Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జై శ్రీరాం'..!! ఒకప్పుడు ఈ నినాదం ఏ ఆలయానికి వెళ్తేనో లేక రాముడికి సంబంధించిన ఏదైనా ఊరేగింపు సందర్భంగానో వినపడేది. కానీ జాతీయవాదాన్ని వీలైనంతగా రెచ్చగొట్టి కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ నినాదం 'భక్తుల'కు సింహనాదమైంది. ఇప్పుడిదే నినాదంతో దేశంలో మిగిలిపోయిన, తమకు చోటు లేని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని కమలనాథులు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగాల్లో ప్రస్తుతం నడుస్తున్న 'జై శ్రీరాం' చర్చంతా. ఇన్నాళ్లు రాముడి 'గుడిని' ఉపయోగించుకుని 'రాజీ లేని రాజకీయం' చేసిన సంఘ్ పరివారం.. ఇక నుంచి ఆ రాముడి నినాదాన్నే మనపై ప్రయోగించనుంది.
పురాణాల ప్రకారం రాముడు దయా హృదయుడు, సహనశీలి, ఓర్పు కలవాడు అని చెబుతారు. కానీ 21వ శతాబ్దపు 'అభినవ రామ భక్తులు' కొంచెం ట్రెండ్ మార్చా రు. సహనం వీరికి రుచించదు. దయ అనే దానిని వీరు దరిచేరనీయరు. ఇక ఓర్పు సంగతి సరేసరి. పరమతంపై నిత్యం ఈర్ష్యా, ద్వేషంతో రగిలిపోతూ వారిచేత కూడా తమ 'ఆరాధ్యుడి' పేరు వినాలనుకునే ఉదార స్వభావమున్న 'గొప్ప భక్తులు'. దేశంలో కొంతకాలంగా 'జై శ్రీరాం' పేరిట జరుగుతున్న అరాచకాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
ఈనెల 17న ఆకలితో అలమటిస్తున్న రాష్ట్రం జార్ఖండ్లో తర్బేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిపై మూకదాడి జరిగింది. ఈ దాడిలో బాధితుడు బైక్ దొంగిలించాడనే నెపంతో అతడిని ఓ కరెంటు పోల్కు కట్టేసి 'జై శ్రీరాం, జై హనుమాన్' అనాలని కాషాయమూకలు అతడిని చితకబాదాయి. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయాలపాలై ప్రాణాలొదిలాడు. సరిగ్గా ఇది వెలుగులోకి వచ్చిన నాలుగైదు రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లో షారూఖ్ హల్దార్ అనే మరో ముస్లిం (మదర్సా టీచర్) యువకుడిపైనా 'హిందూ సమితి' కార్యకర్తలు తమ ప్రతాపాన్ని చూపించారు. షారూఖ్ను కర్రలతో కొడుతూ 'జై శ్రీరాం అంటావా..! లేదా..?' అంటూ తమదైన రీతిలో విరుచుకుపడ్డారు. అదీ చాలదన్నట్టు రైలునుంచి కిందికి తోసేశారు. ఈ పరంపరను కొనసాగిస్తూ.. మహారాష్ట్రలోని థానేలో ఫైజల్ ఉస్మాన్ అనే క్యాబ్ డ్రైవర్పైనా ఇదే తరహా దాడి జరిగింది. బాధితుడు రాత్రిపూట కారు చెడిపోయిందని ఆపి చెక్ చేస్తుండగా.. అక్కడికి వచ్చిన 'హిందూ బాంధవులు', అతడిని పట్టుకుని 'జై శ్రీరాం' అంటేనే విడిచిపెడతామంటూ బెదిరించి ఉస్మాన్పై దాడికి దిగారు. వెలుగులోకి రానివి కోకొల్లలు. వీటన్నింటిలోనూ ఎక్కువమంది బాధితులు ముస్లింలే. గతంలో గోరక్షకుల పేరిట దాడులు చేసిన మూకలే కొంచెం వరుస మార్చి రాముడిని నెత్తినెత్తుకుని ఈ దాడులకు తెగబడుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఐదేండ్లుగా గోరక్షణ పేరు మీద దాడులు చేసినా.. ఇప్పుడు రాముడి పేరు మీద చేస్తున్నా.. వారి ఉద్దేశం తెలియనిది కాదు. 'హిందీ, హిందూ, హిందూస్థాన్' లక్ష్యంగా ఆరెస్సెస్ పర్యవేక్షణలోనే ఈ దుర్మార్గపు క్రీడ సాగుతోంది. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. సరిగ్గా నెల రోజుల క్రితం దేశంలో అఖండ మెజారిటీతో మోడీని దేశ ప్రజలు మళ్లీ గెలిపించారు. విజయానంతరం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ.. గతంలో తాను ఇచ్చిన 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్'కు మరిన్ని రంగులద్ది ఈసారి దానికి 'సబ్ కా విశ్వాస్'ను కూడా చేర్చారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ముస్లింలు కూడా తమను ఆదరించారనీ, వారి విశ్వాసాన్ని చురగొనేలా నడుచుకోవాలని బీజేపీ ఎంపీలకు, ఆయనను అనుసరించే 'భక్త పరివారానికి' ఢిల్లీ వేదికగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జరగడానికి రెండు రోజుల ముందే (మే 26న) గురుగ్రాంలో నమాజు చేసి వస్తున్న మహ్మద్ బర్కాత్ అనే ఓ ముస్లింపైన హిందూత్వ మూకలు దాడికి తెగబడ్డాయి. 'ఈ ప్రాంతంలో టోపీ పెట్టుకోవడం నిషేధం' అంటూ 'తమ చట్టాలను' అమలుచేస్తూ.. బాధితుడిని 'జై శ్రీరాం అంటావా లేక పందిమాంసం తినిపించమంటావా..?' అని బెదిరించారు.
మోడీ సమావేశం తర్వాత కూడా దేశంలో హిందూత్వ మూకల 'జై శ్రీరాం' దాడులు సర్వసాధారణమైపోయాయి. బెంగాల్లో ఇది మరీ శృతిమించింది. జార్ఖండ్ ఘటనతో ముస్లింల విశ్వాసాన్ని చురగొనేందుకు ఇదే మార్గమా..? అని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలతో దేశంలో ముస్లింలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారనేది నమ్మక తప్పని నిజం. గతంలోనూ ముస్లింలపై మతం, గోరక్షణ పేరిట దాడులు జరిగినా.. 2014 తర్వాత అవి హెచ్చుమీరాయన్నది కాదనలేని వాస్తవం. 2010 నుంచి గోరక్షక దాడుల్లో చనిపోయినవారిలో 84 శాతం ముస్లింలుంటే.. 2014 తర్వాత అది 97 శాతానికి చేరుకోవడం ప్రస్తావనార్హం. అధికారిక లెక్కల ప్రకారమే మోడీ సర్కారు-1లో ఈ తరహా దాడులు 266 జరిగాయి. గణాంకాలు భయపెడుతున్నా.. మోడీ చెప్పిన 'విశ్వాసం' ఏ మేరకు సాధ్యమో ప్రధానికే తెలియాలి.
నెల రోజులుగా ఓ నినాదం పేరు మీద ఇంత రాద్దాంతం జరుగుతున్నా.. జార్ఖండ్లో ఓ అభాగ్యుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయినా మోడీకి ఇది సర్వసాధారణమైన ఘటనగానే కనిపించడం విచారకరం. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పార్లమెంటు సాక్షిగా మోడీ స్పందిస్తూ.. దాడి బాధ కలిగించిందనీ, కానీ ఒక్క ఘటనను చూపి రాష్ట్రం మొత్తాన్ని బద్నాం చేస్తారా..? అని తనదైన మార్కులో విపక్షాలను ప్రశ్నించారు. కానీ, జార్ఖండ్లో మూకదాడులేం కొత్తకాదు. అదీ ముస్లింలపై అంతకంటే కాదు. ఒక నివేదిక ప్రకారం.. 2009 నుంచి ఆ రాష్ట్రంలో ఈ తరహా దాడులు రెండు మాత్రమే. కానీ, మోడీ అధికారం చేపట్టిన 2014 తర్వాత జార్ఖండ్లో 14 మూకదాడులు జరిగాయి. తర్బేజ్ అన్సారీది పదిహేనో ఘటన. ఈ దాడుల్లో సమిధలైంది అణగారిన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇన్ని మూకదాడులు జరుగుతున్నా రాష్ట్రాన్ని వేలెత్తి చూపించకూడదంటే ప్రధాని దృష్టిలో ఇంకెన్ని మారణ హోమాలు జరిగితే 'పెద్ద ప్రమాదం'గా గుర్తిస్తారో మరి..!!
- శ్రీను మునిగాల
సెల్ : 7989660512