Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫేక్ న్యూస్ అంటే ఏంటి? ఫేక్ న్యూస్ వల్ల జరిగే నష్టాలు ఏంటి? ఇవి తెలుసుకునే ముందు పుకారు గురించి తెలుసుకుందాం. పుకారు అంటే లేని దానిని ఉన్నట్టు ప్రచారం చేయడం. ఏదైనా జాతరలు లేదా పెద్ద సంఖ్యలో జనం ఒకచోట చేరినప్పుడు పుకార్లు చేయడం వల్ల కొన్ని వందలమంది చనిపోయిన సందర్భాలు ఎన్నో చూశాం. అలాగే వింత వింత ప్రచారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక కొడుకే ఉంటే టెంకాయ కొట్టాలనీ ఈరోజు రాత్రి భూకంపం వస్తుంది అందరూ మేల్కొని ఉండాలనీ ఏదో గ్రహం భూమిని గుద్దు కుంటుందనీ, మధ్యరాత్రి ఏదో గ్రహం భూమికి దగ్గరగా రావడం వల్ల మొబైల్స్ పగిలి పోతాయని ఇలా ఎన్నో పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. ఆ పుకార్లకు ఆధునిక పేరే ఫేక్ న్యూస్. అవే నేడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి న్యూస్ అసలు ఎవరు రాస్తున్నారు? రాయడం వల్ల వారికి ఉపయోగం ఏమిటి? అసలు ఫేక్ న్యూస్ని ఎలా కనుగొనాలి? ఫేక్ న్యూస్ రాస్తే వారికి చట్టపరమైన శిక్షలు ఉన్నాయా? ఇలా సవాలక్ష ప్రశ్నలు మన బుర్రల్లో మెదులుతూ ఉంటాయి. కానీ సమాధానాలు చాలా మందికి తెలియవు. అది సత్యమో, అసత్యమో తెలియకుండా షేర్ చేసిన వారు కూడా శిక్షకు అర్హులే అవుతారు. అందుకే వచ్చిన ప్రతి న్యూస్ని షేర్ చేయకూడదు. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా ఫేక్ న్యూస్పై స్పందించినా యాంటీ ఫేక్ న్యూస్ యాక్ట్ని మరింత త్వరగా అమలు చేసి శిక్షలు వేస్తే తప్ప దీనిని నివారించడం కష్టం.
ఫేక్ న్యూస్ అంటే ఒక అసత్యవార్తను రాసి ప్రచారం చేయడం. అది నేడు అందుబాటులోకొచ్చిన వివిధ రకాల సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా జరుగుతోంది. దీనినే యెల్లో జర్నలిజం అంటారు. ముఖ్యంగా ఇలాంటి అసత్యవార్తలు చాలా రకాలు. వ్యక్తులపై, సంస్థలపై, పొలిటికల్ పార్టీలపై, పబ్లిక్ ప్రొఫైల్స్పై ఉంటాయి. ఫేక్ న్యూస్ ద్వారా సోషల్ మీడియాలో లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. మొత్తం మీద డబ్బు, ద్వేషం, ఇంకొకరికి చెడు చేయడం ద్వారానే ఈ ఫేక్ న్యూస్ పరిధి పెంచుకుంటుంది. ఉదాహరణకు చిరంజీవి అంటే అమితమైన ఇష్టం. ఆయన కేరళ వరద బాధితులకు వందకోట్లు ఇచ్చారని ఒక పోస్ట్ను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తే చిరంజీవిని ఇష్టపడే వారు అది సత్యమో, అసత్యమో ఆలోచించకుండా షేర్ చేస్తారు. ఇది కూడా ఫేక్ న్యూస్ లాంటిదే కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉండదు. కానీ నిజానిజాలు తెలియకుండా ఏది షేర్ చే యకూడదు. నిజంగా చిరంజీవి అలా డబ్బు సహాయం చేస్తే లైవ్ మీడియా దానిని ఖచ్చితంగా కవర్ చేస్తుంది. ఏదైనా పక్కవాడికి ఉపయోగం అనుకుంటేనే షేర్ చేయాలి.
ఫేక్ న్యూస్ని చాలా వెబ్ సైట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఫేక్ న్యూస్ రాసి వారి వెబ్సైట్ని సందర్శించే సంఖ్యను పెంచుకుంటూ ఉంటారు. ఇది వారు ఆర్థికంగా బలపడేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని వెబ్సైట్స్ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండి ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తూ లేని విషయం ఉన్నట్టు చూపించి లబ్ది పొందుతుంటాయి. ఫేక్ న్యూస్ చాలా రకాలుగా ఉంటాయి. హాస్యం, పేరడీతో కూడుకున్నావి కొన్ని. ఇలాంటి ఫేక్ న్యూస్ ముందు నవ్వుకోడానికి సరదాగానే ఉంటాయి కానీ వాటి వల్ల సంబంధిత వ్యక్తులు ఎంత అబాసుపాలౌతారో వారి మనసు ఎంత నొచ్చుకుంటుదో ఆలోచించరు. సినిమా హీరో బాలకృష్ణపై వందల వేల పేరడీ, హాస్య వీడియోస్ వచ్చాయి. ఆయన ఈ విషయంపై స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసినా తగ్గడం లేదు. ఇలాగే ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ మరణించారని చాలా వెబ్సైట్స్ రాశాయి. ఆయన సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఆగలేదు. సరాసరి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేశారు. ఇలాంటి వార్తలు రాసి ప్రయోజనం పొందాలనుకునే వారు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. మరో రకమైనవి ఏంటంటే కంటెంట్ ఒకటి ఉంటుది పైన హెడ్లైన్స్ మాత్రం వేరే ఉంటాయి. ఉదాహరణకు ''కాజల్ అగర్వాల్ అర్ధరాత్రి ఏమి చేస్తుందో చూడండి'' అని హెడ్డింగ్ పెడతారు. ఆ ఆర్టికల్ చదివితే అసలు విషయం వేరే ఉంటుంది. కానీ కేవలం హెడ్డింగ్ చూసిన వారు మాత్రం తప్పుగా అనుకునే ప్రమాదముంది. ఈ రకమైన ఫేక్ న్యూస్ ద్వారా తప్పుడు భావనను చేరవేసినట్టే కదా.
ఒక రాజకీయ పార్టీ పెద్ద బహిరంగ సభ పెట్టింది. సభ మొదట్లో బాగానే జనం వస్తారు, సభ చివరిలో జనం పలచబడిన తర్వాత ఫొటో తీసి ''ఘోరంగా విఫలమైన సభ'' అని, ఎవరు రాకపోయినా లక్షల మంది వచ్చారని హెడ్డింగ్ వేసి మిస్ లీడ్ చేసే న్యూస్ చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే జరిగింది ఒకటి చెప్పేది మరొకటి అన్నమాట. దీనినే ''మిస్ లీడ్ కంటెంట్ ఫేక్ న్యూస్'' అంటారు. ఒక సందర్భంలో జరిగిన దానిని మరో సందర్భంలో పెట్టి వైరల్ చేస్తుంటారు. ఉదాహరణకు ఏదైనా సినిమాలో ఒక రొమాంటిక్ సీన్లోని ఫొటో తీసుకొని నిజజీవితంలో ఆ హీరో,హీరోయిన్ అలా చేశారని ప్రచారం చేయడం. దీనినే '' ఫాల్స్ కాంటెక్స్ట్ ఫేక్ న్యూస్'' అంటారు. ఒకరు ఒక విషయం చెప్పినప్పుడు దానిని ఇష్టం వచ్చినట్టు మార్చేసి వారికి అనుగుణంగా రాసుకొని వైరల్ చేయడం. మరో విషపూరితమైన న్యూస్ ఏంటంటే? ఫొటోలు మార్ఫ్ చేసి వైరల్ చేయడం. ఇది విస్తృతంగా ఉంది.
మరి ఫేక్ న్యూస్ని ఎలా కనుగొనాలి? ఏది సత్యమో, అసత్యమో ఎలా తెలుసుకోవాలి.? ముందుగా ఒక వార్తను చూస్తే దాని సోర్స్ పాయింట్ని కనుగొనడంతోపాటు, ఆ సోర్స్ వెబ్ సైట్కి ప్రామాణికత ఎంత ఉంది అని తెలుసుకోవాలి. కేవలం హెడ్లైన్ మాత్రమే కాకుండా విషయం మొత్తం చదవాలి. అది రాసిన రచయితకు ప్రామాణికత ఉందా లేదా అనేది చూసుకోవాలి. అసలు అది ఏ తేది, ఏ సమయంలో ప్రచురణ అయ్యిందో చూడాలి. ఆయన రాసిన దానిలో ఎలాంటి ఉదాహరణలు ఇచ్చారు, అవి సత్యమో అసత్యమో గ్రహించాలి. సంబంధించిన వెబ్సైట్ కాంటాక్ట్ సమాచారం వెతకాలి, రాసినది కేవలం సెటైర్ కోసమా లేదా విషయాన్ని ఆయన కోణంలో విశ్లేషణ చేశాడా? అన్నది కూడా తెలుసుకోవాలి. ఏదైనా అనుమానాలుటే తెలిసినవారిని అడగాలి. అంతే కాని అసత్యమైన విషయాన్ని నేరుగా మన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పి షేర్ చేస్తే అది కూడా ఫేక్ న్యూస్ అవుతుంది. సామాజిక మాధ్య మాలలో మరో పెద్ద సమస్య ఏంటంటే ఏదైనా ఒక విషయంపై ఎక్కువ మంది వెతికితే అది హానికరమైన విషయమైనప్పటికీ అలాంటి వాటిని ఇష్టపడే వారికి సమాచారాన్ని చేరవేయడం ద్వారా చెడు కూడా వైరల్ అవుతోంది. దీనిని ''ఫిల్టర్ ఫేక్ న్యూస్'' అటారు. ఈ ఫేక్ న్యూస్ వైరల్ చేయడానికి మనకున్న ప్రధానమైన మాధ్యమాలు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యుబ్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, ఇంకా రకరకాల వెబ్సైట్స్ ప్రధానమైనవి. వీటికి అనుగుణంగా ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. వారి స్వార్థానికి ఎంతటి నీచమైన పనులైనా చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదంతా ఒక రకమైనవి అయితే మన మెయిల్కి, మొబైల్ ఫోన్కి కూడా రకరకాల సందేశాలు పంపుతూ మీరు కోట్ల రూపాయలు గెలుచుకున్నారని చెప్పి లక్షల రూపాయలు తీసు కున్న సంఘటనలు కూడా కొకొల్లలుగా చూశాము. ఇది ప్రత్యక్ష ఆర్థిక దోపిడీ అనే చెప్పవచ్చు.వీటిపై విస్తృతంగా ప్రభుత్వాలు ప్రచారం చేయలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. వెంటనే ఇలా దోపిడీ చేసేవారిని కనుగొని శిక్షలు త్వరగా అమలయ్యేలా చేయాలి. అసలు ఈ ఫేక్న్యూస్ చాలా వరకు ఎలా వైరల్ అవుతోంది? ఎవరు వైరల్ చేస్తున్నారని తెలుసుకోవాలి. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేసేవారు ఫేక్ ఐడీలతో సంబంధించిన వెబ్సైట్స్ లేదా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తుంటారు. అందుకే ఆ ఫేక్ ఐడీని కనుగొనాలంటే ఆలస్యమవుతోంది.
ఒక సామాజిక మాధ్యమంలో మీకు ఖాతా ఉన్నదంటే మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్క. మీరు చేసే ప్రతి పని కనిపెట్టే సౌకర్య ముంది. మీరు ఏం చేసినా మొత్తం రికార్డు అవుతోంది. ఇది తెలియని వారు 'నేను ఏదైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయవచ్చు' అని బహిరంగంగా, విచ్చలవిడిగా ఎవరిపైనంటే వారిపైన ఫాల్స్ న్యూస్ రాసేయడం, ముఖ్యంగా సినిమా హీరోయిన్స్పై వచ్చినన్ని పిచ్చి రాతలు లేదా మార్ఫ్ ఫొటోలు చూస్తే సమాజం ఎటుపోతున్నట్టు?. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వాలు కూడా ఈ ఫేక్ న్యూస్ ఆధారంగానే ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నా యంటే ఇంక సమాజం భ్రష్టు పట్టిపోకుండా ఎలా ఉంటుంది?.
- నిజాగ్ని
సెల్ : 9700747280