Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముప్పవరపు వెంకయ్యనాయుడు... తెల్లని పంచ కట్టుతో తళతళ మెరిసిపోయే ఈ పెద్దాయన మనకు ఉప రాష్ట్రపతి. అంతే కాదండోరు.. రాజ్యసభకు చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు కాస్త పక్కకుపెట్టి రీల్ను కొంచెం వెనక్కు తిప్పితే నాయుడుగారి మాటలు మనకు నీటి మూటల్లాగా అగుపడతాయి. పార్టీల ఫిరాయింపులకు సంబంధించి రెండు, మూడేండ్ల క్రితం వెంకయ్య తీవ్ర ఆవేదన, అంతకు మించిన ఆందోళనా వ్యక్తం చేశారు. జంప్ జిలానీల వల్ల రాజకీయాలకు ఉన్న విలువలు వలువల్లా ఊడిపోతున్నాయంటూ తెగ ఇదై పోయారు. అసలు ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీలో చేరటమేంటంటూ సీరియస్ అయిపోయారు. అలా పార్టీ మారిన వారిపై కఠిన శిక్షలు తీసుకోవాలంటూ హితోపదేశం చేశారు. పార్టీ మారినరోజే వారిపై అనర్హత వేటేసి.. చట్ట సభల నుంచి బయటకు పంపాలంటూ స్పీకర్లకు, డిప్యూటీ స్పీకర్లకు సూచించారు. ఇదంతా గతం. ఇప్పుడు మనం ఆయన రీల్ను ముందుకు తిప్పి చూసుకుంటే.. అవాక్కపోవటం ఖాయం. ఎందుకంటే రెండు రోజుల క్రితం టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు... పసుపు కండువా బాగాలేదని బాధపడుతూ కాషాయ కండువా కప్పుకుని కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఇలా కండువా కప్పుకున్నారో లేదో.. వారందరూ బీజేపీ సభ్యులేనంటూ అలా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ గమ్మత్తేమంటే... ఆ రోజు ఫిరాయింపుల గురించి చిలుక పలుకులు పలికిన వెంకయ్యే, ఈ రోజు రాజ్యసభ చైర్మెన్ హోదాలో వారికి క్లీన్ చిట్ ఇచ్చి.. బీజేపీ సభ్యులంటూ ధృవీకరణ పత్రం ఇచ్చారు. అంటే అప్పట్లో మంది పార్టీల మీద రాళ్లేయటానికి పనికొచ్చిన ఆయన నాలుక.. ఇప్పుడు సొంత పార్టీ దగ్గరకొచ్చేసరికి మడత పడిందన్నమాట.
- బి.వి.యన్.పద్మరాజు