Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో దాదాపుగా 1890 ఇంజనీరింగ్ కళాశాలలు న్నాయి. ఇందులో 179కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్నాయి. మరో పది కళాశాలలు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. అయితే రాను రాను ఈ ఇంజనీరింగ్ కళాశాలలు విద్యా కేంద్రాలు, వినూత్న ఆవిష్కరణలకంటే వ్యాపార కేంద్రాలుగానే పేరుకొస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు వ్యాపార కేంద్రాలు ఎలా అవుతాయని అనుకోవచ్చు. ఒకప్పుడు విద్యకు, వినూత్నమైన ఆవిష్కరణలకు కేరాఫ్గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, నేడు వ్యాపారాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అంటే ఇది పూర్తిగా యాజమాన్యాల తప్పు అని కూడా అనలేము, ఇందులో ప్రభుత్వం తప్పు ఉంది. ఒకప్పుడు కళాశాలలను విద్యావేత్తలు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నడిపించేవారు. కాని నేడు వ్యాపారస్తులు, రియలెస్టేట్ దందాలు, భూకబ్జాలు, చేసే వారు కళాశాలలను నడుపుతున్నారు, కళాశాలలకు అనుమతులిచ్చే ప్రక్రియను ప్రభావితం చేసే ప్రభుత్వంలో బాధ్యులుగా ఉంటున్నారు, కాబట్టి వారు ప్రతీది ఒక వ్యాపార ధృక్కోణంలో చూస్తూ విద్యా వ్యాపారానికి తెరలేపారు.
రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో మెకానికల్ ఇంజనీరింగ్ మొదలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్కు సంబంధించిన పరికరాలున్నాయో లేవో తెలియదు కానీ, ప్రతి కళాశాలలో బౌన్సర్ల వ్యవస్థ ఉంది. కళాశాల గేటు మొదలు కళాశాల చైర్మెన్ వరకు పదుల సంఖ్యలో బౌన్సర్లను దాటుకొని వెళ్లాలి. సెక్యురిటీ గార్డు దగ్గర వాకీటాకి ఉంటుంది, మళ్లీ చైర్మెన్ దగ్గర వాకీటాకీ ఉంటుంది, ఈ సెక్యురిటి గార్డుతో మాట్లాడే ప్రతి విషయాన్ని చైర్మెన్ / డైరెక్టర్ వింటూ ఉంటారు. ఒక తండ్రి తన కొడుకునో, కూతురునో ఆయా కళాశాలలో చదివిస్తూ వారి చదువు ఎలా ఉందని తెల్సుకోవడానికి కళాశాలలో ఎవరు అందుబాటులో ఉండరు, కానీ సెక్యురిటీ గార్డుని బాబు మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయా అంటే ఏ డిపార్ట్మెంట్ అంటాడు, ఏదో డిపార్ట్మెంట్ పేరు చెబితే ఆ డిపార్ట్మెంట్, ఈ కళాశాలలో టాప్ కదా, సరే వెళ్లండి ఉంటే ఒకటి, రెండు సీట్లు మిగిలి ఉండొచ్చు అని అంటారు, అంతే పాపం తల్లితండ్రులు ఇదంతా నమ్మి లక్షలకు లక్షలు డొనేషన్లు చెల్లించి అడ్మిషన్లు తీసుకోవట్లేదు, కొనుక్కొంటున్నారు, అంటే ఈ తంతు కొన్ని కళాశాలలకే పరిమితమవ్వలేదు, పేరు మోసిన సీబీఐటీ, ఎంజీఐటీ, వాసవి, బీవీఆర్ఐటీ, జీఆర్ఐసీటీ, సీవీఆర్, ఎస్ఎన్ఐఎస్టీ, మల్లారెడ్డి వర్ధమాన్ మొదలు ట్రస్ట్ల పేరు మీద నడిచే కేఎంఐటీ, జి.నారాయణమ్మ వరకు ఇదే తంతు.
ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థల తప్పు కూడా ఉంది. ప్రతి కళాశాలకూ ఎన్బీఏ, న్యాక్, యూజీటీ (అటానమస్) స్ట్టేటస్ ఇస్తే, ఆయా కళాశాలలు వీటన్నింటిని ఆకర్షణీయంగా చూపెడుతూ విద్యా వ్యాపారం చేస్తున్నాయి. హైదరాబాద్లోని సెయింట్ మెరీస్ ఇంజనీరింగ్ కళాశాలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ కూడా చివరి వరకు రాక, చివరికి కోర్టు ద్వారా తెచ్చుకుంటారు, అటువంటి సెయింట్ మెరీస్ కళాశాలకు న్యాక్ టీమ్ ఇన్స్పెక్షన్కి వచ్చి 'న్యాక్ ఎ' గ్రేడ్ ఇస్తే విద్యా వ్యాపారం కాక మరే ఏం అవుతుంది. కొన్ని కళాశాలలకు జేఎన్టీయూహెచ్ ఇన్స్పెక్షన్లో ఫ్యాకల్టీ డిఫిషెంన్సీ చూపెడ్తుంది. అంటే విద్యార్థులకు సరిపడా లెక్చరర్స్ లేరనే రిపోర్ట్ జేఎన్టీయూహెచ్ ఇస్తే ఇవేమీ పట్టించుకోకుండా యూజీసీ లాంటి సంస్థలు శాశ్వత అటానమస్ ఇస్తున్నాయి. ఇలా ఎవరికి వారు చేసిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి, రూ.లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదువుకోవాల్సి వస్తుంది. సామాన్య బీద, బడుగు, బలహీన వర్గాలకు ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షలా మారిపోయింది. కళాశాల సీటు పది లక్షలకు పైగా చెల్లించాలి. భాగ్యనగరానికి వచ్చి హస్టల్లో ఉండాలి, కళాశాల బస్కు సైతం ఫీజులు చెల్లించాలి, మళ్లీ వివిధ రకాల ఫీజులు. ఇవన్నీ చూస్తుంటే ఒక పేద, గ్రామీణ విద్యార్థి ఇంజనీరింగ్ విద్యను ఏ రకంగా చదువుకోగలడు, చదవలేక, చదువుకోవాలనే తపన ఉన్నా, చదువు 'కొనలేక' మధ్యలోనే చదువులను మానేసి నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ పట్టించుకోదా? అనే ఆలోచనలు వస్తుంటాయి, కాని ప్రభుత్వం ఎవరిని పట్టించుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న వారినా, మనల్నా? నేడు రాష్ట్రంలో సగానికిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులవే. సగానికిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రభుత్వాధినేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న కళాశాలలే.
కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఉచిత విద్య దేవుడెరుగు కాని, ఈ ఫీజుల పెంపునకు బాటలు వేసింది మాత్రం వారే. సమైక్య పాలకుల హయాంలో అన్ని కళాశాలలకు రూ.35,000 ఫీజుండేది. కేసీఆర్ గద్దెనెక్కాకే రూ.35,000గా ఉన్న ఫీజులను రూ.1,97,000 వరకు పెంచారు. ఇవి చాలవన్నట్టు ప్రతి మూడేండ్లకోసారి రివీవ్ చేసి పెంచుతాం అని చెప్పారు. దాని కారణంగా నేడు రూ.1,97,000 వరకు ఉన్న ఫీజును యాజమాన్యాలు తమ తప్పుడు లెక్కలతో రూ.3,00,000కు పెంచుకోవాలని కుట్రలు చేస్తున్నాయి, లక్ష రూపాయలు ఫీజు ఉన్నప్పుడే ఈ కళాశాలలు రూ.15 లక్షలు డొనేషన్ తీసుకున్నాయి. అదే 3 లక్షలు ఫీజు అధికారికంగా నిర్ణయిస్తే యాజమాన్యాలు 45 లక్షల వరకు డొనేషన్ రూపంలో వసూలు చేస్తారనటంలో సందేహం లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను నియంత్రించాలి. ప్రభుత్వమే బి-క్యాటగిరి అడ్మిషన్స్ని కూడా ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలి. ప్రభుత్వం యాజమాన్యాలకు కొమ్ముకాస్తే తెలంగాణ ప్రజలకు పోయేదేం లేదు, ప్రజల ఆదాయ, వ్యయాలను కూడా రివీవ్ చేసి ప్రభుత్వం విడుదల చేసే రూ.35,000ను మూడు రెట్లు పెంచాలి, గట్టిగా అడిగితే పూర్తి కళాశాల ఫీజులను ప్రభుత్వమే భరించాలి. వీటన్నింటికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం 2014లో తమ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి స్థానిక వనరులకనుగుణంగా కోర్సులు రూపకల్పన చేసి స్థానికంగానే ఉద్యోగవకాశాలు కల్పించాలి. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ను నియమించి హై కోర్టుకు అపీల్ ద్వారా వెళ్లి ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.
జవ్వాడి దిలీప్
సెల్ : 7801009838