Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొమ్మొకరిది... సోకొకరిది అన్న సామెత బీజేపీకి బాగా సరిపోతది. తమదికాని దానికోసం చరిత్రను మార్చేందుకు కాషాయనేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ విలీనాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు గత కొన్నేండ్లుగా వీరు చేస్తున్న ప్రయత్నాలు తారాస్థాయికి చేరడంతో మేధావులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. పటేల్ను దత్తత తీసుకొని కమలదళం చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలను సైతం పక్కదారి పట్టిస్తున్నది. నిజాం కబంధహస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్గించేందుకు జరిగిన సాముధపోరాటం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించతగ్గది. 4వేల మంది అమరుల బలిదానం, 10 లక్షల ఎకరాల భూపంపిణి చేసిన మహౌజ్వల పోరాటానికి దడిసిన నిజాం తోకముడిచి భారత్లో విలీనమయ్యేందుకు కేంద్రంతో చేసుకున్న ఒప్పందమే ఆయన ఆస్తులను కాపాడిందనేది చరిత్ర. ఇంతటి అజరామరమయిన చరిత్రను వక్రీకరిస్తూ పటేల్ను పక్కలో వేసుకొని బీజేపీ అసత్య ప్రచారానికి తెగబడింది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లె వేస్తే అదే నిజమౌతుందనే భ్రమలో ఉన్న కమలదళం తెలంగాణలో పాగా వేసేందుకు ఎంతకైనా తెగించేందుకు పావులు కదుపుతున్నది. భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలతో కలిసి మెలిసుండే ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కాషాయదళం కాలకూట విషాన్ని చిమ్మేందుకు వస్తున్నది తస్మాత్ జాగ్రత్త.
- ఊరగొండ మల్లేశం