Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ బి.సి.రాయ్ గా ప్రసిద్ధిగాంచిన బిదాన్ చంద్రరాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగానికి వన్నెతెచ్చిన బీసీ రాయ్ 1882 జులై 1న బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా బంకింపూర్లో జన్మించారు. తండ్రి ప్రకాష్ చంద్ర. ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. తల్లి అగోర్కమినీదేవి. ఐదుగురు సంతానంలో రాయ్ చిన్నవాడు. చిన్నతనంలోనే తల్లి మరణించింది. కలకత్తా మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తిచేశాడు రాయ్. కొన్నాళ్లు ఆరోగ్యశాఖలో పనిచేసి, ఉన్నత చదువుల కోసం 1909లో కేవలం రూ. 1200తో ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లాడు. అక్కడి బర్త్ హోమ్ హాస్పిటల్లో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న డా.రాయ్ అభ్య ర్థనను ఆ విద్యాసంస్థ తిరస్కరించింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా అదే పనిగా వరుసగా 30 సార్లు అలుపెరుగని ప్రయత్నం చేయడం వల్ల, అతని పట్టుదలను గుర్తించిన సంస్థ ఎట్టకేలకు ప్రవేశం కల్పించింది. కేవలం రెండేండ్ల మూడునెలల స్వల్పకాలంలోనే ఎంఆర్ సీపీఎఫ్ఆర్సీఎస్ డిగ్రీలు పూర్తిచే శాడు. ఇంత తక్కువ కాలంలో ప్రతిష్టాత్మకమైన రెండు డిగ్రీలు పూర్తిచేసిన అరుదైన వ్యక్తిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకుడిగా పని చేశారు. పేద రోగులకు ఏదో చేయాలన్న తపనతో జాదవ్పూర్ టీబీ హాస్పి టల్, ఆర్.జి. ఖార్ మెడికల్ కాలేజ్, కమలా నెహ హాస్పిటల్, విక్టోరియా ఇన్సిస్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ తదితర సంస్థల్ని నెలకొల్పాడు. 1926లో మహిళలు, పసి పిల్లల కోసం ప్రత్యేకంగా చిత్తరంజన్ సేవా సదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేశాడు. యువతులకు నర్సింగ్లో శిక్షణ ఇవ్వడంకోసం మరో శిక్షణా సంస్థను కూడా నెలకొల్పాడు. 1922 నుండి, 1928 వరకు ఆరేండ్లకుపైగా కలకత్తా మెడికల్ జర్నల్కు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించాడు. 1925లో రాజకీయ రంగప్రవేశం చేసి, బారక్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దాదాబాయ్ నెహ్రూజీపై గెలుపొందాడు. 1928లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడయ్యాడు. 1933లో కలకత్తా నగర మేయర్గా ఎన్నికయ్యాడు. 1942లో కలకత్తా విశ్వవిద్యాలయ ఉప కులపతిగా, 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 1948 జనవరి 13న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ప్రఫుల్ల చంద్రఘోష్ తరువాత, రెండో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టాడు. తన పూర్తి జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసిన రాయ్ వివాహం కూడా చేసుకోలేదు.
బీసీ రాయ్ ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. గాంధీజీకి వ్యక్తిగత వైద్యుడు, మంచి స్నేహితుడు కూడా. విద్య, వైద్యరంగాల్లో ఆయన చేసిన సేవలకు 1944లో గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. 1961లో ఫిబ్రవరి 4న డా.బీసీ రాయ్ను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ప్రజానేతగా, ప్రజావైద్యుడిగా రాయ్ చేసి న కృషికి, త్యాగానికి గుర్తుగా, ఆయన స్మారకార్ధం ప్రతి సంవత్సరం జులై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 1976 నుండి డాక్టర్ బీ.సీ రాయ్ పేరు మీద అవార్డులు అందజేస్తున్నారు. ప్రజల రోజువారీ జీవితాల్లో కీలక పాత్ర పోషించే వైద్యుల సేవలను గుర్తించి, వారి గొప్పతనం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బీ.సీ రాయ్ స్ఫూర్తితో వైద్యరంగంలో గుణాత్మక మైన మార్పు తీసుకురావడానికి వైద్యులు కృషిచేయాలి. 'వైద్యోనారాయణో హరీ' అని వైద్యుణ్ణి దైవసమానుడుగా గుర్తించే స్థాయినుంచి, వైద్యుడంటే పేదల రక్తం పీల్చే పిశాచి అన్నస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య మహోదయులపై ఈ దురభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత మరింత అధికంగా ఉంది. ఎందుకంటే ఈనాడు రోగికీ వైద్యునికి మధ్య ఉండవలసిన ఆత్మీయ సంబంధం కాస్త ఆర్థిక సంబంధం అయిపోయింది. అన్ని రంగాల లాగానే వైద్యరంగం కూడా ఫక్తు వ్యాపార రూపం దాల్చింది. గతంలో వైద్యం ఒక పవిత్ర వ్యాపకం. కాని ఈనాడు అదొక లాభసాటి వ్యాపారం. ఆ కాలంలో వైద్యవత్తిని గౌరవప్రదమైనదిగా భావించేవారు. సేవాతత్పరత, మానవీయ స్పదనలు ఉన్నవాళ్లు మాత్రమే వైద్యవృత్తిని ఎంచుకునేవారు. కాని ఈనాడు సేవా భావం అన్నది మచ్చుకు కూడా కాన రావడంలేదు. కార్పొరేట్ కల్చర్కు అలవాటు పడిన అధికశాతం మంది వైద్యులు మానవీయ కోణాన్ని విస్మరించి ఎన్నిరకాల అవకాశాలుంటే అన్ని రకాలుగా రోగుల్ని డబ్బుల కోసం పీడిస్తున్నారు. ఈనేపథ్యంలో వైద్యులపై రోగులకు ఉండే సహజమైన నమ్మకం, గౌరవభావం సడలిపోయింది. కొంతమంది అత్యాశాపరుల వల్ల పూర్తి వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్న పరిస్థితిని నివారించాల్సిన అవసరముంది. స్వాభావికంగా సేవాభావం లేనివారు, వైద్యేతర రంగాల్లోని కార్పొరేట్ వ్యాపారులు వైద్యవత్తిలోకి ప్రవేశించి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న బలమైన వాదనపైనా దృష్టిసారించాలి. వైద్యులు రోగులపట్ల తమ దృక్పధాన్ని మార్చుకొని, ప్రజలకు అను నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలి. ప్రజా వైద్యుడిగా విశేష ఖ్యాతి గడించిన డా.బీసీ రాయ్ను ఆదర్శంగా తీసుకొని వైద్యవత్తిపై పడిన కళంకాన్ని తొలగించడానికి ప్రతి ఒక్క వైద్యుడూ ఆచరణాత్మక కృషి చేయాలి. అప్పుడే వైద్యులకు, వైద్యవృత్తికి పూర్వాదరణ లభిస్తుంది. వైద్య మహోదయులు ఆ దిశగా ఆలోచిస్తారని, ముందడుగు వేస్తారని ఆశిద్దాం.
- యండి.ఉస్మాన్ఖాన్
సెల్ : 9912580645