Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునుంచి నిన్నటి నిర్మలమ్మ బడ్జెట్ వరకు కేటాయింపులలో ఆద్యంతం తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి నుంచి ముఖ్యనేతల వరకు నోరు మెదపడంలేదు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉంది టీఆర్ఎస్ నేతల పరిస్థితి. బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్ర వైఖరిపై పార్టీ అధినేతే మాట్లాడేందుకు జంకుతుండటంతో మంత్రులతో పాటు పార్టీ సీనియర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. రాష్ట్రానికి నిరాశ మిగిల్చిన బడ్జెట్పై మాట్లాడకుంటే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలనే భయంతో చిన్నా చితక లీడర్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప గొంతు విప్పి గర్జించడం లేదు. బడ్జెట్లో మా పథకాలనే కాపీ కొట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఒకరిద్దరు నేతలు చంకలు గుద్దుకొని సంతోష పడ్డారే తప్ప బడ్జెట్ తీరును బహిరంగంగా ఎండగట్టే సాహసం చేయలేదు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేంద్రం రాష్ట్రం భాయి భాయి అంటూ మోథీ సంకనెక్కిన కేసిఆర్ ఎన్నికల ముందు ప్లేట్ ఫిరాయించి చేసిన థర్డ్ ఫంట్ రాజకీయానికి బీజేపీ బదులు తీర్చుకుంటున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద మంత్రిగా ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలు ఎక్కడ మెడకు చుట్టుకుంటాయేమోననే భయంతోనే అగ్రనేత నోరు పెగలట్లేదని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కీలెరిగి వాత పెట్టడంలో మాస్టర్ డిగ్రీ చేసిన మోడీతో వైరం మొదటికే మోసమౌతుందని కేసీఆర్కు తెలియక పోదు.
- ప్రియకుమార్