Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానాన్ని వెలిగించే వాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది అని అర్థం. అలాంటి గురువును ఎంతో గౌరవించే నేల మనది. చాణక్యుని చేతిలో చంద్రగుప్త మౌర్యుడు, రామదాసు చేతిలో ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస చేతిలో వివేకానందుడు, గోపాలకృష్ణ గోఖలే చేతిలో మహాత్మా గాంధీ, స్వామి హరిదాసు చేతిలో తాన్సేన్ జి.హెచ్ హార్టీ నుండి శ్రీనివాస రామానుజన్, శ్రీనివాస కాలే నుండి శంకర మహాసేనన్, ద్రోణాచార్యుని నుండి అర్జునుడు, ఆచార్య వేద విశ్వకర్మ నుండి అశోకుడు మొదలగు అత్యద్భుత గురువులు తమ శిష్యులను తమకన్నా ప్రచండ శక్తులుగా తయారుచేసిన భూమి భారతదేశం...
ప్రతిభ ఉన్న విద్యార్థులను సానపెడుతూనే తరగతి గదిలో బలహీనమైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ నారలో తన మేధస్సుతో, జ్ఞానంతో జ్ఞాన జ్యోతులు వెలిగించడమే 'గురువు' పని... సహనం, క్షమ, లాలన, పాలన, సాధికారతతో స్వప్రయోజనం కన్నా విద్యార్థి ప్రయోజనమే ముఖ్యమని ప్రతీక్షణం తపించే వారే గురువులు. తమ శిష్యులు ప్రపంచ గమనంలో అద్భుతంగా రాణిస్తుంటే మహదానందం పొందే పసి హృదయాలు గురువులు... కేవలం దేశ ఔన్నత్యం కోసం దేశ భవిష్యత్తు కోసం సమర్థులైన శిష్య బృందాలను తయారు చేసేందుకు వారి ప్రథమ కర్తగా భావిస్తాం... ''ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. ఆధారం అ యిన దారం గురువు''... అన్నట్టు గాలిపటంలా శిష్యుడు అత్యున్నత స్థితికి చేరుకో వడానికి ఆధార భూతమైన దారంలా గురువు అనునిత్యం పాటు పడతాడు... ఆధునిక కాలంలో 'గురువు' అనే పదానికి ఎటువంటి గౌరవం లభిస్తోంది. తరగతి గది ఒక అద్భుత ప్రయోగశాల అనుకునే గురు పరంపర మృగ్యమై పోయింది. విద్యావ్యవస్థలోని అన్ని అంశాలు వ్యాపార ధోరణికి ఆలవాలమై 'కార్పొరేట్ల' వ్యాపార సంస్థలుగా మారిపోయాక 'గురువు' అనే శబ్దం వేగంగా సమాజం నుండి కనుమరుగవుతోంది. అ, ఆ లు నేర్చుకోవడానికి 'లక్షలు' చెల్లించాలని మనం ఎప్పుడైనా అనుకున్నామా? తొలి గురువైన అమ్మ ఒడిలోనే పెద్దబాల శిక్షను కంఠతా పట్టిన మనం నేడు మన తరువాతి తరానికి నేర్పించే జ్ఞానం లేక, ఓపిక లేక ముక్కుపచ్చలారని బిడ్డలను 'డే' కేర్, 'ప్లే స్కూల్' పేరుతో లక్షలు చెల్లించి ఏం నేర్పిస్తున్నామో ఆలోచించాలి. ధనార్జనే పరమావధిగా మార్చుకుని 'దేశ భవిష్యత్తు'ను బలిపెడుతున్నారు. ఈ పరిస్థితిని ప్రతి తల్లి తండ్రి హృదయంతో ఆలోచించాలి. మూడు సంవత్సరాలు కూడా నిండని పసివాళ్లపై జాతీయ, అంత ర్జాతీయ, ఐఐటీ సిలబస్ పేర్లతో బండెడు పుస్తకాలతో దాడి చేస్తూ వారికి చదువు అంటే కర్మాగారాల్లో తయారయ్యే వస్తువుగా ప్రదర్శింపజేయడం దు:ఖాన్ని కలిగి స్తోంది. వ్యక్తిత్వ వికాసం, మనోవికాసం, బహుముఖ ప్రజ్ఞ అనేవి ఒక విద్యార్థిని తీర్చిదిద్దే సమున్నత లక్షణాలుగా భావించిన గురువుల స్థానంలో విషయాన్ని మాత్రమే బోధించే యంత్రాలుగా అధ్యాపకులు మారడం మన దురదృష్టం... దీనికిగల మూల కారణాలను విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ధనం విద్యను మింగడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. పిల్లల మన:స్థితిని గమనించకుండా బలంవంతంగా నెత్తిన రుద్దడం, కేవలం యాజమాన్య ఆకాం క్షలను పరిగణలోనికి తీసుకుని సంకెళ్లతో బంధించుకున్న అధ్యాపకుల వల్ల స్వేచ్ఛ గా ఎదగవలసిన విద్యార్థి చివరకు ఏమవుతున్నాడో ప్రతీరోజు చూస్తూనే ఉన్నాం. అధ్యాపకునికి స్వేచ్ఛా వాతావరణం కల్పించాలి. తన తరగతిలోని ప్రతీ విద్యార్థితో మమేకమయ్యే అవకాశం కల్పించాలి. ఏ దేశమైతే తనకున్న మేధావులైన గురుపరంపరతో ప్రపంచానికి తలమానికంగా నిలిచిందో అటువంటి మహోన్నత దేశాన్ని మనం తిరిగి నిర్మించుకోవాల్సిన విధానం అత్యంత వేగంగా జరగాలి.
- అట్లూరి వెంకటరమణ
సెల్ :9550776152