Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్లూ... సృష్టికే అందాలు తెచ్చినారు అన్నాడో కవి. ఇక్కడ శిల్పుల గొప్పతనాన్ని చెప్పడంతోపాటు రాయి గొప్పతనం కూడా ఇమిడి ఉన్నదనేది సత్యం. చరిత్రలో రాయికి గొప్ప చరిత్రే ఉన్నది. చరిత్రకు రాళ్లు ఆనవాళ్లుగా నిలిచాయి. అటువంటి రాయి ఇండ్ల కట్టడాలలో, భవనాల కట్టడాలలోనూ, రోడ్ల నిర్మాణంలోనూ ఒక్కటేంటీ...? అనేక రకాలుగా ఉపయోగపడు తున్నాయి. అలాంటిది అయ్యో రాయినా అని ఇవాళ బాధపడుతున్నది. మీడియాలో కథనాలు ప్రసారం చేసి తనకు లేని అపవాదును అంటగడుతున్నాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల 'రాయి' పట్ల ప్రవర్తించిన తీరు అసహ్యంగా ఉన్నది. తన పాపులారిటీ కోసం తనను పావుగా వాడుకున్నారని ఆవేదన చెందుతున్నది. చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని పరాభవాన్ని ఎదుర్కొంటున్నట్టు ఫీలవుతున్నాయి. తనను రాయితో పోలీసులు కొట్టారని చిలుకపలుకులు పలికారు. దీంతో మీడియాతో రాజాసింగ్ను రాయితో కొట్టారని స్క్రోలింగులు వచ్చాయి. తనను తానే కొట్టుకుని పోలీసులు కొట్టినట్టు బదనాం చేసిండు. తన నెత్తిపై రక్తం చిందేలా బండరాయితో కొట్టుకుని, ఆ ప్రచారంతో సానుభూతి పొందాలని పన్నాగం పన్నారు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నాను.. అని రాయి బాధ పడింది. ఈ విధంగా తనను వాడుకున్న మొదటి వ్యక్తే రాజాసింగ్ అని వాపోయింది. ఇలాంటి నేతలు నలుగురు ఉంటే చాలు తనను బదనాం చేయడానికి అని రాయి తన ఆవేదన వ్యక్తం చేసింది.
- గుడిగ రఘు