Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాల యా ల్లో ఖాళీగానున్న ఆచార్యుల కొలువుల భర్తీ పక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. 6 నెలలో ఈ తతంగాన్నంతా పూర్తి చేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న విశ్వవిద్యాలయాలల్లో ఖాళీలను గుర్తించడానికి 15 రోజులు, భర్తీకి ఆయా ప్రభుత్వాలతో అనుమతి పొందడానికి ఒకనెల, ప్రకటనలు జారీచేయడానికి 15 రోజులు ఇలా ఒక్కో దశను ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలో యూజీసీ మార్గనిర్దేశకాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికొచ్చేసరికి రాష్ట్రవ్యాప్తంగానున్న 11 విశ్వవిద్యాలయాల లో మొత్తం 1061 ఖాళీలున్నట్టు గుర్తించింది. అందులో ఆచార్యుల కొలువులు 99, అసోసియేట్ ఆచార్యుల కొలువులు 270, సహా ఆచార్యుల కొలువులు 692 ఉన్నాయని లెక్కించింది. ఇప్పటికి రాష్ట్రంలో ఇలాంటి కొలువులను భర్తీచేసి పుష్కర సంవత్సరాలు కావస్తోంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో పరిస్థితులు నెలకొని అవకాశాలు లేకుండా చేశాయి. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలలో ఆయా విభాగాలలో శాశ్వత ఉద్యోగులు సరైనంతమంది లేకపోవడంతో విద్య అటకెక్కింది. తాత్కాలికంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుని కాలం గడుపుతూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 5 సంవత్సరాలు గడిచినా ఎలాంటి అదృష్ట్యానికి నోచుకోలేకపోయారు. 2017 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 11 విశ్వవిద్యాలయాలలో ఖాళీలు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అదే సంవత్సరం జూలై 24న అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్స్ను నియమించాలని సూచించింది. ఆ తర్వాత ఎన్నో ప్రకటనలు జారీచేసినా అవన్నీ వాస్తవరూపం దాల్చలేదు. ఇందులో ఆలస్యం ఎందుకు జరిగింది. ఎవరిదీ తప్పు? ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు, నిరుద్యోగ లోకం ప్రశ్నిస్తే యూజీసీ నూతన మార్గనిర్దేశకాలు రూపొందిస్తుందనో, ప్రభుత్వం తరుపున ఉత్తర్వులు జారీచేశాము ఇక చూసుకోవాల్సింది వైస్ ఛాన్సలర్సేననో, మేము ఇప్పుడే కొలువైనాము అంతా స్టడీచేసి, ఖాళీలు గుర్తించి ప్రకటనలు జారీచేస్తామనో కాలం గడుపుతూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొలువుల నియామకానికి మార్గనిర్దేశకాలు రూపొందించి ప్రకటన జారీచేసినా రాష్ట్రంలో ఇంకోవిధంగా తయారై ఆలస్యమవ్వడానికి సవాలక్ష కారణాలు కన్పిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై 24తో వైస్ ఛాన్సలర్స్ల కాలం ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి సహకారంతో మళ్లీ యూజీసీల నియామకం చేపట్టి ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొందంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఇందులో తప్పు ఎవరిది, ఎవరిని నిందించాలి. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకంలో పరిస్థితులు ఎలా దాపురించాయంటే కొలువులకు తగిన అర్హత సంపాదించి, నియామకాలకు ఎదురుచూస్తూ, పదవి విరమణ వయసొచ్చినా భర్తీకి నోచుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే నాలుగు పదుల వయసొచ్చిన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తికాదు. ఇలాంటి పుష్కర సంవత్సరాల కాలం కొలువుల కోసం వేచిచూస్తే అదే వయసు వస్తుంది కదా! ఇక ఇందులో ఆశ్చర్యమెందుకు? విశ్వ విద్యాలయాలలో సిబ్బంది ఉండరు గానీ అందులో చదివి బయటికొచ్చే విద్యార్థులకు నైపుణ్యత లేనందున కొలువులు సాధించలేకపోతున్నారనడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వాలు ముందు నాణ్యతమైన విద్యపొందటానికి కావాల్సిన వనరులు, సౌకర్యాలను కల్పించి, కట్టుదిట్టంగా పనిచేసేలా చూస్తూ, నైపుణ్యత గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ కాలం గడుపుతూ ముందుకెళ్లేవారికి అలా అనడానికి అవకాశం లేదు. దీనికితోడు ఎన్నో కమిటీలు, చర్చలు, నూతన మార్గనిర్దేశకాలు రూపొందించడం ఇలా కాలయాపన చేస్తున్నారు కానీ మొదటి ప్రాధాన్యత దేనికివ్వాలో అర్థం చేసుకోలేదనడం సత్యం కాదా! ఒక ఉన్నతమైన పదవులలో కూర్చున్నపుడు పేరుకోసమో, హోదా కోసమో, డబ్బు కోసమో చల్లని గదులలో కూర్చొని చర్చలు, సమీక్షలు, అధ్యయనాలంటూ కాలక్షేపం చేయకుండా ఆచరణలో అమలయ్యేవిధంగా నిర్ణయాలు తీసుకొని భావి తరాల భవిష్యత్ను కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి జూలై 24న వీసీల పదవికాలపు గడువు ముగియనుండటంతో దీనినే సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఇప్పటి నుంచే ఆ పనిలో ఉండి అదే రోజున నూతన వీసీల నియామకం చేపట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు వహిస్తూ వీలైనంత త్వరగా కొలువులు భర్తీ చేపట్టాలి.
- డా||పోలం సైదులు
సెల్ : 9441930361