Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పగలంతా తీరికలేని పనుల్లో అలసిపోయిన ఓ యువకుడు సాయంకాలం ముగుస్తుండగా ఆ శ్మశానంలోకి అడుగుపెట్టాడు. చీకటి దట్టమయ్యేవరకూ చెట్టూ పుట్టల మాటున గడిపి కటిక చీకటిలో కాలుతున్న శవాల మధ్య ప్రశాంతంగా ఓ రాతిబండపై నడుం వాల్చాడు. గస్తీ తిరుగుత్ను పోలీసు వాహనాలను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా నిశ్చింతగా నిద్రలోకి జారిపోయాడు. వేకువకంటే ముందే లేచి ఆ చీకట్లోనే మాయమయ్యాడు. అతడేమీ తాంత్రిక విద్యలభ్యసించే మాంత్రికుడు కాదు. రహస్య జీవితంలో ఉన్న కమ్యూనిస్టు. వేయి కండ్లతో వెంటాడుతున్న సర్కారు వేగుల నుంచీ పోలీసుల నుంచీ తప్పించుకోవడానికి ఆ శ్మశానమే తనకు సురక్షిత క్షేత్రమని భావించిన సాహసి. కానీ, అర్ధరాతిరి.. ఒక్కడే వచ్చి శవాల పక్కన పడుకోవడానికి ఎంత ధైర్యం కావాలి! ఆ దండి ధైర్యమే పర్సా సత్యనారాయణ..!
అతడు బొగ్గు బావుల్లో అగ్గి రాజేసి విప్లవజ్వాలలు వెలిగించినవాడు..
టన్నులకొద్దీ చైతన్యాన్ని టబ్బులనిండా నింపి కన్వేయర్లపై ఉద్యమాలను ఉరకలెత్తించినవాడు..
ఆకలికీ కన్నీళ్లకూ ఆయుధాలనందించి సాయుధపోరాటమై సాగినవాడు. ఆయన పుట్టింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలోని కంభంపాడు. తల్లిదండ్రులు వెంకటసుబ్బమ్మ, వెంకమరాజులు. చిన్ననాడే చదువుల కోసం అక్కా బావల ఇంటికి చేరిన పర్సాకు .. తన బావకు బదిలీ అయిన చోటల్లా బడి చదువు సాగింది. బావ తూములూరులో పని చేస్తున్నప్పుడు పదవ తరగతితో పాటే ఆ ఊరి లైబ్రెరీలోని డిటెక్టివ్ నవలలతో సహా అన్ని పుస్తకాలూ చదివేశాడు. చదువు పూర్తయ్యాక తన అన్న గుమస్తాగా పనిచేస్తున్న కారేపల్లికి ఆయన కుటుంబమంతా చేరిపోయింది. సింగరేణి కాలరీస్లో ఉద్యోగం కోసం కొత్తగూడెం చేరిన పర్సా.. అప్పటికే అక్కడ హెడ్ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్న కార్మిక నాయకుడు శేషగిరిరావు సహాయంతో 19ఏండ్ల వయసులో కొలువులో చేరిపోయాడు. ప్రజా ఉద్యమాలనుండే ప్రజానాయకులు ఉద్భవిస్తారనడానికి ఆయన జీవితమో చక్కని ఉదాహరణ. సింగరేణిలో గుమాస్తాగా చేరిన ఆ యువకుని జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో...! ఎన్ని ఉద్యమాలను నిర్మించిందో...! అతడిని ఎంత గొప్ప నాయకునిగా మలిచిందో..! ఆయన జీవితాన్ని ఏ వైపునుంచి చూసినా కనిపించేదంతా సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగిన క్రమమే కదా..!!
సింగరేణి గనుల్లోకి దిగడానికి కార్మికులకు కందిల్ (ఒక రకమైన దీపం) ఇచ్చేవారు. ఆ దీపం వెలుగులోనే కార్మికులు భూగర్భమంతా తిరుగాలి.. అదిగో ఆ దీపాల్లో పోసే కిరోసిన్ డ్రమ్ముల కేటాయింపులూ, లెక్కలూ రాసే పనే పర్సాది. అది కార్మికుల కఠోర శ్రమను, భద్రతలేని జీవితాలను దగ్గరినుంచి చూసే అవకాశం కల్పించిందాయనకు. ఆ తరువాత కొంత కాలానికి కార్మికులకు వారి మస్టర్ల కనుగుణంగా బియ్యమూ, జొన్నలూ, గోధుమలూ ఇచ్చే పని లో నియమించబడ్డాడు. ఇది కూడా కార్మికుల కష్టనష్టాలను అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడింది. వారి కనీస హక్కుల కోసం ఓ యూనియన్ ఏర్పాటుచేసుకునే అవకాశం కూడా లేకపోవడం ఆయనను మరింత కలచివేసింది. అసలే అవి రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు.. యుద్ధ అవసరాలకు బొగ్గు ఎగుమతుల రిత్యా నిజాం ప్రభుత్వం యూనియన్ కార్యక్రమాలను ఏ మాత్రం సహించేది కాదు. అలాంటి ప్రయత్నాలు ఏ మాత్రం చేసినా ఉద్యోగాలను కోల్పోవడమేగాక దారుణమైన శిక్షలకూ గురికావలసి వచ్చేది. కార్మికులు విన్నపాలు చేసుకోవటమే తప్ప సమ్మెలకు పూనుకోవడం ఊహకైనా అందని రోజులవి.. అలాంటి పరిస్థితుల్లో కార్మికులు తమ సమస్యలను పై అధికారులకు తెలియజేయడానికి పర్సా వద్ద పిటీషన్లు రాయించుకునేవారు. ఆ పిటిషన్ల ఆధారంగానే సింగరేణిలో కార్మికుల దుస్థితిని రహస్యంగా ప్రజాశక్తికి వ్యాసాలుగా రాసి పంపేవాడు. అవి రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీశాయి. దాంతో ప్రభుత్వం పర్సాను ఉద్యోగంలోంచి తొలగించింది. యూనియన్ ఎలా ప్రారంభించాలా అని ఎదురుచూస్తోన్న పర్సాకు ఇదొక అందివచ్చిన అవకాశమే అయింది. అప్పటిదాకా రహస్య కార్యకలాపాలకే పరిమితమవుతున్న నాయకత్వం కూడా ఈ అవకాశాన్ని వదిలిపెట్టదలచుకోలేదు. అంతే.. సింగరేణిలో అగ్గిరాజుకుంది. అది ఉద్యమమై ఉవ్వెత్తునలేచింది. పర్సా సత్యనారాయణ తిరిగి ఉద్యోగంలో పునర్ నియమింపబడేవరకూ సాగింది. ఇది సింగరేణిలో కార్మికులు పోరాడి సాధించుకున్న తొలి విజయమే కాదు.. బహిరంగంగా యూనియన్ స్థాపనకూ దారులు వేసిన గొప్ప సందర్భం కూడా..! పర్సా ఉద్యోగంలో చేరే నాటికి యూనియన్ కార్యకలాపాలన్నీ రహస్యంగానే ఉండేవి. నాయకత్వానికి తప్ప యూనియన్లో ఎవరెవరు ఉండేవారో సభ్యులకు కూడా తెలిసేది కాదు. అంత రహస్యంగా అంత జాగ్రత్తగా యూనియన్ కార్యకలాపాలు నడిచే పరిస్థితుల్ని ఈ సందర్భం మార్చింది. అలా 1945లో మొట్టమొదటిసారిగా 'సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్' ఏర్పాటయింది. ఈ ప్రారంభమే రాప్ట్రంలో బొగ్గుగని కార్మిక ఉద్యమానికి అతి పెద్ద ఆలంబనైంది. ఆ గనికార్మికోద్యమం పర్సాను తిరుగులేని కార్మికనాయకునిగానే కాదు, గొప్ప ప్రజానాయకునిగానూ తీర్చిదిద్దింది.
అప్పటికే తెలంగాణ మొత్తం నైజాం సర్కార్ అరాచకాలు అంతులేకుండా పెరుగుతున్న వేళ.. ఆ అరాచకాలకు ప్రతిఘటనగా ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు కదనానికి దిగుతున్న వేళ.. కార్మికరంగంలో పోరు విత్తులు చల్లే పనిని తీవ్రం చేశాడు పర్సా. 1947ప్రాంతంలో ఒకవైపు యూనియన్ బాధ్యతలు, మరోవైపు పార్టీ నిర్మాణ బాధ్యతల్లో తలమునకలవుతున్న పర్సా సత్యనారాయణపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. అరెస్టుకు అన్నీ సిద్ధం చేసింది. ఆయన ముందు రెండే మార్గాలు.. రాజీపడి ఉద్యోగంలో కొనసాగడమా? రాజీలేని పోరాటానికి ఉద్యోగం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడమా? ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి సందర్భాలు కొన్నెదురవుతాయి. అప్పుడు వారు తీసుకునే నిర్ణయాలే చరిత్రలో వారి స్థానాన్నీ నిర్ణయిస్తాయి. ఇక్కడ పర్సా ప్రజలకోసమే జీవితమనుకున్నాడు గనుకనే పోరాట మార్గమెంచుకున్నాడు. పోరాటమార్గమెంచుకున్నాడు గనుకనే చరిత్ర ఆయనను గుర్తుపెట్టు కుంది. నిజాంకు వ్యతిరేకంగా వీరతెలంగాణ విప్లపపోరాటం అంతకంతకూ ఉధృతమవుతున్న ఆ కాలం అతడిని సాయుధ పోరాటంలోకి ఆహ్వానించింది. మరో ఆలోచనే లేకుండా సాయుధ సమరాంగణంలోకి సాగిపోయాడు.
ఆ పోరాటంలోనే 1947లో నిజాం పోలీసులకు దొరికిపోయిన పర్సాను సంకెళ్లలో బంధించి ఓ మిలటరీ క్యాంపుకు తరలించారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులున్న ఆ యుద్ధవీరునిపై ఆ ఉత్తర్వులను అమలుపరుచడానికి ఓ అధికారిని నియమించారు. కాల్చే సమయానికి తన ఎదురుగా ఉన్నది మామూలు వ్యక్తికాదు, మహానాయకుడు పర్సా సత్యనారాయణని తెలిసిన ఆ అధికారి.. తనకు కాల్చడానికి చేతులు రావడంలేదని వదిలేసాడు. మరోవైపు అతని అరెస్టు పట్ల, కాల్చి చంపే ప్రయత్నాల పట్ల ప్రజల్లోనూ ఆందోళనలు పెల్లుబికాయి. ప్రజాగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం అతడిని ఆ మిలటరీ క్యాంపునుండి వరంగల్ జైలుకు, అటునుంచటే ఔరంగాబాద్ జైలుకు తరలించారు. కానీ.. ఉద్యమ పాఠాలతో బతుకు పోరాటానికి భవిష్యత్తునద్ది, కడగొట్టు జీవితాలను కూడగట్టి కదనరంగానికి నడిపించిన ఆ యోధుడికి ఆ జైళ్లు, నిర్బంధాలొక లెక్కా..!? ఎవరికీ తెలియకుండా బాత్రూం గోడకు చిన్న రంద్రం పెట్టి, రోజుకింత చొప్పున గోడను గీకి, సిమెంటు పెచ్చులూడతీసి, ఒక్కొక్కటిగా ఇటుకలను తీసేసి.. ఓ అర్థరాత్రి ఆ జైలు నుంచి తప్పించుకుని, అటునుంచటే వరంగల్ అడవుల్లో గెరిల్లా దళాలను కలుసుకున్న సాహసమతనిది..!
వరంగల్ అడవుల్లో సాయుధపోరాటం సాగిస్తుండగానే తిరిగి కొత్తగూడెం బాధ్యతల్లో పనిచేయాలన్న పార్టీ ఆదేశాల మేరకు... ఆ కర్తవ్య నిర్వాహణలో ఉండగా అరెస్టు చేసిన నిజాం పోలీసు అతడిని వరంగల్ జైలులో చిత్రహింసలు పెట్టింది. ఆ జైలు జీవితం నరకప్రాయం. జైలులో అతడిని 'డిస్పరేడో' అనేవారు. అంటే అన్నిటికీ తెగించిన మొండిఘటం అని అర్థం. కనుక అతడిని అక్కడ 'సోలిటరీ సెల్'లో బంధించారు. అంటే 8అడుగుల పొడవు, 6అ డుగుల వెడల్పు మాత్రమే ఉండే ఒంటరి జైలుగది. సూర్యచంద్రుల ప్రవేశానికి అవకాశమే లేని చీకటిగది. అటువంటి గదిలో కాళ్లూ చేతులకు బేడీలు వేసి, ఊచలకు కట్టేసి నెలల తరబడి హింసించారు. ఆహారంగా జొన్న లేదా సజ్జ, తవిద రొట్టెలు కొద్దిగా అన్నం ఆకుకూరల పులుసు ఇచ్చేవారు. కానీ ఆ రొట్టెల్లో పిండి కంటే రాళ్లు, ఇసుకే ఎక్కువ..! తినడానికి వీలుకాని తిండి. తినకుంటే బతుకలేని పరిస్థితి... ఏం చేయాలి? అవసరమే అనేకం నేర్పుతుందనడానికి ఆయన జైలు జీవితం కూడా ఓ ఉదాహరణే..! గిన్నెలో నీళ్లు పోసి, రొట్టెలను నానబెట్టి, ఆ తరువాత బాగా పిసికి.. ఆ రాళ్లన్నీ అడుగుకు పోయాక ఆ పై తేటను వేరే గిన్నెలో పోసుకుని పులుసుకూర లేదా పప్పు చారు కలుపుకుని తాగేవాడు. ఆ విధంగా రాళ్ల బాధ తప్పినా కూరలో వచ్చే లద్దె పురుగులు ఉడికిన వెల్లుల్లిపాయల్లా దర్శనమిచ్చేవి. చూస్తూ తింటే వొకారమొస్తుందని కండ్లు మూసుకుని మింగి బతికిన చరిత్ర ఆయనది. జీవితమంటే నిత్య సంఘర్షణే కదా! అలా తిన వీలుగాని తిండి తిని బతుకడం జీవనపోరాటమే కావచ్చుగానీ.. ఆ జీవితానికి వారిని సిద్ధం చేసిన సిద్ధాంతమెంత గొప్పదై ఉండాలి..? ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటానికి వారికి ప్రజల పట్ల ఎంతటి నిబద్ధత ఉండాలి...?!
1953లో జైలు నుండి విడుదలయ్యాక తిరిగి కార్మికోద్యమ నిర్మాణానికే అంకితమయ్యారాయన. మొదట ఏఐటీయూసీ నాయకునిగా తదుపరి సీఐటీయూ నాయకునిగా కార్మికోద్యమంలో ఆయనది విడదీయలేని పాత్ర. సుదీర్ఘకాలం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన కాకలుతీరిన కార్మికనేత ఆయన. కార్మికవర్గ నిర్మాణంలో నిరంతరం సోషలిస్టు చైతన్యంతో వెలిగిన ఉత్తమశ్రేణి నాయకుడాయన. ఆర్థిక పరిణామాల గుట్టు విప్పినా, రాజకీయ భూగోళాన్ని వివరించినా రాజకీయ పాఠాలను పండితపామర రంజకంగా బోధించిన ఉపాధ్యాయుడాయన. కార్మిక నేతగానే కాదు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగానూ ఆయన రాజకీయ పాఠాల ముఖచిత్రం. 1962లో పాల్వంచ నియోజకవర్గ ఎమ్మెల్యేగానూ ఆయన ప్రజాభిమానం చూరగొన్నాడు.
సంప్రదాయ కుటుంబంలో పుట్టి, యగ్యోపవీతాన్ని వీడి, 19వ ఏట కొత్తగూడెంలో సింగరేణి బొగ్గుగనుల్లో కమ్యూనిస్టుగా మారిన పర్పా సత్యనారాయణ ఏడు దశాబ్దాల ఉద్యమ జీవితానికి అన్ని వేళలా వెన్నుదన్నుగా నిలిచింది ఆయన సహచరి భారతి. పెండ్లయిన ఏడాదిలోపే భర్తకు జైలు.. నిత్యం పోలీసుల దాడులు, సోదాలు.. బెదిరింపులకు ఆవిడ ఏ మాత్రం చెదరలేదు! విప్లవకారుడైన భర్త జీవితాచరణే ఆవిడకు స్ఫూర్తినిచ్చింది. పోలీసులు ఇంట్లో కాగితాలన్నీ సోదా చేస్తుంటే,, పార్టీ రహస్యాలు బయటపడుతాయేమోనని వారి కండ్లుగప్పి ఆ కాగితాలన్నీ నమిలి మింగేసింది. కుటుంబ భారాన్ని తను మోస్తూ, ఉద్యమాల బాధ్యతల్లో భర్తకు అండగా నిలిచి విప్లవ సహచర్యానికి అర్థం చెప్పింది. విప్లవకారుల జీవితాలెప్పుడూ పూల పాన్పులు కాదు. అవి ముండ్లూ రాళ్లతో నిండిన దారులు. ఇవి వారికే కాదు, వారి జీవిత సహచరులకూ తప్పవు. పర్సా సత్యనారాయణ ఆ ముండ్లూ రాళ్ల దారుల్లో అవరోధాలను ఛేదించుకుంటూ ముందుకు సాగిన విప్లవ యోధుడు. బతుకును పోరాటం చేసి భావితరాలకు ఉద్యమ పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు. నేటి సంక్షోభాల కాలంలో ఆ మహనీయున్ని తలచుకోవటమంటే.. పోరాటాలతో కరచాలనం చేయటమే..! విప్లవాన్ని ముద్దాడటమే..!!
- స్ఫూర్తి
సెల్ : 9490098694