Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిలాబాద్ జిల్లాకు రెండు సరస్సులు. ఒకటి బాసర అయితే మరొకటి భావ సరస్వతి సామల. సామల సదాశివ పేరు వినగానే అదిలాబాద్ అడవి బిడ్డలు ''మా మాస్టర్'' అంటారు. ఏ భాషలో ఎవరికి ఉత్తరం వచ్చినా పరుగున పంతులు గారి దగ్గరకు వచ్చి చదివించుకుంటారు. ఖానూన్ కాగితాలైనా, కోర్టు నోటిసులైన ఆయన నోట పలికితే బాసర చదువులమ్మ స్వయాన వచ్చి సంభాషించినట్టుగా ఉంటుందని వారి నమ్మకం. ఆయన ఏడు భాషల్లో ఆరితేరిన సాహిత్య సవ్యసాచి. అయినా అతి నిరాడంబరమైన జీవిత శైలి. మహోపాధ్యాయుల బోధనల నుండి నేర్చుకోవడానికి కృషి చేసిన నిరంతర విద్యార్థి. సమస్యను గానీ, సాహిత్యాన్ని గానీ విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం, నమ్మిన దానిపై గట్టిగా నిలబడటం ఆయన తరీఖా... మనిషి చనిపోవడం, బతికి ఉండటం సమస్యే కాదు! నిజంలా... ఉద్యమంలా ఎందరు బతుకుతున్నారన్నదే నేడు అసలు సమస్య అని చెప్పిన కలం యోధుడతడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత. 'తెలంగాణ' అంటే ఒక పోరాటం. ఇక్కడి ప్రజలు పోరాటాల సంకేతం అని చాటిచెప్పిన సాహిత్య దృవతార. భాష ఏదైనా భావవ్యక్తీకరణే పరమావధిగా బహు భాషా పరిమళాలను వెదజల్లిన వారు సామల సదాశివ మాస్టర్. ఆదిలాబాద్ అడవి బిడ్డల జిల్లా. నైజాం సర్కార్ను మట్టి కరిపించిన కొమ్రంభీం పోరు. కేంద్రం దహేగావ్ మండలం తెలుగు పల్లెలో 1928 మే 11న నాగయ్య, చిన్నమ్మ దంపతులకు జన్మించాడు సదాశివ. చేనేత కార్మిక కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే మంచి ప్రతిభ కనబరిచిన సదాశివ అసిఫాబాద్, కాగజ్నగర్, వరంగల్లో చదువుకున్నారు. ఎంఏ, బి.ఇడ్, డి.లిట్ పూర్తి చేసిన సదాశివ 1954లో టీచర్గా జీవితం ప్రారంభించారు. ఆసిఫాబాద్, వాంకిడి, సిరిపూర్లలో పని చేసిన మాస్టర్ భద్రాచలంలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు.
చిన్ననాటి నుండే రచనా ప్రస్థానం సాగించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న సదాశివకు తెలుగుతోపాటు సంస్కృతం, మరాఠీ, పార్సీ, హిందీ, ఇంగ్లీషు భాషలపై మంచి పట్టు ఉంది. ప్రభాతం, నిరీక్షణం, మంచి మాటలు, ఆర్తీ సాంబశివ శతకం లాంటి అపూర్వ పద్య సాహిత్యాన్ని సృష్టించాడు. అవన్నీ భారతి పత్రికలో ప్రచురితమయ్యాయి. దీంతో దేలూరి శివరాం శాస్త్రీ, కప్పగుంతల లక్ష్మణశాస్త్రీలతో సహా అనేక ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. మొదట్లో పద్య కవిత్వం రాసారు. ''తెలుగులో కవిత్వాలు, పద్యాలు రాసేవారు చాలామంది ఉన్నారు. నువ్వొక ప్రత్యేకత. మరాఠీ, పార్సీ, హిందీ, ఇంగ్లీషు సాహిత్యాలు తెలిసినవాడివి నువ్వు. కనుక తెలుగు సాహిత్యానికి వాటిని పరిచయం చేయమన్న సురవరం ప్రతాపరెడ్డి సూచనతో సదాశివ కలం విదిల్చారు. ఏడు భాషలపై తనకున్న పట్టుతో వచన రచన అనువాద ప్రక్రియలెన్నో చేశారు. అనేక మంది తెలుగు కవులను ఉర్దూ వారికి, ఉర్దూ సాహిత్య చరిత్రను తెలుగు లోకానికి పరిచయం చేశారు. ఇందుకోసం దాదాపు 300 వ్యాసాలను ఉర్దూలోనూ 450 వ్యాసాలను తెలుగులోనూ రాశారు. సియాసత్ పత్రికలో రాసిన వ్యాసాలతో ఉర్దూలో గొప్ప కవిగా ఉన్న కాళోజీ రామేశ్వర్రావును లోకానికి పరిచయం చేశారు. అంతేకాదు తెలంగాణ మేధావి జయశంకర్ సార్కు ఉర్దూ భాషపై ఉన్న పట్టును తరుచుగా తన వ్యాసాలతో పరిచయం చేశాడు. జయశంకర్ సార్కు ఉర్దూలో ఏ అనుమానమున్నా సదాశివ గారిని వివరణ అడిగేవాడు. సునాయసంగా, వివరణాత్మకంగా ఆయన వివరించేవారు.
సామల సదాశివ పేరు వినగానే మనకు మలయమారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు గుర్తుకొస్తాయి. ఇంకా అమ్జద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చర్చ మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామాగ్రి, మిర్జాగాలిబ్ పుస్తకాలు కూడా గుర్తుకొస్తాయి. ఎన్నో కొత్త విషయాలు గోచరిస్తాయి. అమూలాగ్రం చదివిస్తాయి. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేట్టు చెప్పడం అతనికున్న ప్రత్యేకత. అతని భాష, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దల్ కరీంఖాన్ హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియాఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్, అంజద్ అలీఖాన్ ఇలా ఎందరో సంగీత విధ్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరిస్తారు. హిందుస్తానీ రాగాల్ని, రేడియోలోనో, క్యాసెట్ల రూపంలోనో ఇంటర్నెట్లోనో వినకుండా ఉండలేనంతగా మనకు హిందుస్తానీ సంగీతం పట్ల అభిరుచిని కలిగిస్తారు. తెలుగు వారికి ఉర్దూ భాష మాధుర్యాన్ని రుచిచూపిన అగ్రగణ్యులు. సాహిత్య కృషితోపాటు పెద్దవారితో పిన్నవారితో వారేర్పర్చుకున్న సన్నిహిత ప్రేమానురాగాలు కూడా ఉదాత్తమైనవి. సూఫీయిజాన్ని అరటి పండు ఒలిచినట్టు చెప్పేవారు. ఇంకో విచిత్రమైన విషయమేమంటే ఆయన మంచి చిత్రకారుడు కూడా. నాటకాలకు అవసరమయ్యే పరదాలను చిత్రించడం, తమ కవితలకు తగిన బొమ్మలు గీయడం, ముఖాకృతుల చిత్రాలు వేయడం చేస్తుండేవారు. ప్రసిద్ధ చిత్రకారులు కాపు రాజయ్య తన తొలి దశలో సారు దగ్గర చత్రకళలో మెళకువలు నేర్చుకున్నారట. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఆయనకు అన్ని వర్ణాల వారితోనూ, అన్ని వాదాల వారితోనూ అన్ని ప్రాంతాల వారితోనూ సత్సంబంధాలుండేవి. ఆకాశవాణిలో ఆయన చేసిన ప్రసంగాలు ఎందరో రసజ్ఞులైన శ్రోతలనలరించాయి. తొణుకుబెణుకు లేని ఆయన కంఠస్వరం సహజ సుందరశైలిలో సాగేది. తెలంగాణ ఆత్మాభిమానం, స్వయం కృషి, సృజనాత్మకత వీటన్నింటినీ కలిపి ముద్ద చేసి దానికి ఒక ఆకారమిస్తే తయారయ్యే మూర్తి సామల సదాశివ. రచన ఆయన వృత్తి, ప్రవృత్తి కాదు.. జీవితం. గాలి పీల్చడం, ఆహారం తినడం ప్రాణికి ఎంత సహజమో రాయడం, చదవడం కూడా ఆయనకు అంతే సహజం. ఏనాడు అవార్డులకు ఆశపడలేదు కానీ అవన్నీ అతన్నే వరించి వచ్చాయి. మాటలకందని మహానీయుడు, తెలంగాణ వైతాళికులలో ఒకరైన డా|| సామల సదాశివ మాస్టర్ 2012 ఆగస్టు 7న మరణించాడు. ఆయన యాది మనకు మిగిల్చిపోయాడు.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343