Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడి తన చలన వేగాన్ని పెంచుకునేందుకు నిత్యం కొత్త దారులు తొక్కుతూనే ఉంటుంది. దాని గమనానికి హద్దులుండవు. కొత్త ఎత్తులకు పరిమితలూ ఉండవు. అది ఇతరులను దోపిడీ చేయటమే కాదు, తనను తాను మోసం చేసుకోవడానికీ వెనుకాడదు. పెరగడం దాని లక్ష్యం. ఈ విషయాలను అనేక సందర్భాల్లో మనం వివరించుకున్నాం. ఈ రోజు పెట్టుబడి కేంద్రీకరణతో ఏర్పడే జాయింట్ స్టాక్ కంపెనీల, గుత్త సంస్థల పరిణామాల గురించీ పెట్టు బడిదారీ రూపాల మా ర్పుల గురించీ కొం త పరిశీలిద్దాం.
పరపతి వ్యవస్థలో పెట్టు బడి కేంద్రీకరణ, విస్తర ణ జరుగుతుందని మనం చూశాం. పెట్టుబడి తనకున్న స్వేచ్ఛను కూడా తాను రద్దు చేసుకొని ఎదిగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎదగటానికి వేసే అన్ని ఎత్తులూ జిత్తులూ తన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయనే విషయం దానికి పట్టదు. మనం ఇప్పటి వరకు పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్లానింగ్ రహిత ఉత్పత్తి జర గడం వల్ల విపరీతమైన ఉత్పత్తి పెరిగి, సరుకులు మార్కెట్ను ముంచెత్తుతాయని చెప్పుకున్నాం. దాన్ని మార్కెట్లో కొనేవారు లేక సంక్షోభాలు వస్తాయని వివరించాము. కానీ పెట్టుబడిదారు లకు కూడా ప్లానింగ్ ఉంటుంది. అది ఎలా ఎక్కువ దోచుకోవాల న్నదాని కోసం చేసే ప్లానింగ్. అందులో భాగంగా ఏర్పడినవే జా యింట్ స్టాక్ కంపెనీలు. మరి ఈ జాయింట్ స్టాక్ కంపెనీలంటే ఏమిటి? ఎవరికి వారే పెట్టుబడిదారులు స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్టు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు నెలకొల్పి ఉత్పత్తి కొనసా గిస్తూ అదనపు విలువను పొందుతుంటారు. ఇలాంటి వారు మ రొకరు అదే వస్తువును ఉత్పత్తి చేస్తూ పోటీగా నిలుస్తారు. తమలో తమకు ఉన్న ఈ పోటీని నివారించుకోవటానికి ఒక ఆలోచనతో ఒప్పందానికి వస్తారు. ఉదాహరణకు పది రకాల చెప్పుల కంపెనీలున్నాయనుకోండి. ఇవన్నీ ఒకే రకమైన పరిశ్రమకు సంబంధించిన వివిధ సంస్థలు. ఈ అందరూ కలిసి మాట్లాడుకుని, తమ సరుకుల ధరలను ఒకే విధంగా ఎక్కువ ధరకు అమ్మేట్లు ఒడంబడికకు వస్తారు. అంటే తమలో తాము పోటీ పడి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ధరకు అమ్మకుండా జాగ్రత్త పడతారు. ఇలా కూడబలుక్కుని అన్ని పరిశ్రమలనూ కలుపుకుని జాయింట్ స్టాక్ కంపెనీగానో ట్రస్టుగానో, కార్పెల్గానో పేరు పెట్టుకుంటారు. కొన్ని సంస్థలు ఇంకా ఎక్కువగా దోస్తీ చేసి, అవి కొనే ముడి సరుకులలోనూ, తయారు చేసి అమ్మే సరుకులలోనూ జాయింట్ వ్యాపారం చేస్తాయి. ఉత్పత్తి దేనిది దానిదే. కానీ ముడి సరుకులు అమ్మకం విషయంలో మాత్రం జాయింట్గా జరుగుతుంది. ఇలాంటి వాటిని సిండికేటు అంటారు. ఇక విడివిడిగా ఉండే వివిధ సంస్థలూ పూర్తిగా కలిసిపోయి, సంస్థల యజమానుల ట్రస్టులో వాటాదార్లు అవుతాయి. ఇందులో యజమానులైన వారందరూ సాధారణ మేనేజిమెంటు ద్వారా వ్యవహారాలు నడుపుతారు.
ఇంకో విషయమేమంటే ఉదాహరణకు బొగ్గు గనుల సంస్థలు బొగ్గు ధరలను పెంచి అమ్ముతాయి. లోహాన్ని ఉత్పత్తి చేసే సంస్థలకు బొగ్గు అవసరంగా ఉంటుంది. ఈ లోహ పరిశ్రమల యజమానులు తమకే సొంత బొగ్గు గనులు ఉండాలని కోరుకుంటారు. ఇలా ఆ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుని అన్నీ కలిసి ఒకే సంస్థగా ఏర్పడతాయి. అప్పుడు ఒకే సంస్థ రెండింటి లాభాలను పంచుకుంటుంది. ఇవే గుత్త సంస్థలుగా, జాయింట్ స్టాకు కంపెనీలుగా పరిశ్రమల మధ్య సంబంధాలు కలిగి కేంద్రీకృతమవుతాయి. ఇతర సంస్థలలో పెట్టుబడి వాటాలను కొనడం ద్వారా వాటిపై కంట్రోలింగ్ కలిగి ఆధిపత్యం వహిస్తాయి. అనేక పరిశ్రమలు కలిసి ఒక సంస్థగా మారినప్పుడు, ఆ సంస్థ నడిపేందుకు కావలసిన పెట్టుబడిని వాటాల రూపంలో పెట్టుబడిదారులు విక్రయిస్తారు. చిన్న చిన్న పెట్టుబడిదారులు, ఉద్యోగులు, డబ్బు పెట్టుబడిదారులు, మధ్య తరగతి ప్రజలు వాటాలను కొని గుత్త పెట్టుబడిదారులకు పెట్టుబడిని సమకూరుస్తారు. అయితే అధిక మొత్తం పెట్టుబడి కలిగిన వారు మాత్రమే సంస్థపై ఆధిపత్యం కలిగి ఉంటారు.
స్వేచ్ఛగా పోటీ పడటం పోయి, పెట్టుబడి గుత్త సంస్థలు ఏర్పడటం సామ్రాజ్యవాద శకంలోని ప్రధాన గుణం. స్వేచ్ఛా పోటీని నాశనం చేసి సరుకుల మొత్తం ఉత్పత్తిపై ఆధిపత్యాన్ని సంపాదించే ప్రయత్నం గుత్త సంస్థలు చేస్తాయి. ఇవి జన సామాన్యాన్ని మరింత దోచుకోవటానికి అవకాశాలు కలిగిస్తాయి. గుత్త సంస్థలు ఏర్పడటం వ లన పెట్టుబడి దారుల మధ్య పోటీ తగ్గదు. మరింత ఎత్తున పోటీ పెరుగుతుంది. పెట్టుబడిదారుల మధ్య పోటీ పోయి పెట్టుబడి సంఘాల మధ్య గుత్త సంస్థల మధ్య పోటీ మొదలవుతుంది. ఈ సంస్థలలో చేరని సంస్థలను నాశనం చేయటానికి గుత్త సంస్థలు ప్రయత్నిస్తాయి. అంతేకాదు గుత్త సంస్థలు తాము అమ్ముకునే సరుకుల కోసం మార్కెట్లను అంటే దేశాలను పంచుకుంటాయి కూడా. దేశాల వారిగా, ప్రాంతాల వారిగా మార్కెట్ల పంపకాలు జరుగుతాయి. వీటి తగాదాల్లోనే యుద్ధాలు తలెత్తుతాయి.
స్టాక్ మార్కెట్లు రూపొందించిన తర్వాత పెట్టుబడిదారులు ఎవరెంత స్టాకును (వాటాను) కలిగి ఉన్నారో ఆ క్రమాన్ని బట్టి లాభాలు వస్తుంటాయి. పేరుకు వాటాదార్ల సమావేశం ప్రధాన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ వాస్తవానికి ఎక్కు వ వాటాలున్న పెట్టుబడిదారులే ఆధిపత్యం వహిస్తారు.
ఈ దశలో సామాజిక వి ధానంపై ఆధారపడిన వ్యక్తిగత పెట్టుబడి, సామాజిక పెట్టుబడి గా రూపాన్ని సంతరించుకుం టుంది. పెట్టుబడిని కూడా వాటాల విక్రయం ద్వారా సమీకరించి కేంద్రీక రిస్తుంది. అంటే పెట్టుబడి కూడా సామాజికతను పొందుతుంది. ఇది ప్రయివేటు పెట్టుబడికంటే భిన్నమైన రూపం. దీని కార్యకలాపాలు కూడా భిన్నంగా రూపొందు తాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి చట్రంలోనే సొంత ఆస్తిగా పెట్టుబడిని రద్దు చేయటమే ఇది. వాస్తవంగా పని చేసే పెట్టుబడిదారున్ని కేవలం మేనేజరుగా ఇతరుల పెట్టుబడి యొక్క నిర్వాహకునిగా కేవలం డబ్బు పెట్టుబడిదారునిగా మారుస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే పెట్టుబడి దారీ విధానాన్ని రద్దు చేయటమంటే ఇదే. ఇది ఒక కొత్త ఉత్పత్తి రూపానికి పరివర్తనా దశను సూచిస్తుంది. కొన్ని రంగాలలో గుత్తాధిపత్యాన్ని ఏర్పర్చి తద్వారా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతుంది. ఒక కొత్త ఆర్థిక ప్రభుత్వ వర్గాన్ని అది పునరుత్పత్తి చేస్తుంది. ప్రమోటర్లు, సట్టా వ్యాపారులు, నామమాత్రమైన డైరెక్టర్ల రూపంలో కొత్త రకం పరాన్నభుక్కుల్ని సృష్టిస్తుంది. కార్పొరేషన్ ప్రమోషన్ ద్వారా స్టాక్ విడుదల ద్వారా, సట్టా వ్యాపారం ద్వారా వంచన దగాల యావత్తు వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది ప్రయివేటు ఆస్తి ఆజమాయిషీ లేని ప్రయివేటు ఉత్పత్తి.
ఇక్కడ సట్టా వ్యాపారం చేసే టోకు వ్యాపారి ఒడ్డుతోంది తన పెట్టుబడిని కాదు. అది సామాజిక పెట్టుబడిని మాత్రమే. పెట్టుబడి పుట్టుకకు పొదుపు చేయటమే ప్రధాన మన్న సూక్తి నీచార్థాన్ని సంతరించు కుంటుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడిదారుడు డిమాండ్ చేస్తున్నది ఇతరులు తన కోసం పొదుపు చేయాలని మాత్రమే. ఆ విధంగా సామాజిక పెట్టుబ డి కేంద్రీకరణకు గురై స్వాహా చేయబడుతుంది. చిన్న, మధ్య తరగతి పెట్టుబడిదారులు కూడా ఈ స్వాహాకు గురవుతారు. మొత్తం వ్యక్తులందరి ఉత్పత్తి సాధనాలను స్వాహా చేయటమే తన లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇక్కడ ఆస్తి అన్నది స్టాక్ రూపంలో ( వాటా రూపం) ఉండటం వలన దాని చలనమూ, బదిలీ అన్నవి కేవలం స్టాక్ ఎక్సేంజీలో జూదం ఫలితంగా మారుతాయి. అక్కడ చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగుతాయి. గొర్రెల్ని స్టాక్ ఎక్సేంజీ తోడేళ్లు మింగుతాయి. ఇది ఇతరుల శ్రమ దోపిడీ ద్వారా పెట్టుబడిదారీ ఉత్పత్తిని జూదం, దగాలతో కూడిన శుద్ధమైన భారీ రూపంగా అభివృద్ధి పరుస్తుంది. సామాజిక సంపదను దోపిడీ చేసేవారి సంఖ్యను రానురాను మరింతగా తగ్గిస్తుంది. అంటే దోపిడీని తగ్గించడమని కాదు. ఎక్కువ మంది దోపిడీ చేసే క్రమాన్ని కొద్ది మంది మాత్రమే చేసేట్లు చేయడం. కేంద్రీకృత దోపిడీ... దీన్నే మనం ప్రపంచీ కరణ, ఆధునిక సా మ్రాజ్య వాదమని చెప్పుకుంటున్నాం.
సాధారణ పెట్టుబ డిదారీ విధానానికి భిన్నంగా ఈ గుత్త పెట్టుబడిదారీ పద్ధతి వల్ల, మరియు స్టాక్ కంపెనీలు, బ్యాంకుల డబ్బు పెట్టుబడీ కేంద్రీకృతమై, జరుగుతున్న ఉత్పత్తితో ఉత్పత్తి శక్తులు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది ప్రపంచ మార్కెట్నూ వేగవంతం చేస్తుంది. అదే సమయంలో ఈ వ్యవస్థ వైరుధ్యం యొక్క విస్పోటనాన్ని కూడా సంక్షోభాన్ని కూడా త్వరితం చేస్తుంది. దీని దాడి, విధ్వంసాలను ఎదుర్కోవాలంటే, దోపిడీ, పీడనకు గురవుతున్న అన్ని రకాల శక్తులు ఏకం కావాల్సిన అవసరం పెరుగుతుంది. కానీ భావజాల, సాంస్కృతిక రంగంలో ఈ గుత్త పెట్టుబడిదారీ ప్రపంచీకరణకు అనుకూలమైన వాతావరణాన్ని పెంచేందుకు అవి పూనుకుంటున్నాయి. ప్రజలు ప్రాంతాలుగా, కుల, మత, జాతి, భేదాల ప్రాతిపదికన విడిపోయి తమతో తాము వైరుధ్యంతో వ్యవహరించే ఆలోచనలను పెంచి పోషిస్తున్నవి. దీన్ని అవగతం చేసుకుని శ్రామిక జన శక్తులను సంఘటిత శక్తిగా చేయడమే మన పనిగా ఉండాలి.
- ఆనందాచారి
సెల్ : 9948787660