Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ వారం రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్.. శాసనసభలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఆయన ఆర్థిక మాంద్యం గురించి ఏకరువు పెట్టారు. వస్తు సేవా రంగం, పరిశ్రమలు, పౌర విమానయానం, ఓడరేవులు.. తదితర రంగాలు మాంద్యం వల్ల విలవిల్లాడుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం వినేవారికి ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్టా..? లేక కేంద్ర బడ్జెట్టా..? అనేంతగా ఆయన స్పీచ్ కొనసాగింది. సరే.. ఈ విషయాన్ని పక్కనబెడితే ఆయన ప్రసంగంలో ఆణిముత్యంలాంటి నాలుగు మాటలను నొక్కి వక్కాణించారు. అదేంటంటే... మాంద్యం ప్రభావం రాష్ట్ర ఖజానాపై కూడా పడింది. అందుకే బడ్జెట్టును తగ్గించాం. అందువల్ల దుబారా తగ్గించుకుని.. పొదుపు చర్యలను చేపట్టాలంటూ మంత్రులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులనూ ఆదేశించామంటూ అసలు సంగతి బయటపెట్టారు. ఇక్కడో గమ్మత్తయిన విషయం దాగుంది. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మన గులాబీ దళపతి.. అనేక గుళ్లూ, గోపురాలను సందర్శించారు. చేతికి ఎముక లేదన్నట్టు కోట్లు వెచ్చించి.. బంగారు కిరీటాలు, ముక్కు పుడకలు, మీసాలతో మొక్కులు చెల్లించారు. ఆయా క్షేత్రాలు సందర్శించేందుకుగానూ కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక విమానాల్లో తరళివెళ్లారు. రూ.50 కోట్లతో ప్రగతి భవన్ కట్టించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు మాంద్యం, మాంద్యం అంటూ ఒకవైపు మొత్తుకుంటూనే బ్రహ్మాండంగా ఉన్న సచివాలయాన్నీ, సర్వ హంగులతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీనీ కాదని.. కొత్త సెక్రటేరియట్ను, నూతన శాసనసభనూ నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకవైపు దుబారా వద్దు.. పొదుపే ముద్దంటున్న కారుసారు.. ఇదే సమయంలో కొత్త నిర్మాణాలకు ఎందుకు పచ్చజెండా ఊపుతున్నాడబ్బా..? అని తెలంగాణ సామాన్యుడు అదే పనిగా సణుగుతున్నాడు.
-బి.వి.యన్.పద్మరాజు