Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి పరిస్థితుల్లో గ్రంథాలయాల అవసరం తగ్గుతున్నదన్న వాస్తవం ఎవరు కాదనలేనిది. అయినా పుస్తక రచనలు, నవలలు, కథలు, నాటికలు, గేయ రచనలు విరివిగా రాయబడుతున్నాయి. ముద్రించబడుతున్నాయి. దీనికి నిదర్శనం దేశవ్యాప్తంగా బుక్ ఫెయిర్ల ఏర్పాటు ప్రతి సంవత్సరం దేశంలో ఏదో ఒక చోట జరుగుతున్నాయి. సాహిత్య సమావేశాలు, మంచి పుస్తకాలపై సమీక్షలు జరుగుతున్న చోట పుస్తకాల కొనుగోలు పెరుగుతోంది. దీనిని బట్టి మంచి పుస్తకాల చదువరుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఈ మధ్య కల్వకుర్తి పట్టణంలో యాదగిరాచార్య అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయబడింది. రెండు వేల వరకు పుస్తకాల సమీకరణ వీటికి కావలసిన అల్మారాలు, టేబుల్స్, కుర్చీలను దాతలు సమకూర్చారు. స్థానికంగా ఉన్న యూటీఎఫ్ హాలుపై పక్కా భవనం నిర్మించబడింది. ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు, ఇతర దాతల ద్వారా ఆర్థిక సమీకరణ జరిగింది.
ఈ గ్రంథాలయ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన మహానుభావులు, వారు చదువుకుంటున్న రోజులలోనే కల్వకుర్తిలో బీజం పడింది. దీనికి ముఖ్యులు యాదగిరాచార్యులు ( వెల్దండ), సంపత్రావు (తిప్పారెడ్డిపల్లి), డా||జనార్దన్రెడ్డి (తొండ), తిమినోనిపల్లి నారాయణరెడ్డి ఇంకా వీరి స్నేహితుల కృషి వల్ల చదువే రోజులలోనే గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలు సమకూర్చి ఒక గోడ పత్రిక కూడా చేతిరాతతో వెలువడేది. 1956-57 నుండే కల్వకుర్తిలోని ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ముసలయ్య, ఉపాధ్యాయులు యజ్ఞ నారాయణ, బుచ్చయ్య, చెన్నయ్య ప్రోత్సాహంతో పాఠశాల నుండి సంవత్సర వార్షిక పత్రిక 'జ్యోతి' అచ్చు వేయించి ప్రతి విద్యార్థికి అందజేసేవారు. ఇందులో రాయబడే కవితలు, కథలు, వ్యంగ్య రచనలు నాటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రాసేవారు. ఈ జ్యోతి ఆ పాఠశాల విద్యార్థులకు భవిష్యత్తులో అభివృద్ధికి తోడ్పడిందనేది సత్యం. విద్యార్థులలో ప్రధాన పాత్ర యాదగిరాచార్య, సంపత్ రావు, డా||జనార్దన్రెడ్డి. వారు సామాజిక అభివృద్ధి కావాలనేవారు. 1964లో ఒక కథల సంపుటి 'గడ్డి పూలు' ప్రచురించారు. ఇందులో రాయబడ్డ కథలు నేటికీ మనిషిని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. వీరు చదువుకునే రోజులలోనే కల్వకుర్తిలో గ్రంథాలయ స్థాపన జరగాలని పట్టుదలిచారు. చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇతర మేధావుల వద్ద నుండి పుస్తకాలు సమకూర్చి ఒక అద్దె భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కల్వకుర్తిలో కొత్వాల్ వెంకటరాంరెడ్డి తహశీల్దార్గా నిజాం కాలంలో పని చేస్తున్నప్పుడు కల్వకుర్తిలో ఒక పెద్ద క్లబ్ను, గ్రంథాలయ భవనం దాని ముందు గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ తండ్రి నరసింహ్మాదాస్ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి గ్రంథాలయ భవనాన్ని కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాటి విద్యార్థి నాయకులు ఆ భవనంలో తిరిగి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఒకరోజు రాత్రి కాంగ్రెస్ జెండాను, బోర్డును తొలగించి అక్కడే స్థానికగా ఉన్న బావిలో పడవేశారు. అందులో పుస్తకాలను పెట్టి గ్రంథాలయ బోర్డు ఏర్పాటు చేశారు. గ్రంథాలయాన్ని తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుని ప్రహరీ గోడలపై గోడ రాతలు రాశారు. తర్వాత రోజు ఆయన పాఠశాలకు వచ్చి జరిగిన విషయం చెప్పి ఆ విద్యార్థులపై తగిన చర్య తీసుకోవాలంటూ అప్పటి ప్రధానోపాధ్యాయుడు ముసలయ్యపై ఒత్తిడి తెచ్చి ఇందులో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించేలా చేశారు. దీంతో బాధిత విద్యార్థులు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేస్తే వెంటనే అధ్యక్షుడిని పిలిచి ఆ భవనం కాంగ్రెస్ పార్టీదికాదు. గ్రంథాలయం కోసం నిర్మించబడిందని, వెంటనే తిరిగి ప్రధానోపాధ్యాయుడు వెళ్లి చేసిన తప్పును సరి దిద్దుకోవాలని హెచ్చరిస్తే ఆ భవనం తిరిగి గ్రంథాలయానికి అప్పజెప్పబడింది.
ఆనాటి విద్యార్థులు తహశీల్దార్ సహకా రంతో గ్రామాలలో రాత్రి పాఠశాలలు, కొన్ని నూతన పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశారు. గ్రామాలలో రోడ్లు శుభ్రం చేయడంతోపాటు నాటకాల ద్వారా అనేక రకాలుగా ప్రజా చైతన్యానికి కృషి చేశారు. యువకులకు ఆటలపోటీలు నిర్వహించేవారు. నాటకాలు వేసి ఉత్తేజ పరిచేవారు. వీరికి అండగా తహశీల్దార్ మురళీధర్ (వీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్గా పని చేశారు) పూర్తి సహకారం అందించేవారు. వెల్జాల గ్రామంలో ఆటల పోటీలు నిర్వహించి శ్రమదానంతో రోడ్లు వేయించారు. ఆ గ్రామానికి వెళ్లిన విద్యార్థులను అక్కడ కరణం లక్ష్మణరావు బెదిరిస్తే మురళీధర్ తహశీల్దార్గా వెళ్లి తన అండతో వీరితో శ్రమదానం చేయించారు. (వీరు నాగర్కర్నూల్ డిప్యూటీ కలెక్టర్గా, మహబూబ్నగర్లో కలెక్టర్గా పని చేశారు). ఈ గ్రంథాలయానే ప్రభుత్వం తర్వాత శాఖా గ్రంథాలయంగా మార్చింది.
- డి.వెంకట్రెడ్డి
సెల్ : 9490975693