీలు వసూలు చేసే ఇంటిపన్ను, నీటి పన్ను, లైబ్రరీ పన్ను వంటి అంతర్గత పన్నులు పైవాటికి అదనం. కొత్తగా ఏర్పడ్డ ఎంత చిన్న గ్రామ పంచాయతీకైనా ఏడాదికి కనీసం రూ.ఐదు లక్షలు అందాలి. ఇలా చట్ట ప్రకారం నిధుల విడుదల సక్రమంగా జరిగితే గ్రామ పంచాయతీలు మునుపెన్నడూ లేనివిధంగా ఆర్థికంగా బలోపేతమవుతాయి. సవ్యంగా, పారదర్శకంగా వినియోగిస్తే గ్రామాలు అనతికాలంలోనే అభివృద్ధి బాట పడతాయి. ఇదంతా ప్రభుత్వాల చిత్తశుద్ధి గ్రామ పంచాయతీల నిర్వాహణ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది.
గ్రామ సభలు కీలకం
గ్రామాల అభివృద్ధిలో గ్రామసభ సమావేశాలు కీలకమైనవి. గ్రామంలోని వయోజనులైన ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(ఎ) ప్రకారం గ్రామ సభ ఏర్పాటైంది. గతంలో ఏడాదికి కనీసం నాలుగు గ్రామ సభలు నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం సంవత్సరానికి ఆరు సమావేశాలు తప్పక నిర్వహించాలి. వాటిలో రెండు సమావేశాలు వికలాంగులు, మహిళల సమస్యల కోసం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశాలు నిర్వహించడంలో విఫలమైన సర్పంచ్, గ్రామ కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేస్తారు. కాబట్టి గ్రామసభ సమావేశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. సాధారణ ప్రజలు గ్రామసభ సమావేశాలలో పాల్గొనేందుకు విముఖత చూపుతున్నారన్న భావంతో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018లో కోరం నిబంధన విధించారు. అంటే గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా చట్టం నిర్దేశించిన సంఖ్యలో ప్రజలు గ్రామ సభకు హాజరు కాకుంటే గ్రామ సభ సమావేశాన్ని వాయిదా వేస్తారు. అంటే సమావేశం జరగనట్టే లెక్క. గ్రామ సభసమావేశం జరిగే తేదీని, సమయాన్ని, స్థలాన్ని, అంశాన్ని ముందే ప్రజలకు తెలియజేయాలని చట్టంలో పేర్కొనడం శుభపరిణామం. 500 లోపు ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీకి 50 మందిని, 10వేల ఓట్ల కంటే ఎక్కువ ఉన్న పంచాయతీకి 400మందిని కోరంగా నిర్ణయించారు. ఈ నిబంధన వల్ల గ్రామసభ నిర్ణయాలలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం పెరుగుతుంది. దీనివల్ల గ్రామాలలోని క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకొని వాటికి నివారణో పాయాలు కనుగొనవచ్చు. సమావేశ వివరాలను, తీర్మానాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచాలి. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు, మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపులోనూ, వాటి సామాజిక తనిఖీకి, కొత్త పన్నుల విధింపు, ఉన్న పన్నులను హేతుబద్దీకరించడం గ్రామ సంవత్సర బడ్జెట్ తయారీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామ సభే మంచి వేదిక. కాబట్టి చైతన్యవంతమైన ప్రజలు గ్రామ సభ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాలి. గ్రామ సభ ద్వారా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును, జవాబుదారీతనాన్ని ప్రశ్నించడం ద్వారా నియంత్రించవచ్చు. గ్రామ సభలో ఏదైనా అంశంపై విస్తృతంగా చర్చించిన తర్వాతే తీర్మానాలు చేయాలి. చర్చించే అంశాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే గ్రామ సభ సమావేశంలో ఉన్న వారితో ఓటింగ్ నిర్వహించి మెజారిటీ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామ సభ సమావేశంలో చేసిన ఒక్కొక్క తీర్మానం ఒక్కో చట్టంగా పరిగణించాలి. ఇంతటి ప్రాముఖం గల గ్రామసభ సమావేశాలను ఇంతకుముందు కోరం నిబంధన లేకపోవడంతో గ్రామాలలో పలుకుబడి గల వ్యక్తులు మినిట్స్ రిజిస్టర్లో తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వారికి అనుకూలమైన రీతిలో తీర్మానాలు చేసేవారు. పంచాయతీ చట్టలో తప్పనిసరి నిబంధనల వల్ల ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టి నట్టయింది. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 అత్యంత ప్రాముఖ్యం ఇచ్చింది. మన దేశంలో కాలుష్య తీవ్రత ఏటికేడు పెరుగుతుంది. రోడ్డుమీద చెత్తవేస్తే రూ.500 జరిమానా విధించాలని చట్టంలో నిర్దేశించా రు. ప్లాస్టిక్ను, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేసి తగులబెట్టరాదు. ఇంటి నుండే తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి వాటిని విద్యుత్ తయారీకి, కంపోస్ట్ ఎరువు తయారీకి వినియోగించాలి. దీనిని సాధించడానికి కావలసిన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు అందించాలి.మురికి కాలువలలో చెత్త పేరుకుపోవడం వల్ల పందులు, దోమలు, కుక్కలు గ్రామాలలో స్వైర విహారం చేస్తాయి. దీనివల్ల మలేరియా, టైఫాయిడ్, అతిసారం, మెదడువాపు వ్యాధులు వంటి అంటురోగాలు ప్రబలుతాయి. ఈ వ్యాధుల వల్ల దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో చిన్న పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు అనుమతిచ్చింది. కో ఆప్షన్ సభ్యులను నియమించుకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించడానికి గ్రామ పంచాయతీ రిజర్వేషన్స్ 10 సంవత్సరాలకు పెంచింది. అయితే చట్టం చేసినంత మాత్రాన సరిపోదు. దానిని అమలు చేసేవారు తమ బాధ్యతలు గుర్తెరిగి చిత్తశుద్ధితో పని చేసినప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజలు, ఉద్యోగులు చట్ట స్ఫూర్తిని అర్థం చేసుకొని త్రికరణశుద్ధిగా పని చేసి తద్వారా గ్రామ స్వరాజ్యం స్థాపించి సురాజ్యం దిశగా అడుగులు వేయాలని ఆశిద్ధాం.
- శాగ శ్రీనివాస్