Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజకీయ యవనిక మీద మరో ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ఆరో విడత కూడా పూర్తయింది. 130 కోట్ల భారత జనాభాలో 30 కోట్లమంది కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డ లేక ఏరోజుకారోజు రెక్కల కష్టంతో జీవితాలు వెల్లదీస్తున్నారు. నేటి ఆధునిక రోజుల్లో కూడా మనమంతా మనుషులం... అనే విధానాన్ని మరిచి కులాలు, మతాలు అనే వర్గాలుగా విభజింప బడుతుండటం చాలా బాధాకరం. ఇన్ని కులాలు, మతాలు, వీటి మధ్య సామాజిక, ఆర్థిక అసమానతలు, అణచివేతలకు అంతమెప్పుడు? మన దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 29 ప్రధాన పండుగలు, 16 ప్రధాన భాషలు, 15 లిఖిత భాషలు, 1600 చిన్న భాషలు, మాండలికాలు, 6400 కులాలు, ఉపకులాలు, 52 ప్రధాన గిరిజన తెగలు, 6 ప్రధాన మతాలు ఉన్నాయి.
రెండో ప్రపంచయుద్ధంలో అతలాకుతలమైన జపాన్, జర్మనీ వంటి దేశాలు ఫీనిక్ పక్షిలాగా వెంటనే విజృంభించి పది సంవత్సరాల వ్యవధిలోనే మిగతా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరాయి. రెండు దశాబ్దాల కిందట మన దేశంలాగే అధిక జనాభాతో కునారిల్లుతూ పేద దేశం కింద కొనసాగిన చైనా నేడు ప్రపంచమార్కెట్కు సవాల్గా మారింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. చైనా పాలకులలో పారదర్శకత, ప్రజలలో జవాబుదారీతనం ఉన్నందున నేడు ఆ దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మన దేశం వెనుకబడిన దేశం కింద గుర్తించబడింది. తరువాత అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోకి చేరింది. ఆపైన దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న స్థితిలోనే ఉంటూ అభివృద్ధి చెందిన వాటి సరసన చేరలేకపోవడం మన భారత రాజకీయాల దుస్థితికి, పాలకుల వైఫల్యానికి, ప్రజల చైతన్యరాహిత్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన, జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలిస్తే... రాజకీయ పార్టీలు, వాటి నాయకులతోపాటు ప్రజల్లోనూ కొన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి. పాలకుల వైఫల్యాలను ఎండగట్టి, వినాయకులుగా మారిన నాయకులకు నడ్డి విరిచి నిఖార్సయిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలే ప్రధాన వేదికలు. ఇందుకు ప్రజలు బాధ్యాతాయుతంగా వ్యవహరించి పారదర్శకంగా ఆలోచించి దూరదృష్టితో యోచించి చైతన్యపంథాలో ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించాలి. కానీ అన్ని రాజకీయ పార్టీలు డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న ప్రజలు రోజువారీ వేతనానికి, బిర్యానీలకు, బీర్లకు ఇతర మద్యపానీయాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఒకప్పుడు నాయకుల వెంట కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆయా రాజకీయ పార్టీల సిద్ధాంతాలకనుగుణంగా నిబద్ధతతో సైనికుల్లాగా నడిచి సేవాభావంతో ప్రచారం చేసేవారు. నేడు మెజార్టీ పార్టీలలో సిద్ధాంతాలు అడుగంటి ప్రలోభాలతో కూడిన రాద్ధాంతమే అడుగడుగునా కనిపిస్తున్నది. నేడు కమ్యూనిస్టులు మినహా ఏ పార్టీలో చూసినా.... కార్యోన్ముఖ కార్యకర్తలు కరువై... కిరాయి కూలీలే అసలైన సేవకులుగా అడుగడుగునా కనిపిస్తున్నారు.
స్వయం ప్రతిపత్తి గల భారత ఎన్నికల వ్యవస్థ స్వతంత్ర భారతంలో మొదటిసారి 1951-52 సంవత్సరంలో ప్రారంభించిన ఎన్నికల జాతర 1957, 1962, 1967 వరకూ కొంత పద్ధతిగానే కొనగింది. 1971లో జరిగిన ఎన్నికలలో భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడడంతో నాటి ప్రధాని మరోసారి అపరకాళిగా కీర్తించబడుతూ అఖండ విజయం సాధించారు. నాడు పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో మన దేశం సాధించిన విజయాన్ని ఇందిరాగాంధీ ప్రత్యేక కోణంలో చూపించి రాజకీయంగా విజయం సాధించారు. ఇలాగే అప్పట్లోనే ఆమె తీసుకొచ్చిన 'గరీబీ హటావో' నినాదం, బ్యాంకుల జాతీయీకరణ వంటి అంశాలు కూడా ఆమె విజయానికి ప్రధాన కారణాలుగా మారాయి. తరువాత ఆమె పూర్తిగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ పోవడం, రాజరికపు స్థాయిని మించిన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించడానికి తీసుకొచ్చిన ఎమర్జెన్సీ వంటి అప్రజాస్వామిక పద్ధతుల మూలంగా 1977లో మట్టికరిచారు. మొదటిసారి ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కీచులాటలతో రెండున్నర సంవత్సరాలకే కూలిపోయి నాటి ప్రధాని మొరార్జీ దేశారు రాజీనామా చేయడం, 6 నెలలు పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే చరణ్సింగ్ ప్రధానిగా కొనసాగిన అనిశ్చిత రాజకీయ పరిస్థితులు ఏర్పడడంతో 1980లో మధ్యంతర పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలలో మళ్లీ ఇందిరాగాంధీ ఇందిరా కాంగ్రెస్ తరపున విజయబావుటా ఎగురవేశారు. అయితే... ఈ ఎన్నికలలో జనతాపార్టీ నుంచి వేరుపడి పాత జనసంఫ్ు పార్టీ భారతీయ జనతా పార్టీగా పురుడుపోసు కుంది. ఆనాడు చిన్న పాయగా ఏర్పడిన బీజేపీ నేడు అధికార పార్టీగా అవతరించింది. వామప క్షం బలహీనపడ్డాక జాతీయ స్థాయిలో ఇందిరా కాంగ్రెస్, బీజేపీలే ప్రధాన ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. అనేక రాష్ట్రాలలో కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా నాటుకు పోయినప్పటికీ ఢిల్లీ పీఠానికి వచ్చే సరికి పై రెండింటిలో ఏదో ఒక పార్టీ కూటమిలో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రస్తుతం ప్రజలు ఆశించినట్టుగా మోడీ పాలన సాగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలా వరకు వాస్తవం కూడా.... కొన్ని విషయాలలో నాటి ఇందిరాగాంధీని మించిన నియంత తరహాలో మోడీ వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది.
అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇతర ప్రాంతీయ పార్టీలైనా ప్రధానంగా ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, భావోద్వేగాలకు లోను చేసి భ్రమల్లో ముంచెత్తడం, తాత్కాలిక ఆకర్షలు చూపి వారిని ఏమార్చడమే ఎన్నికల తంతుగా మార్చేశాయి. ఈ విద్యలో ఆయా రాజకీయ పార్టీలు ప్రదర్శించే మాయోపాయాలే ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇది మన ప్రజాస్వామ్యానికీ, ప్రజాభ్యుద యానికీ చేటు తెస్తుందని ప్రజలు గుర్తించకపోతే దేశం మరింత అధోగతిపాలవుతుంది. విజ్ఞులైన ప్రజలు ఈ సారైనా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, డబ్బులకు అతీతంగా తీర్పునివ్వాలి. నవభారతం రావాలనీ, పేదరిక నిర్మూలన జరుగాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ఓటు విలువను గుర్తించేలా ప్రజల్లో చైతన్యం పెరగాలి.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు
సెల్ : 99898 18212