Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా ఆన్లైన్ విధానంలో డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. కానీ ఆన్లైన్ విధానంపై విద్యార్థులెవరూ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ విధానంలో నాలుగు అతి ముఖ్యమైన కోర్సులను ప్రవేశపెట్టారు. వాటిలో సమాజం నిర్మితి, సామాజిక సమస్యలను అధ్యాయనం చేసే సామాజిక శాస్త్రం, మానసిక సమస్యలను మనో విజ్ఞాన సిద్ధాంతాలను అధ్యాయనం చేసే సైకాలజి, భౌగోళిక పరిస్థితులను అధ్యాయనం చేసే జాగ్రఫీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం వంటి సమాజానికి ఉపయోగపడే.. నేటి కాలానుగుణంగా అధ్యాయనం చేయాల్సిన అతి ముఖ్యమైన కోర్సులను ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. ఈ ఆన్లైన్ కోర్సులున్నాయని డిగ్రీ విద్యార్థులకు మూడో దఫా కౌన్సెలింగ్ వచ్చే వరకు కూడా తెలియకపోవడం వల్ల ఆన్లైన్ కోర్సులను దోస్త్ కౌన్సెలింగ్లో విద్యార్థులు ఎంచుకోలేదు. దీనివల్ల ఈ కోర్సుల్లో ఉన్న అన్ని సీట్లు మిగిలిపోయాయి. ఉన్నత విద్యా మండలి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే ఆన్లైన్ కోర్సుల ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సింది. కానీ మూడో దఫా చివరి దశలో ఈ ఆన్లైన్ కోర్సులు ఉన్నాయని చెప్తే విద్యార్థులు ఎలా జాయిన్ అవుతారని అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్న మొత్తం డిగ్రీ కళాశాలల్లో సీట్లు సగంకంటే తక్కువే భర్తీ కావటంపై విద్యార్థులు డిగ్రీపై ఆనాసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతేడాది నుంచి డిగ్రీ కోర్సులో వివిధ కాంబినేషన్లలో నూతన కోర్సులు, అనేక మార్పులు చేసినా విద్యార్థులు ఎందుకు ప్రవేశాలు తీసుకోవడం లేదో అర్థం కాని సమస్య. దీనిపై ఆయా వర్సిటీల ఆచార్యులు కూడా ఆలోచించాలి. మన రాష్ట్రంలో మొత్తం 984 డిగ్రీ కళాశాలలుంటే అందులో 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. మొత్తంగా 3,86,204 సీట్లు ఉంటే మూడు విడతల్లో జరిగిన దోస్త్ కౌన్సెలింగ్లో 1,19,098 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 2,67,106 సీట్లు మిగిలిపోయాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మొదటి ప్రాధాన్యత ఇ స్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 47,487 సీట్లు భర్తీ కాగా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 32,198 సీట్లు నిండాయి. శాతవాహన యూనివర్సిటీలో 14,392 సీట్లు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో 9,683 సీట్లు, పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 9,011 సీట్లు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 6,321 సీట్లలో విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. నేటి ఆధునిక కాలంలో డిగ్రీ విద్య ఉపాధి అవకాశాలు చూపెట్టడం లేదని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారని విద్యావే త్తల అంచన. ఆన్లైన్ కోర్సుల విషయంలో విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి అవగాహన కల్పించకపోవడం వల్ల ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలు జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్ విధానంలో అధ్యాపకులు పాఠాలను ఆన్లైన్ మోడ్లో బోధిస్తారు. విద్యార్థులకు కావలసిన మెటీరియల్ కూడా ఆన్లైన్లో పొందుపరుస్తారు, ఎంచుకున్న కళాశాలలో ఆన్ లైన్లో తరగతులు వినాల్సి ఉంటుంది. సెమిస్టర్ పూర్తయ్యాక పరీక్షల్ని ఆన్లైన్లో గాని ఆఫ్లైన్లో గాని రాయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'స్వయం ఆన్లైన్ పోర్టల్' కోర్సులపై గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఇంకా అవగాహన రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా ఉత్తర భారత విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ కోర్సులో ప్రవేశాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో ఆన్లైన్ స్వయం పోర్టల్ ద్వారా విశ్వవిద్యాలయాలు కూడా స్వల్పకాలిక కోర్సులను ఆఫర్ చేస్తుంటే విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఉచిత ప్రవేశాలు తీసుకోవడం లేదు. యూనివర్సిటీ విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోతే ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ఈ ఆన్లైన్ కోర్సులపై ఎలా అవగాహన ఉంటుందో అధికారులు ఆలోచించాలి. ఆన్లైన్ ఆయా సబ్జెక్టులలో నిపుణులైన అభ్యర్థులను సంబంధిత కళాశాలలో కోఆర్డినేటర్లుగా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో ఆన్లైన్ విధానం వల్ల జరిగే ప్రయోజనాలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వారు ప్రవేశాలు తీసుకోవడానికి ముందడుగు వేస్తారు. ఆన్లైన్ కోర్సులను నిర్వహించడం ద్వారా రెగ్యులర్ మోడల్ విధానం వల్లే అధ్యాపకుల నియామకాలు ఉండవు. దీనివల్ల ఆయా సబక్ట్లో పట్టభద్రులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువే కాబట్టి ప్రతి కళాశాలలో ఆన్లైన్లో నిర్వహిస్తున్న కోర్సులకు ఒక పూర్తిస్థాయి కోఆర్డినేటర్ను నియమిస్తే వాటి నిర్వహణ బాగా జరిగి మంచి ఫలితాలు వస్తాయి. వచ్చే ఏడాదైనా ఉన్నత విద్యా మండలి అధికారులు ఆన్లైన్ విధానంపై భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి అందరికీ తెలియజేస్తే మంచి ఫలితాలొస్తాయి. డిమాండ్ ఉన్న కోర్సులను ఆన్లైన్లో ప్రవేశపెట్టడం వల్ల వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి ఆఫ్లైన్ విధానంలో కూడా ప్రవేశపెడితే విద్యార్థులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వనరులను అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెంటనే ఏర్పాటు చేయాలి. అప్పుడే ఆన్లైన్ విధానం విజయవంతమవుతుంది.
- కందగట్ల శ్రవణ్ కుమార్
సెల్ : 8297446676