Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేశంలో ముస్లిం కుటుంబాల్లోని మహిళలను రోడ్లమీదకి తీసుకొచ్చి అత్యాచారాలు చేయండి.. అవసరమైతే హిందూ పురుషులు బృందాలుగా ఏర్పాటు కావాలి' అంటూ... బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు రామ్కోలా సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఈమె ఒక్కరే కాదు.. గతంలోనూ ముగ్గురు పురుషులతో ఆటోలో వెళ్తే రేప్ జరగక పోతే ఏమవుతుందంటూ మరో మహిళా సాధ్వీమణి సెలవిచ్చారు. చిన్నపిల్లలపైన లైంగికదాడులు జరిగిన ఘటనల్లో బీజేపీ పురుష నాయకులు నిందితుల పక్షాన పోరాడినందుకు ప్రతిఫలంగా మంత్రి పదవులు దక్కిన విషయాన్ని ఈ దేశ ప్రజలు మరిచిపోలేదు. లైంగికదాడులు చేయాలంటూ పిలుపునిస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళల అనుమతి లేకుండానే లైంగికదాడులు జరుగుతున్నాయా.. అంటూ కూడా వారే ప్రశ్నిస్తున్నారు. లైంగికదాడికి గురైనప్పుడు స్త్రీలు ఎలాంటి క్షోభకు గురవుతారో... శారీరకంగా, మానసికంగా దుర్భరంగా సాగే ఆ రాక్షస క్రీడను ప్రోత్సహించే వ్యాఖ్యలు స్త్రీలే చేస్తున్న దుర్మార్గం వారిని అంతకుమించి క్షోభకు గురిచేస్తోంది. ఈ మధ్య కాలంలో నెలలు నిండిన పసిపిల్లలపై, పదేండ్లలోపు వయసున్న చిన్నారులపై లైంగికదాడుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితులను ఉరి తీయడమే సరైన శిక్ష అనిభావించడం కూడా ఒక మానసిక ఉద్వేగ పరిష్కారంగా తోస్తోంది. కారణం.. చాలామంది సోషల్ మీడియా మేధావులు, ఆందోళనకారులు పేర్కొన్నట్టే... ముస్లిం దేశాలతోపాటు పలు ప్రాంతాల్లో లైంగికదాడులు, హత్యలకు పాల్పడినవారి మర్మాంగాల నిర్మూలన, బహిరంగ ప్రదేశాల్లో ఉరితీయడం, గొంతు కోయడం వంటివి చేస్తున్నారు. అయితే ఇక్కడ మరిచిపోకూడని అంశం ఏమిటంటే.. ఎన్నో తరాలుగా ఆ శిక్షలను అమలు చేస్తున్న ఆయా దేశాల్లో నేడు కూడా హత్యలు, మహిళలపై లైంగిక దాడులు జరగడం ఆగిపోలేదు కదా.. అంటే బాధితులకు మానసిక సంతృప్తి, ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతున్నాయి. నేరం చేసిన వాడికి శిక్షగా మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి తప్ప తదుపరి నేరాలు జరిగేందుకు అవకాశం లేదని ఎవరూ నిక్కచ్చిగా చెప్పలేరు.
నిజానికి శిక్షాస్మృతి, చట్టాలు, శిక్షల వంటి వాటి లక్ష్యం నేరానికి పాల్పడిన వారిలో పరివర్తన తేవడం, వారిలో హింస ప్రవృత్తిని నిర్మూలించడమే కానీ వారిని నిర్మూలించడం కాదు. నేరాలకు పాల్పడిన వారిని నిర్మూలించినంత మాత్రాన ఆ నేరం మళ్లీ జరగదని చెప్పడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేదు. మనదేశంలో స్త్రీలు పూజించబడుతారు.. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో... అక్కడ దేవతలు కొలువై ఉంటారు వంటి హితోక్తులు కోకొల్లలు.. స్త్రీలను, పిల్లలను దేవతలుగా కొలిచే దేశంలో నిత్యం లైంగిక దాడులు చోటు చేసుకుంటుండటం బాధాకరం. రాజకీయ అవసరాలు, అనుచరులను కాపాడుకునేందుకు రాజకీయ నాయకులు ఇలాంటి దుర్ఘటనల్లో నిందితుల పక్షాన మాట్లాడుతున్నారనుకుందాం.. మరి చిన్నపిల్లలపైనా, సొంత కూతుళ్లపైనా తండ్రులు లైంగికదాడులకు పాల్పడుతుండటం దేనికి సంకేతం. అధికార పార్టీ చేపడుతున్న చర్యల గురించి చర్చను పక్కకు పెడితే.. సమాజంలో గుర్తింపు కలిగిన మహిళలు స్వయంగా లైంగిక దాడులు చేయాలని పిలుపునిస్తున్నారు. అవసరమైతే పురుషులు గురపులుగా ఏర్పడాలని సలహా ఇస్తున్నారు. ఒక స్త్రీ పక్కన ముగ్గురు పురుషులు ఉంటే రేప్ జరగాల్సిందేననే సూత్రీకరణ.. ఎలాంటి సంకేతాలను పంపిస్తోందో ఆలోచించాలి. కఠినమైన శిక్షలతో భయం కలిగించడం ద్వారా కొంత వరకు నేర నివారణ చేసేందుకు అవకాశం ఉండవచ్చు. జైళ్లలో శిక్ష అనుభవించిన వారిలో పరివర్తన వచ్చి మంచితనంతో బతుకుతున్న వారు ఉన్నారు. చిన్నారులపై లైంగికదాడుల ఘటనల్లో, మహిళలపై దాడుల విషయంలోనూ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కఠినమైన శిక్షలు లేనందుకు జరుగుతున్నవి కావు.. మనుషుల్లో అంతరిస్తున్న మానవత్వం, మందగిస్తున్న మనిషి మెదడు.. కోల్పోతున్న విచక్షణ జ్ఞానానికి ఇవి తార్కాణాలు.. సామాజిక పరివర్తన, ఆలోచనల్లో మార్పు ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యపడుతుంది. అలాంటి ప్రయత్నాలేవీ ప్రభుత్వాలు చేపట్టవు. సాధారణ సూత్రీకరణలో చెప్పాలంటే.. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది.. అప్పుడే ఎవరైనా దూరంగా ఉంటారు... అలాగే నేరాలకు కఠినమైన శిక్షలు వేస్తే సరి అని.. మేధావులు వాదించవచ్చు.. అయితే ఒకసారి కాలినవాడు ముట్టు కోకపోవచ్చు. బాల్యంలో జరిగే ఈ ఘటనలో మరో చిన్నారి నిప్పుకు ఆకర్షితుడై ముట్టుకునే ప్రయత్నం చేయకుండా ఉండడు కదా.. కాబట్టి మనం ఎదుగుదలలో ఉన్నపుడే నిప్పు సహజ లక్షణాన్ని వివరించడం ద్వారా అలాంటివి నివారించవచ్చు. అలాగే సమాజంలో ఎదుగుతున్న కొత్త తరానికి మానసిక శిక్షణ, సంఘజీవిగా బాధ్యతలు ఎరిగి ప్రవర్తించడం, సాటి మనుషులతో వ్యవహరించే విధానాలపై శిక్షణనివ్వడం ద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు.. లైంగికదాడులు, హత్యలు లేని ఒక సమూహాన్ని ఏర్పరవచ్చు.. ఇది ప్రభుత్వ బాధ్యత కాదు అని వాదించే ప్రయత్నం చేయకండి.. ఒక వేళ ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టినా లక్ష్యం చేరేందుకు అవకాశం లేదనే ఆలోచనల్లో వాస్తవం లేదు. ఎందుకంటే ఒకప్పుడు గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న నాటుసారాను నివారించింది ప్రభుత్వాలే.. వాటి స్థానాల్లో బెల్టు షాపులను, వైన్స్లను చేరువ చేసింది ప్రభుత్వాలే.. ఊరురా ప్రచారం చేయడం ద్వారా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం వంటి చర్యలు చేపట్టింది వారే.. వితంతు వివాహాలు నివారించడంలో కీలకంగా వ్యవహరించింది ప్రభుత్వాలే.. ప్రయోజనాల మాట ఎలా ఉన్నా.. సామాజిక పురోభివృద్ధిలో ప్రభుత్వం తన బాధ్యతను పలు సందర్భా ల్లో నిర్వహిస్తూ వస్తున్న విషయం వాస్తవం.. కాబట్టి ఆ బాధ్యత, అనుభవం ప్రభుత్వాల పరిధిలో ఉన్నది. ఆ దిశగా సమాజంలో లైంగిక దాడులు, హింసా ప్రవృత్తికి వ్యతిరేకంగా సహృద్భావ సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఈ కాలంలో ఏర్పడింది. ప్రభుత్వాలు, సామాజిక పరిపక్వత కలిగిన మేధావులు, సంస్థలు ఆ బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
- వంగాల రమేష్
సెల్ : 9490099115