Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణ పరిస్థితులు సమస్త జీవరాశిని ఆందోళనకు గురి చేస్తునాయి. ఏడాదికేడాది వాతావరణంలో స్పష్ట మైన మార్పులు భూమిపైన జీవన పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గరిష్టంగా నమోదవు తున్న ఉష్ణోగ్రతలే దీనికి తార్కాణం. 2019 వేసవిలో అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 400 మందికి పైగా వడదెబ్బకు గురై మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఒక్క రాష్ట్రంలో ఒక్క సీజన్లోనే ఇంతమంది మరణిస్తే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బాణుడి ప్రతాపానికి బలై ఉంటారో అంచనా వేయొచ్చు. జీవులన్నింటిలో అత్యంత తెలివైనవారు, తమ రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మానవుల మరణాలే ఈ స్థాయిలో ఉంటే మిగతా జీవుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం కష్టమైనా విషయమేం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన ఇప్పటికే వేల జాతుల జీవులు కనుమరుగైపోయాయన్న శాస్త్రీయ నివేదికలు ఒకపక్క గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. జూన్ తొలి వారంలో పలకరించిన తొలకరి జల్లులతో సుదీర్ఘ వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు చెప్పలేనంత ఉపశమనంగా భావిస్తున్నారు.
వేసవి వడదెబ్బ భయం తాత్కాలికంగా మనల్ని విడిచిపెట్టినా, పూర్తి భరోసాతో జీవించలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా వర్షాకాలం ఆరంభంలో వచ్చే వర్షాలు, ఉరుములు మెరుపులతో వస్తాయి. ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడే పిడుగులు పడే ప్రమాదముంటుంది. పిడుగు పడటం అంటే కొన్ని లక్షల మెగా వాట్ల విద్యుత్ ప్రవాహం ఒక్క సారిగా ఆకాశం నుండి నేరుగా భూమిని చేరుకునే ప్రక్రియ. పిడుగులు భూమిని చేరుకునే సమయంలో చాలా వేగంగా ప్రయాణిస్తూ, భూమిని చేరుకునే లోపు ఎత్తైన భవనాలకు, చెట్లకు ఆకర్షితమవుతాయి. పిడుగు చెట్టుపై పడినప్పుడు, ఆ అధిక విద్యుత్ ప్రవాహ ప్రభావాన్ని తట్టుకోలేక దానికింద తలదాచుకున్న జీవులు క్షణాల్లో మత్యువాతపడతాయి. కాబట్టి పెద్ద పెద్ద శబ్దాలతోపాటు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చినప్పుడు చెట్లకింద ఉండకపోవటమే మంచిది. దీనిపట్ల సాధారణ ప్రజలకు అవగాహన తక్కువ. కావున పంటపొలాలలో చేను పనికి వెళ్లిన వారు ఎక్కువ మరణించడం మనం గమనించవచ్చు. కావున ప్రభుత్వం వీటి మీద ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వివరించాలి. అలాగే అవగాహన ఉన్న వారు తమ కుటుంబ సభ్యులతో, తోటివారితో చర్చించి తగిన జాగ్రత్తలు సూచిస్తే పిడుగుపాటు మరణాలను కొంతవరకు తగ్గించొచ్చు. హైదరా బాద్ వంటి నగరాల్లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు పొంగిపొర్లుతుంటాయి. పడ్డ చినుకు పడినట్టుగా ఇంకిపోయే సౌలభ్యం అక్కడ ఉండకపోవటమే దానికి కారణం. అలాంటి సందర్భాల్లో తెరిచి ఉంచిన మ్యాన్ హోల్స్ బాటసారుల పాలిట మృత్యు దారులవుతున్నాయి. కాబట్టి మున్సిపాలిటి అధికారులు వర్షాకాల సీజన్లో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అలాగే జనావాసాల్లో తెరిచి ఉన్న పొంగి పొర్లే డ్రైనేజీల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో అలాంటి డ్రైనేజీలలో పడి చిన్నారులు కొట్టుకుపోయి, దాని నుంచి బయటపడలేక ఊపిరి వదిలిన విషాద ఘట నలు మనకింకా జ్ఞాపకంలో ఉన్నాయి. చుట్టుపక్కల అలాంటి పరిస్థితులు ఉంటే ముందే అప్రమత్తమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి పిల్లల భద్రతకు భరోసాగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది. వర్షాకాల సీజన్లో అపరిశుభ్ర నీటిని తాగటం వలన కూడా కలరా వంటి ప్రమాద కర వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నది. కాబట్టి పరిశుభ్రమైన తాగు నీరు అందించే బాధ్యత, దాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత కళాజాతల ద్వా రా సామాన్య ప్రజానికానికి అర్థమయ్యేట్టుగా తెలియజేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎక్కడైనా లీకేజీ సమస్యలుంటే వెంటనే మరమ్మ తులు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. బావుల్లో నీటిని అలాగే తీసుకోవడం వలన కలిగే అనారోగ్య సమస్యల మీద పల్లెటూళ్లలో అవగాహన కల్గించాలి.
స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు గడు స్తున్నా ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో అసమానతలు తొలిగిపోలేదు సరికదా, మునుపటికంటే తీవ్రమై వెక్కిరిస్తున్నాయి. పాలకవర్గాల చలవ వలన ధన వంతులు మరింత సిరివంతులవుతుండగా పేద వారు మాత్రం మరింత దారిద్య్రంలోకి నెట్టబడుతు న్నారు. పేదలు 'కూడు, గూడు, గుడ్డ'కు కూడా నోచుకోవట్లేదు.ఈ సీజన్లో వారి కష్టాలు మరింత దయనీయంగా ఉంటాయి. శిథిలావస్థలో ఉండే ఇండ్లలో నివసించే వారు వర్షాలకు తడిసిన మట్టి ఇండ్లల్లో దినమొక యుగంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి. గతంలో వర్షానికి తడిసిన ఇండ్లలో నిద్రిస్తూ అర్థరాత్ర ఇల్లు కూలి విగత జీవులైన వారి వార్తలు ఎన్నో చూశాం. కావునా ప్రభుత్వం వారు అలాంటి వారికి చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇవ్వటానికి మొగ్గు చూపే బదులు బతికి ఉండగానే శిథిలావస్థలో ఉండే వారిని గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించడం మంచింది.
ఈ సీజన్లో విహార యాత్రలు, రిస్క్తో కూడిన ప్రమాదకర ప్రయా ణాలు పెట్టుకోకపోవడం మంచిది. అవసరమైన చోట వంతెనలకు, రోడ్లకు మరమ్మతులు వెంటనే చేసే విధంగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి చేయించాలి. లేకపోతే అపార నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందనేది మరవకూడదు. దీన్ని గత అనుభవాలు గుర్తు చేస్తున్నాయి కూడా. విద్యుత్కు నీటిలో ప్రయాణించే స్వభావం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్లు అప్రమత్తంగా ఉండి, వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. పై అన్ని కారణాల దష్ట్యా ఈ సీజన్ ముగిసేంత వరకు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఎవరికివారు అవగాహనతో, అప్రమత్తతతో ఉండాలి. అప్పుడే కొంతలో కొంత అకాల మరణాలను తగ్గించుకున్నవాళ్లమవుతాం. ఏదేమైనా అధికారులు, కళాకారుల సమన్వయంతో ప్రజల రక్షణకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు భరోసాగా ఉండాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ దిశగా పనిచేయాలని ఆశిద్దాం...
- రవికుమార్ సంగనమోని
సెల్ :7893903740