Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం మారుతున్నది. మొత్తం ప్రపంచం కుగ్రామంలా మారింది. మానవుడు రాతియుగం, మంత్రయుగం దశలు దాటి యంత్రయుగంలోకి ప్రవేశించి నేడు రాకెట్ యుగం వైపు దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో మావనజాతిలో ఒక భాగమైన మహిళలు అన్ని రంగాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు రాణిస్తున్నప్పటికీ... కేవలం లింగ వివక్ష కారణంతో ద్వితీయశ్రేణి పౌరులుగా, చిన్నచూపుతో అణచివేయబ డుతున్నారు. అడుగడుగునా దురాగతాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రంగాల ఉద్యోగాల లోనేగాక బాధ్యతాయుత చట్టసభలలో సైతం మహిళలు పురుషులకన్నా మిన్నగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా, అటు పట్టణాలలో, ఇటు పల్లెలలో వంటింటి కుందేళ్లుగా అణిగి మణిగి జీవితాలను గడిపిన మహిళలు నేడు బస్సుల్లో డ్రైవర్లుగా, రైలు ఇంజన్ల డ్రైవర్లుగా, విమానాలలో పైలె ట్లుగానే కాకుండా రాకెట్లో కూడా దూసుకుపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సైతం సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా పురుషులతో సమానంగా తమ విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్న నేటి 21వ శతాబ్దంలో కూడా ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంటే రెండో శ్రేణి పౌరులుగానే చూస్తుండడం చాలా బాధా కరం. అమెరికాలో ట్రంప్ మీద హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికి, త్రిపురలో ఇరోమ్ శర్మిల రాజకీయంగా తెరమరుగుకావడానికి పురుషాధిపత్యం, మహిళలు అనే చిన్నచూపు వంటి అంశాలే ప్రధాన కారణాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హిందూ మత గ్రంథాలలోనేగాక ఇతర మత గ్రంథాలలో కూడా మహిళలను చిన్నచూపు చూసే అంశాలు పొందుపరిచారనే విమర్శలున్నాయి. కొన్ని సామాజిక వర్గాలలో మహిళల ముఖం చూపకుండా పరదాలు కట్టేస్తున్న సంస్కృతి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్లోనైతే.... మహిళలు సినిమాలు చూడకూడదని నిషేధం ఉంది.
పురాణాలలో కుటుంబ వ్యవస్థ ఔన్నత్యం పెంచడానికి, తన భర్త శ్రీరాముని ఆశయ సాధనలో భాగంగా రాజ్యశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిండు గర్భిణిగా ఉన్నా సీత అడవికి వెళ్లిందని కొంతమంది సమర్థిస్తున్నప్పటికీ.... పర్ణశాలలో ఆమె సాదాసీదా జీవితం అనుభవించి లోలోపల ఎంతో హృదయ సంఘర్షణకు గురై మూడో కంటికి చెప్పుకోలేక నానా యాతన అనుభవించిన విషయం గురించి చెప్పడం లేదు. నిండు సభలో పురుష కండకావరంతో అవమానించిన కౌరవుల వికృత చేష్టలను ద్రౌపది ఎలా అవమానంతో భరించిందో వేరే చెప్పవలసిన పనిలేదు. ఇదే తరహాలో రెండు దశాబ్దాల కిందట తమిళనాడు అసెంబ్లీలో మహిళ అనే చిన్న చూపుతోనే నాటి ప్రతిపక్ష నాయకురాలు జయలలిత మీద ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. గతంలో భర్త చనిపోతే... అతనితోపాటు భార్య కూడా చనిపోవాలనే సిద్ధాంతంతో సతీసహగమనం వ్యవస్థను అమలు చేసేవారు. ఈ సతీసహగమనం పేరుతో 20 ఏండ్ల కిందట కూడా రాజస్థాన్లో రూప్ కన్వర్ అనే మహిళను బలవంతంగా చంపేశారు. పంజాబ్లో టెర్రరిజాన్ని అణచివేసిన రాష్ట్ర డీజీపీ ఒకరు ఆ మధ్య ఒక విజయోత్సవ కార్యక్రమం విందుకు విచ్చేసిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి పిరుదుల మీద చేయి తట్టి వికృతానందం పొందారు. ఈ విషయం మీద ఆ ఐఏఎస్ అధికారి భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ఆ పోలీస్ అధికారి సమర్థవంతంగా టెర్రరిజాన్ని అణచివేసినందున దేశ శ్రేయస్సు దృష్ట్యా ఈ విషయం మీద రాజీ పడాలని ఉన్నతాధికారులు సర్ది చెప్పారు. ఈ విషయంలో ఆ మహిళా ఐఏఎస్ అధికారి ఎంత మానసిక క్షోభకు గురై ఉంటుందో వేరే చెప్పవలసిన పనిలేదు. నేటి రోజుల్లో కూడా ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలలో ఇంకా ఇరుగు-పొరుగు సమాజంలో మహిళల పట్ల వివక్షత పాటించకుండా మహిళలు సృష్టిధర్మానికి ప్రతీకలైనందున వీరిని ప్రత్యేక గౌరవభావంతో, సమభావంతో అభిమానించే విధంగా మన సమాజం ఎదగాల్సిన అవ సరం ఉన్నది. మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు కొత్త ప్రభుత్వంలోనైనా రూపు దిద్దుకోవాలని ఆశిద్దాం.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు
సెల్ : 9989818212