Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేచ్ఛ లేని జీవితం కారాగారం వంటిది అని మార్విన్ అన్నారు. భగత్సింగ్ జైల్లో ఉన్నప్పుడు తన చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు అడిగితే 'మరొక జన్మంటూ ఉంటే ఈ గడ్డపై జన్మించి భరతమాత దాస్య శృంఖలాలు విడిపించడం కోసం ఇలాంటి ఉరి శిక్షలు ఎన్నైనా అనుభవిస్తానని' చెప్పారు. భారత ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం ముఖ్యం అని చెప్పాడు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ఎందరో మహనీయుల్లో ఒకరు.. నెల్సన్ మండేలా..
'స్వేచ్ఛ అనేది జీవుల జన్మ హక్కు, నా ప్రజల జన్మ హక్కుల కోసం, నన్ను కన్న నా నేలపై నా రక్తం వర్షిస్తుంది, అది రేపటి భవిష్యత్కు బాటలు వేస్తుంది' అని ప్రకటించారు నెల్సన్ మండేలా. 27 ఏండ్ల జీవితం జైలులో గడిపి తన ప్రజలకు స్వేచ్ఛ సాధించిపెట్టిన భారతరత్న నెల్సన్ మండేలాను ప్రపంచ ప్రజలంతా నల్లజాతి సూరీడుగా కొనియాడుతారు. ఆయన చూపిన వెలుతురు స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రజలకు బహుమానం.
ఆఫ్రికా జాతి నల్ల సూరీడుగా పేరొందిన నెల్సన్ మండేలా 1918 జులై 18న జన్మించారు. నల్లవారు అనే కారణం చేత నల్లజాతి వారికి హక్కులు లభించకపోవడాన్ని గమనించాడు. ఆ హక్కుల సాధనే లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. వర్ణం, మతం, కులం తదితర కారణాలతో హక్కుల హరణాన్ని ఖండించాడు. తెల్లవారితో సమానంగా నల్లవారికీ హక్కులు ఇచ్చినప్పుడే తాను ఆ కళాశాల(హెన్రీ)లో చదు వుకుంటానని చెప్పి, కళాశాల నుంచి బయటకు వెళ్లాడు. తాను ఇక ఆ కళాశాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
కఠిన కారాగారంలో ఇబ్బందులు పడే బదులు సాయుధ పోరాటాన్ని ఆపేస్తే నిన్ను విడిచిపెడతామని నెల్సన్ మండేలాకు జైలు అధికారులు చెప్పారు. కాని అందుకు మండేలా ఒప్పుకోలేదు. 27 ఏండ్లు ఆరు అడుగుల నెల్సన్ మండేలా ఐదడుగుల సెల్లో ఉండి (రాబిన్ ద్వీపం) 'ఏ లాంగ్ వాక్టు ఫ్రీడమ్' పేరుతో తన ప్రజలకు సందేశాలు రచించాడు. తన ఆటో బయోగ్రఫీలో 'ఏ లాంగ్ వాక్టు ఫ్రీడమ్' లో సాయుధ పోరాటాల గురించి, శాంతి గురించి అద్భుతంగా అభివర్ణించారు. మండేలా జైల్లో ఉన్నప్పుడు బెంబ్లిన్ మెరాయిన్కింగ్ అనే యువకుడు మండేలాను అడిగాడు. ఈ జైల్లోనే మీరు మరణిస్తే.. ఎలా..? అని. అందుకు మండేలా 'నన్ను కన్న నా నేలపై నా రక్తం వర్షిస్తుంది. అది రేపటి భవిష్యత్కు బాటలు వేస్తుంది' అని చెప్పాడు. ఆయన ఆకాంక్ష నెరవేరింది. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం 1990 ఫిబ్రవరి11న స్వాతంత్య్రం ప్రకటించింది. మండేలా గాంధేయ వాది. గాంధేయ మార్గంలోనే సాయుధ పోరాటం చేయాలని తన కార్యకర్తలను ఆదేశించారు. మండేలా స్ఫూర్తితో నేడు జాత్యహంకార ధోరణులను వ్యతిరేకించాల్సిన సందర్భం. కులం, మతం, వర్ణం పేరుతో దాడులు పెట్రేగుతున్న దుస్థితి. గుండెలు 'మండేలా' అసహన ధోరణలు పెరుగుతున్నాయి. మహాత్మ గాంధీ, మండేలాల స్ఫూర్తితో జాత్యహంకార ధోరణులను నిరసించే ప్రజాస్వామికవాదులు ఏకం అవ్వాలి. స్వేచ్ఛ స్వాతంత్య్రాలు సిద్ధింపజేయాలి.
- అంబీర్ శ్రీకాంత్
సెల్: 8185968059