Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంబీఏ కాలేజీల భాగోతం అంతా ఇంతా కాదు. యూనివర్సిటీ పరిధిలో చాలా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు నడుస్తున్నాయి. 2018 -19 సంవత్సరానికి దాదాపు 123 కళాశాలలకు అనుమతి వచ్చింది. అందులో 16 వేల పైచీలుకు సీట్లున్నాయి. దాని తర్వాత 2019 - 20కి 113 కళాశాలలకు అనుమతి లభించింది. అయితే ఉస్మానియా పరిధిలో ఉన్న ఎంబీఏ కళాశాలల్లో ఉద్యోగులు లేకపోవడం చాలా దురదృష్టకరం. అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు కళాశాలకు రావడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ కళాశాలలకు తనిఖీల పేరుతో వచ్చే ఏ కమిటీ పట్టించుకోవడం లేదు. తనిఖీ జరిగే ఆ ఒక్క రోజుకు అధ్యాపకులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఆ రోజుకు రూ.3 వేల నుంచి 10 వేల వరకు ఇచ్చి వారిని ఆ తనిఖీ ఆఫీసర్లకు చూపించి తద్వారా పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. దానిద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో నష్టం జరుగుతుంది. ఈ విధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువగా పెరుగుతోంది. కావలసిన అధ్యాపక, విద్యార్థి నిష్పత్తి 1:20 అని చెప్పేసి పక్క రాష్ట్రంలోంచి తీసుకొచ్చి ఒక్క రోజు చూపించిన తర్వాత, ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే వారికి ఉద్యోగం లేకపోవడం గమనార్హం.
రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎంబీఏ కళాశాలల్లో ప్రిన్సిపాల్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఒక కళాశాలలో ప్రిన్సిపాల్గా పని చేస్తారు, అదే ప్రిన్సిపాల్ ఇక్కడ పనిచేసినట్టు చూపిస్తున్నారు. దీని ద్వారా రెగ్యులర్గా పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతుంది. ఏఐసీటీఈ హ్యాండ్ బుక్ 2018-19 మరియు 2019-20లో పొందుపరిచిన నిబంధనలను యాజమాన్యాలు అతిక్రమించి వారికి ఇష్టం వచ్చిన రీతిలో కళాశాలను ఉద్యోగులు లేకుండా నడిపిస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కళాశాలలు ఎక్కడో హైదరాబాద్ శివారులో ఉంటాయి. అయితే ఆ కళాశాల కార్యకలాపాలన్నీ హైదరాబాద్లో 2 లేదా 3 గదులు అద్దెకు తీసుకొని అక్కడి నుంచే విద్యార్థుల ఫీజులు, అటెండెన్స్, ఇతర అవసరాలకు తగ్గట్టుగా నడుపుతున్నారు. దీనిద్వారా ప్రభుత్వం నుంచి వస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ రూ.27వేలు వృథాగా ఖర్చు అవుతున్నాయి. విద్యార్థికి నాణ్యమైన విద్య అందండం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఉన్న ఒక్కరిద్దరికి కూడా జీతాలు లేవు. యాజమాన్యం మాత్రం 95శాతం లాభం పొందుతుంది. విద్యార్థులకు శూన్యమైన విద్య అందిస్తుంది. తద్వార నిరుద్యోగం పెరుగుతుంది. ఇది భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాద సూచికలా మారింది.
పై అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని ఉద్యోగులకు, విద్యార్థులకు అమలు చేయాలి. దీనిద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించవచ్చు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యనూ అందించవచ్చు.
- ఎ.సంతోష్ కుమార్
సెల్ :9618927732