Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశంలో సగం, సమాజంలో సగం అనే విధంగా బాహ్య ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ.... జనాభాలో సైతం సమ ఉజ్జీగా వున్న మహిళలు నేటికీ ద్వితీయశ్రేణి పౌరులుగానే రాణిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేళ్లుగా...తండ్రుల చాటు బిడ్డలుగా... భర్తల చాటు భార్యలుగా ఉంటూ... ప్రతి విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోలేక స్వంత వ్యక్తిత్వాన్ని చంపుకొని, ఆత్మగౌరవాన్ని అణచుకొని అణిగిమణిగి వ్యవహరించిన అబలలు నేడు సబలలుగా మారారు. పట్టణాలలో ఆటోలు నడుపుతూ, బస్సులు, లారీలు వంటివి డ్రైవింగ్ చేస్తూ, గూడ్స్ ఇంజన్లు, రైలు ఇంజన్లు వంటి వాటికి కూడా డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తూ... ఆకాశంలో రాకెట్లలో కూడా పయనిస్తూ అన్ని రంగాలలో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా చొచ్చుకుపోతున్నారు. కానీ మహిళలకు చట్టసభలలో సమాన నిష్పత్తి అనేది ఎండమావిగానే మిగిలిపోతున్నది. మహిళలకు కేటాయిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, పారిశ్రామికరంగ ప్రోత్సాహకాలు, వ్యాపారరంగ తోడ్పాటు కార్యక్రమాలు బినామీలతో పక్కదోవపడుతూ... అనుకున్న స్థాయిలో ఆదుకోవడం లేదనే విమర్శ సర్వత్రా వ్యక్తమవుతున్నది. నేటి 17వ లోకసభకు మహిళా పార్లమెంట్ సభ్యులు 78 మంది ఎన్నికయ్యారు. ఈ విధంగా మహిళా లోకసభ సభ్యుల సంఖ్య 1952, 1957లలో ఏర్పడిన సభలలో 22 మంది చొప్పున మాత్రమే ఎన్నికయ్యారు. 1962లో 36 మంది, 1967లో 29 మంది, 1971లో 22 మంది, 1977లో 19 మంది, 1980లో 28 మంది, 1984లో 42 మంది, 1989లో 29 మంది, 1991లో 37 మంది 1996లో 40 మంది, 1998లో 43 మంది, 1999లో 49 మంది, 2004లో 45 మంది, 2009లో 59 మంది, 2014లో 62 మంది ఎన్నిక కాగా ఈ సారి ఈ సంఖ్య 78కి చేరింది. అయితే.... పురుషులతో సమానమనే సంఖ్యతో పోలిసే ఇది చాలా దూరంగా ఉంది. పార్లమెంట్ లోక్సభ సభ్యులు 541 మంది, రాజ్యసభలో 250 మంది గౌరవసభ్యులు రాజ్యాంగ బద్ధంగా కొనసాగుతున్నారు. లోక్సభతోపాటు రాజ్యసభలో కూడా మహిళల సంఖ్య ఎప్పుడూ రెండంకెలను దాటడం లేదు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందితే.... తప్పనిసరిగా మహిళా పార్లమెంట్ సభ్యుల సంఖ్య పురుషులతో సమానంగా కాకపోయినా... మూడింట ఒకవంతుగానైనా రాణించడానికి అవకాశం ఉంది. ఈ మహిళా బిల్లు దశాబ్దాలుగా ఇదిగో.. అదిగో... అంటూ ఊరిస్తున్నదే తప్ప ఆచరణలోకి రావడం లేదు.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు
సెల్ : 99898 18212