Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు బెల్లం చుట్టూ ఈగలు మూగిన చందాన అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు పూర్తయి నెల కాకుండానే స్వపక్షాన్ని వదిలి పదవులు ఆశిస్తూ అధికార పార్టీలోకి నిస్సిగ్గుగా దూకేస్తున్నారు. అధికార పక్షం అభివృద్ధి ఎజెండాకు ఆకర్షితులై పార్టీ మారుతున్నామని చేస్తున్న ప్రకటనలు నమ్మ శక్యంగా లేవు. వచ్చే ఐదేండ్లు విపక్షంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేకంటే అధికార పక్షంలోకి ఫిరాయిస్తే ఏదో ఒక పదవో, పనో దొరక్కపోతుందా అన్న ఆశతోనే ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నది విస్పష్టం. ఇక ఎన్నికల సమయంలో నైతిక రాజకీయాలు అని ఘనమైన ప్రకటనలు ఇచ్చే కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాక, ఆ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ఆపరేషన్ ఆకర్ష్ వంటి పేర్లతో విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పెద్ద ఎత్తున కొనుగోలు చెయ్యడం, అసలు రాష్ట్రంలో విపక్షమే లేకుండా చెయ్యడం వంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నాయి. చట్ట సభలలో ప్రశ్నించే గొంతు లేకుండా చెయ్యడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. ఇక పాలకుల అధికార దుర్వినియోగానికి అద్దు ఆదుపు ఉండదు. ప్రశ్నించే వారు లేకపోవడం వలన నిరంకుశత్వం పెరుగుతుంది. ఫిరాయింపులను నిరోధించే చట్టం కాలం చెల్లినదై ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులను ఏ మాత్రం నిరోధించలేకపోతుం డడం ఒక ఎత్తైతే, ఈ చట్టానికి తక్షణం సవరణలు చేపట్టాలన్న 2006 నాటి సుప్రీం కోర్టు ఆదేశాలు బుట్ట దాఖలు కావడం దేశ ప్రజల దౌర్భాగ్యం.
- సి.సాయి ప్రతాప్
సెల్ : 9136827102