Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ గణేశ్ నినాదాలతో మారుమోగుతోంది. భిన్న కుల, మత, జాతి, ప్రాంత వర్గ ప్రజలు నిర్వహించుకునే పండుగల్లో గణేశ్ చతుర్థి ఒకటి. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. గణేశ్ ఉత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో నాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ భారతీయుల వాక్ స్వాతంత్య్రాన్ని హరించిన సందర్భం. సభలు, సమావేశాలు నిర్వహించకుండా నిబంధనలు విధించారు. భారతీయుల గొంతు నొక్కారు. జలియన్ వాలాబాగ్లో సమావేశమైన భారతీయులను కాల్చి చంపారు. 1919లో రౌలత్ చట్టం తెచ్చారు. అటువంటి సమయంలో స్వాతంత్య్రోద్యమ నాయకులు బాలగంగాధర తిలక్ 'మేము గణేశ్ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉత్సవాలు నిర్వహించుకుంటాం' అని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. నిజానికి ఆ అనుమతులు ఎందుకంటే.. గణేశ్ ఉత్సవాల పేరుతో.. మండపాలలో.. స్వాతంత్య్రం కోసం వ్యూహాలు రచించేవారు. నాయకులతో చర్చించేవారు. నాయకుల సమీకరణ జరిగేది. ఇంతటి చారిత్రక నేపథ్యం గల గణేశ్ ఉత్సవాలకు నేడు కొందరు మతం రంగు పులిమి తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు. నేడు చారిత్రక గణేశ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బాగానే ఉంది. కాని ఎలా నిర్వహిస్తున్నారన్నదే ప్రశ్న. ఉత్తరేణి, మారేడు వంటి ఔషధగుణాలు కలిగిన పత్రిలతో పసుపు లేక మట్టితో చేయాల్సిన గణేశ్ విగ్రహాలు అలా చేయడం లేదు. పర్యావరణ సమతుల్యత దెబ్బతీసే పీవోపీతో, రంగు రసాయనాలతో విగ్రహారాధన చేస్తున్నారు. అది కూడా మోతాదు మించి.. నేడు మండపాల వద్ద ఆధ్యాత్మిక ప్రవచనాలు, సిద్ధి, బుద్ధి గూర్చి చర్చలు కనుమరుగై కేవలం శబ్ద కాలుష్యం.. డీజే సౌండ్ మోతలు మాత్రమే వినిపిస్తున్నాయి. కాల్షియం సల్ఫేట్, డైహైడ్రేట్, జిప్సమ్, పాస్ఫరస్, మెగ్నీషియం వంటి రసాయనాలను బాగా వేడి చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమం తయారు చేస్తారు. అతి ప్రమాదకరమైన కర్బనం, ఆర్సినిక్, క్రోమియం లెడ్ వంటి రసాయనాలను ఆ మిశ్రమ గణేశ్ ఆకారాలకు రంగులుగా అద్దుతారు. ఆ విగ్రహాలు చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. నీటిలో ఆ విగ్రహాల భారీ లోహాల సాంద్రత పెరిగి.. చేపలు, ఇతర జీవులు చనిపోయే ప్రమాదముంది. ఈ మిశ్రమాలు కొన్ని ఏండ్ల తర్వాత నీటి అడుగు భాగంలో పొరలాగా ఏర్పడుతాయి. భూగర్భజలాలకు బీటలు ఏర్పడుతాయి. దీంతో భూగర్భజలాల ఉనికికే ప్రమాదం. పర్యావరణ సమతుల్యత జీవవైవిధ్యం దెబ్బతింటుంది. భారత రాజ్యాంగం 51 ఏ(జీ) ప్రకారం.. పర్యావరణ రక్షణ, అభివృద్ధి, సహజ వనరులు, అడవి, నదులు, చెరువులు, వన్యప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండటం పౌరుల ప్రాథమిక విధి. సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు పీవోపీ వాడకాన్ని తగ్గించాలి. స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కాని అవగాహనా రాహిత్యం ఇంకా ఎక్కువవుతోంది. ప్రతిష్ట కోసం వీధుల్లో పెద్దపెద్ద పీవోపీ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. మట్టి(మృణ్మయ) గణేశ్లు వాడాల్సిన అవసరముంది. మట్టి గణేశ్ను కూడా ఎంత ఎత్తు అంటే అంత ఎత్తు నిర్మించొచ్చు. పైగా మట్టి గణేశ్ నిమజ్జనం చెరువుల్లో శ్రేష్టదాయకం. ఎందుకంటే ఎండాకాలంలో చెరువులో మట్టి తవ్వి పొలాల్లో వేస్తే పంటకు మేలు జరుగుతుంది.
- అంబీర్ శ్రీకాంత్
సెల్:8185968059