Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్తబ్దత, నిశ్శబ్దం, నిర్వేదం, ఆవహించి ఉన్న కవితార్గంంపై ఉప్పెనలా హఠాత్తుగా విరుచుకుపడి కవిత్వం రాసిన నిబద్ధత, నిమగత గల కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు(79) 25 జూన్ 2019 పె(క)న్ను మూశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా లింగ సముద్రంలో పుట్టిన కమ్మిశెట్టి వ్యవసాయ రైతు కుటుంబం. తాను చెప్పదల చుకున్న అంశాన్ని సూటిగా, ఘాటుగా నిష్కర్ష గా పదునైన పదజాలంతో విప్లవాత్మక కవిత్వా న్ని వెలువరించాడు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. ఆయన కలం పేరు మహాస్వప్న. సామ్యవాదాన్ని ప్రేమించి పేదల గళాన్ని శక్తివంతంగా వినిపించిన మహా స్వప్న దిగంబర కవుల్లో ఒకరు. ఆధునిక సాహిత్య వనంలో కమ్మిశెట్టిది ఓ తిరుగులేని ముద్ర. ''రాత్రి ఉదయిస్తున్న రవిని దిగంబర కవిని'' అని ప్రకటించుకున్న మహాస్వప్న. పాతికేళ్ల ప్రాయంలోనే అగ్ని శిఖలు మంచుజడులు, స్వర్ణధూళి లాంటి కవితా సంపుటిలు ప్రచురించారు. తానేమిటో 1964 నాటికే నిరూపించుకున్నాడు.
''కాలం వాయు వీనం మీద కమానునై చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై అనడం మహాస్వప్నకే చెల్లు! బ్రహ్మచారిగానే మిగిలిన మహాస్వప్న వెంకయ్య నారాయణమ్మలకు 1940లో జన్మించాడు. ఇంటర్ దాకా ప్రకాశం, నెల్లూరులలో చదివిన మహాస్వప్న హైదరాబాద్లో ఉన్నత విద్య అభ్యసించారు. వివేకవర్ధిని కాలేజీలో బీఏలో చేరాడు నార్ల చిరంజీవి అరసం సంస్థ ప్రోత్సాహాలలో 1958లో ''చందమామ'' బాల కవితా సంపుటి వెలువరించారు. తెలుగు కవితా స్వరూప స్వభావాలను మార్చాలనే తపనతో ఉన్న మహాస్వప్నకు మరో ఐదుగురు తోడై నిలిచారు. వారే దిగంబర కవులు. వారు కలం పేర్లతోనే కవిత్వం రాసారు. వారే బద్దం భాస్కర్రెడ్డి (చెరబండ రాజు), మానేపల్లి హృషీకేశవరావు (నగముని) యాదవరెడ్డి (నిఖిలేశ్వర్), వీర రాఘవాచార్యులు (జ్వాల ముఖి) మన్మోహన్ సహారు (భైరవయ్య), ''మానసిక దిగంబరత్వం కోసం నిత్యచేతన ఆత్మ స్ఫూర్తితో జీవించడమే మా ఆశయం''. వ్యక్తి అస్థిత్వ పరిరక్షణ కోసం అంతరంగంలో అణగిపడి ఉన్న ఆరాటాన్ని, సంతోషాన్ని, విసుగును, అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాలని మాతతృరత అంటూ తమ మార్గం స్పష్టంగా చెప్పుకుంటూ కవిత్వం రాసారు దిగంబర కవులు. రిక్షా కార్మికుడు, హోటల్ సర్వర్, బిచ్చగత్తెలతో కవితా సంపుటాలు ఆవిష్కరించి సంచలనం సృష్టించారు. ''దిక్కులు'' పిక్కటిల్లేలా విప్లవ గర్జన చేశారు. ప్రముఖ కవి శివారెడ్డి లాంటి వారిని ప్రభావితం చేసే కవిత్వం రాసారు. మహాస్వప్న మంచి అనువాదకులు కూడా.
2015లో దిగంబర కవులు మూడు కవితా సంపుటాలు ఒకే పుస్తకంగా వెలువరించారు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లాంటి వారు తరువాత కాలంలో విరసంలో ప్రధాన భూమిక, ఆవిర్భావకుల్లో ఒకరై నిలిచారు. ఆ తరువాత జన సాహితీ సంస్థలో పని చేశారు. ''మిమ్మల్ని కాపాడుతున్న ఈ చీకటి రాత్రికోట బద్దలు కొడతాను, నాగరికతను మానభంగం చేస్తాను నేను, ప్రతి పుట్టను పగులగొట్టి విష బుజంగాల్ని పట్టి కోరలు తీస్తాను నేను, ఈ ఘోరారణ్యంలో కారు చిచ్చు రగిలిస్తా, నాగరికత రావణ లంక దహనం చేస్తా'' అంటూ ఆనాటి సమాజపు తీరుపై నిప్పుల అక్షరవాన కురిపించిన మహాస్వప్న మన కాలం మహాకవి. అరసంలో స్తబ్ధత మహా కవులుగా పేరొందిన వారు సర్కార్ పల్లకి మోయడం మరి కొందరు బిరుదులు, సత్కారాల వైపు అర్రులు చాస్తూ కీర్తి మెట్లు ఎక్కడం చూసి మండిపడ్డాడు. ''ఈ చౌరస్తాలోనే యాక్సిడెంట్ జరిగింది. అప్పుడే మతి భ్రమించింది, అప్పుడే కథ మొదలైంది, అనే మహాస్వప్నది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. మురిగిన సూర్యుణ్ణి నంజుకుంటూ, మృత్యువుని కాస్త కాస్తగా కొరుక్కుతింటూ అక్షరయజ్ఞం చేసిన గొప్ప ఋత్విక్ కమ్మిశెట్టి వెంకటేశ్వరరావుకు నా అక్షర నివాళి.
- తంగిరాల చక్రవర్తి
సెల్ : 9393804472