Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులను బెంబేలెత్తిస్తోంది. దీనికి రాజకీయరంగు పులిమేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై శుక్రవారం ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ విద్యుత్ సంస్థల బాస్ దేవులపల్లి ప్రభాకరరావు ఈ చర్చలో పాల్గొంటూ ఆంధ్రా ఉద్యోగుల్ని తీసేసుకోవాలని కోరడం, దానికి ఇక్కడే ఉంటే నష్టమేంటని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించి, అవసరమైతే వారికి జీతాలు మేమే ఇస్తామని తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. దీన్ని జీర్ణించుకోలేని తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగి ఒకరు శనివారం సీఎం కేసీఆర్కు ఆకాశరామన్న లేఖ రాసారు. ఆంధ్రా ఉద్యోగుల్ని ఇక్కడే కొనసాగిస్తే...తామంతా నష్టపోతామని, దీన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలని ఆ లేఖలో కోరారు. అంతవరకు బాగానే ఉంది. చివర్లో 'కాపీ టూ...' అంటూ విద్యుత్ సంస్థల బాస్ డీ ప్రభాకరరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో పాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ను కూడా చేర్చారు. చివర్లో ఇంజినీర్ల అసోసియేషన్ దీనిపై ఆందోళనలకు పిలుపు ఇవ్వాలనీ డిమాండ్ చేశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విద్యుత్ శాఖలతో ఏమాత్రం సంబంధం లేని కేటీఆర్, మంత్రి ఈటల రాజేందర్ల పేర్లు చేర్చడం పట్ల చర్చ జరుగుతోంది. దీన్ని వివాదం చేసేందుకు మాజీ మంత్రి హరీశ్రావు అనుచరులు ఎవరో ఈ లేఖను సర్క్యులేట్ చేస్తున్నారనే ప్రచారం విద్యుత్ ఉద్యోగుల్లో జరుగుతోంది. దీనిపై ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. చూద్దాం ఏం జరుగుతుందో!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి