Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేసే స్వచ్ఛమైన నేర చరిత్ర లేని నాయకులు ఎన్నికలలో పోటీ చేయడం, గెలుపొందడం వల్ల ప్రజలు కలలుకన్న సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. కానీ నేడు ఎన్నికల ప్రక్రియపై డబ్బు, నేరగాళ్లు తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నారు. నేరగాళ్లు ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వారి ప్రభావం ఎన్నికలకే పరిమితం కావటం లేదు. పాలనపైనా ఉంటోంది. ఈ సత్యాన్ని ప్రజలంతా గ్రహించాల్సి ఉంది. నేడు రాజకీయాలలో, ఎన్నికల్లో డబ్బు, నేరగాళ్ల ప్రభావం పెరగడం వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థ విపరీత పరిణామాలకు లోనవుతోంది. ప్రజాప్రతినిధులు పేదలకోసం, దేశాభివృద్ధి కోసం పనిచేయాలన్న సిద్ధాంతాలకు దూరమైపోయారు. నిబద్ధతతో ప్రజాసేవ చేయాలనుకునే సామాన్యులకు రాజకీయాల్లో ప్రవేశమే లేకుండాపోయింది. రాజ్యాంగం ప్రజలందరికీ రాజకీయ న్యాయాన్ని ప్రసాదించింది. అయితే అలాంటి రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశించడంతో, చేరటంతో ప్రజలకు రాజకీయ న్యాయమే కాదు, ఏవిధమైన సాంఘిక, ఆర్థిక న్యాయం కూడా జరగటం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మన దేశ రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నేరచరిత్రను దాచిపెట్టేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఎలక్షన్ కమిషన్కు ఇచ్చే ముందే పార్టీలు వారి అభ్యర్థుల చరిత్రలను తప్పకుండా పరిశీలించి, మంచి అభ్యర్థులకే టికెట్లు కేటాయించి పోటీకి దింపాలి. నేరస్తులను, నేరచరిత్ర గల వారిని ఏమాత్రం ప్రొత్సహించకూడదు.
నేషనల్ ఎలక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 16వ లోక్సభలోని కేంద్ర క్యాబినెట్ మంత్రులలో 20 మంది అనగా 31 శాతానికిపైగా క్రిమినల్ కేసులు, 11 మంది అనగా 17 శాతం మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగాగల ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య 4835. అయితే అందులోని 31శాతం మంది అంటే 1448మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నాయని ఓ స్వచ్ఛంద సంస్థ లెక్కగట్టింది. వారిలో 41మందిపైన హత్య, లైంగికదాడులు, దొంగతనాలు, అపహరణలు లాంటి హేయమైన నేరాలు సైతం పోగుపడి ఉన్నాయని ఆ సంస్థ తెలుపుతోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 ప్రకారం ఒక వ్యక్తి రెండు సంవత్సరాలు గానీ అంతకుపైన గానీ శిక్ష అనుభవిస్తే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. అయితే కేసు విచారణలో ఉన్నప్పుడు మాత్రం అనర్హులు కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8(4) విభాగం ప్రకారం శిక్షపడిన లోక్సభ, శాసనసభ సభ్యులు దాన్ని పైన్యాయస్థానాల్లో సవాలు చేసిన పక్షంలో తమ పదవుల్లో నిక్షేపంగా కొనసాగగల వీలుంది. మనదేశంలో 2004 నుంచి 2013వరకు జరిగిన సార్వత్రిక, ఉపఎన్నికల్లో అభ్యర్థులకు సంబందించిన గణాంకాలను పరిశీలిస్తే ఆందోళనకర పరిస్థితిని కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో పోటీచేసిన 62,847 మందిలో 18శాతం మంది, అనగా 11,030 మందిపై 27,027 పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎనిమిది శాతం అభ్యర్థులు అంటే 5,253 మందిపై హత్య, లైంగికదాడి, అవినీతి, దోపిడీ, దొంగతనం వంటి తీవ్ర నేరాలకు సంబంధించి 13,984 క్రిమినల్ కేసులున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన 8,230మంది అభ్యర్థుల్లో 8,163 మంది సమాచారాన్ని పరిశీలించినప్పుడు, 17 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, 11శాతంపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వివిధ రాజకీయ పార్టీల తరపున పోటిచేసిన 2,240 మందిలో 1,309 మంది సమర్పించిన ప్రమాణపత్రాలు (అఫిడవిట్లు) గమనిస్తే 21శాతం మందిపై క్రిమినల్ కేసులు, 11శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ శాసనసభకు పోటిచేసిన 1,669మందిలో 1,000 మంది వెల్లడించిన సమాచారం ప్రకారం 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 14 శాతం మందిపై తీవ్రమైన కేసులున్నట్టు తేలింది. మొత్తంగా 2003-14 వరకు పోటీచేసిన ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం లోక్సభ, శాసనసభ ఎన్నికలకే పరిమితం కావటం లేదు, స్థానిక సంస్థలైన గ్రామ సర్పంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన తంతు కొనసాగుతోంది. నేరచరిత గల ప్రజాప్రతినిధులు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలలో సైతం ఉంటున్నారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్దగానీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గానీ లేవు. ఎంతమంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపైన క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయన్న సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు. వీటి కోసం పూర్తిగా ప్రభుత్వేతర సంస్థలైన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం, ఎలక్షన్ వాచ్ వంటి వాటిపై ఆధారపడవలసి వస్తోంది. నేడు చాలా వరకు రాజకీయ పక్షాలు నేరస్తులను నియంత్రణ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాయి. కావున ఆ బాధ్యత ప్రజలే తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికలలో నేరచరిత్ర లేని ప్రజాప్రతినిధులను ఎన్నిక చేసుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి.
- వాసిలి సురేష్
సెల్ : 9494615360